చందనోత్సవంలో ‘చంద్రన్న’ భజన

8 May, 2019 10:23 IST|Sakshi
వేద ధర్మ రక్షణ సభ పేరిట చంద్రబాబును కీర్తిస్తూ క్యూలైన్ల వద్ద ఏర్పాటు చేసిన బ్యానర్లు

సాక్షి, విశాఖపట్నం: ఉత్తరాంధ్ర ఇలవేల్పు సింహాద్రి అప్పన్న చందనోత్సవం భక్తజనకోటికి పర్వదినం. ఏడాదికోసారి అప్పన్న నిజరూపం.. భక్తులకు లభించే అపరూప దర్శనం.. అలాంటి ఆధ్యాత్మిక పండుగ రోజున లక్ష్మీ నరసింహస్వామి వారి నామస్మరణతో మార్మోగాల్సిన సింహాచలం కొండపై అడుగడుగునా అధికార పార్టీ బ్యానర్లు దర్శనమివ్వడం చర్చనీయాంశంగా మారింది. ఓ వైపు ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్న వేళ.. సింహాచలం కొండపై ముఖ్యమంత్రి చంద్రబాబును కీర్తిస్తూ వెలిసిన బ్యానర్లను చూసి భక్తులు అవాక్కయ్యారు. క్యూలైన్లతో పాటు సింహాచలం కొండపై అడుగడుగునా వేద ధర్మరక్షణ సభ పేరిట ఏర్పాటుచేసిన ఈ బ్యానర్లలో నదుల అనుసంధానం.. నరులు అందరికి ఆనందం.. పట్టిసీమతో ప్రారంభం... పోలవరంతో పరిపూర్ణం.. అన్ని నదులకు జలహారతులు.. అన్నదాతలకు ఆత్మానందస్మృతులు..జీడీపీలో ఆంధ్రప్రదేశ్‌ ముందు.. గిన్నిస్‌ బుక్‌ వరల్డ్‌ రికార్డుల్లోనూ ముందు అందుకే చంద్రన్నా మీరు అసలైన భగీరథులు అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబును కీర్తిస్తూ వెలసిన బ్యానర్లుపెద్ద దుమారాన్ని రేపుతున్నాయి.

సింహాచలం కొండపై ఎటువంటి రాజకీయ ప్రచారం చేయకూడదు. రాజకీయ బ్యానర్లు, పార్టీ ప్రచారాలు చేయకూడదు. పైగా కోడ్‌ వేళ ఎలాంటి ప్రచారాలు చేయకూడదు. అలాంటి సింహాద్రి అప్పన్నను కీర్తించే చోట చంద్రన్నను కీర్తిస్తూ వెలిసిన బ్యానర్ల వెనుక సింహాచలం దేవస్థానం అధికారులున్నారన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి. అధికార పార్టీకి కొమ్ము కాసే అధికారుల అండదండలతోనే వేద ధర్మ రక్షణ సభ పేరిట టీడీపీ నేతలు ఈ బ్యానర్లు ఏర్పాటుచేశారని చెబుతున్నారు. దేవస్థానం ఆధ్వర్యంలో ఎంతో ఆధ్యాత్మికంగా నిర్వహించిన చందనోత్సవంలో టీడీపీకి చెందిన ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం ఎంతవరకు సమంజసమని విశ్వహిందూ పరిషత్‌ ప్రశ్నించింది. అధికార పార్టీ విపరీత చర్యలను వీహెచ్‌పీ తీవ్రంగా ఖండిస్తోంది. ఎవరైతే ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసారో వారిపై చర్యలు తీసుకోవాలని వీహెచ్‌పీ నేత పూడిపెద్ది శర్మ డిమాండ్‌ చేశారు.

మరిన్ని వార్తలు