హైదరాబాద్: శాసనసభలో ప్రతిపక్షం దాడిని గట్టిగా తిప్పికొట్టాలని ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులకు పిలుపు ఇచ్చారు. మంత్రులతో సిఎం సమావేశం ముగిసింది. సమావేశంలో సిఎం మంత్రులకు క్లాస్ తీసుకున్నారు. రాజకీయ హత్యల అంశంపై ప్రతిపక్షం ఎత్తుగడను తిప్పికొట్టాలన్నారు. లేదంటే ప్రజల్లో మనపై తక్కువ అభిప్రాయం ఏర్పడుతుందని చెప్పారు. ఈరోజు కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు బాగా స్పందించారని ప్రశంసించారు. రేపటి నుంచి మంత్రులంతా దూకుడుగా వ్యవహరించాలని సలహా ఇచ్చారు.
తన చరిత్రలో ఎప్పుడూ హత్యారాజకీయాలను ప్రోత్సహించలేదని చెప్పారు. రూల్స్ ప్రకారం వస్తే చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ప్రతిపక్షం చెప్పినట్లు చేయాలంటే తాము చేయం అని చెప్పారు. చర్చ ఫలప్రదంగా సాగాలన్నారు. తాను తీవ్రవాదులు, రౌడీలను గతంలో అణచివేసినట్లు చెప్పారు. ఇంకా తమ ప్రభుత్వం సెటిల్ కాలేదన్నారు. చాలా సమస్యలున్నాయని, అలాంటప్పుడు సభ ఇలా జరగడం బాధాకరం అన్నారు.
మొదటి సారి ఎమ్మెల్యేలు అయినవారు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. హౌస్లో ఎలా ఉండాలో నేర్చుకోవాలని చంద్రబాబు అన్నారు.