అధికారంలోకి వచ్చిన వెంటనే కమీషన్ల కోసం కాంట్రాక్టర్లతో సీఎం చంద్రబాబు రాయ‘బేరం’
సాగునీటి ప్రాజెక్టుల పనులలో ‘ధరల సర్దుబాటు’ కింద అదనపు నిధులు ఇస్తూ జీవో 22 జారీ
ఈపీసీ పద్ధతికి విరుద్ధంగా పరిమాణాల ఆధారంగా అదనపు బిల్లుల చెల్లింపునకు గ్రీన్ సిగ్నల్
25 ప్రాజెక్టుల అంచనా వ్యయం రూ.39,935.34 కోట్ల నుంచి.. రూ.96,785.72 కోట్లకు పెంపు
60సీ కింద పాత కాంట్రాక్టర్పై వేటు వేసి, అంచనాలను పెంచేసి కోటరీ కాంట్రాక్టర్లకు అప్పగింత
ప్రతిఫలంగా కాంట్రాక్టర్ల నుంచి రూ.25 వేల కోట్లు కమీషన్లు వసూలు చేసుకున్న చంద్రబాబు
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ధరల సర్దుబాటు కింద అదనపు నిధులు ఇవ్వడాన్ని తప్పుపట్టిన వైనం
గవర్నర్ అభయన్స్లో పెట్టిన ఉత్తర్వులను అమలు చేయడంలో ‘లోగుట్టు’ కమీషన్ల దందానే!
ఐదేళ్లుగా అంచనాలు పెంచి.. దర్జాగా పంపకాలు ఆ కమీషన్ల లెక్కే వేరు!ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తప్పన్నది.. అధికారంలోకి రాగానేఒప్పవుతుందా? అధికారంలో లేనప్పుడు అక్రమమన్నది..అధికారం చేపట్టగానే సక్రమమవుతుందా? విపక్షంలో ఉన్నప్పుడుప్రజావ్యతిరేకంగా కన్పించిన ఉత్తర్వులు.. పదవిలోకి రాగానేప్రజాభ్యుదయంగా కన్పిస్తాయా? ముఖ్యమంత్రి చంద్రబాబుతీరు మాత్రం అలానే ఉంది. జీవో22+జీవో63=రూ.56,850.38 కోట్లు.... ఇది గణితంలో సూత్రమో.. రసాయనిక సమీకరణమో..అనుకుంటే తప్పులో కాలేసినట్లే! ముఖ్యమంత్రి చంద్రబాబుకమీషన్ల లెక్క ఇది. ఆ లెక్క కథాకమామిషు..
ఎ. రాంగోపాల్రెడ్డి ,సాక్షి, అమరావతి :రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల పనుల్లో డీజిల్, సిమెంట్, స్టీలు ధరలు పెరిగాయనే నెపంతో ధరల సర్దుబాటు కింద అదనపు బిల్లులు చెల్లించడానికి వీలుగా ఫిబ్రవరి 7, 2014న నాటి కిరణ్కుమార్రెడ్డి ప్రభుత్వం ఉత్తర్వులు (జీవో 13)జారీ చేసింది. కమీషన్ల కోసం అప్పటి సీఎం కాంట్రాక్టర్లతో కుమ్మక్కై ఈ ఉత్తర్వులు జారీ చేశారని గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్కు ప్రతిపక్షాలు ఫిర్యాదు చేయడంతో.. వాటిని ఆయన అభయన్స్(నిలుపుదల)లో పెట్టారు. కాంగ్రెస్ అధిష్ఠానం ముడుపుల కోసం కాంట్రాక్టర్లతో కుమ్మక్కై ఈ ఉత్తర్వులు జారీ చేయించిందని.. దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు భారీగా నష్టం చేకూరుతుందని.. అధికారంలోకి రాగానే వాటిని రద్దు చేస్తామని అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నమ్మబపలికారు.
అధికారంలోకి రాగానే
రాష్ట్ర విభజన నేపథ్యంలో.. 2014 ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అధికారంలోకివచ్చాక కాంట్రాక్టర్లతో కుమ్మక్కైన సీఎం చంద్రబాబు.. కమీషన్ల కోసం బేరసాలు జరిపారు. కమీషన్ల లెక్క తేలడంతో గవర్నర్ అభయన్స్లో పెట్టిన జీవో 13లో కాంట్రాక్టర్లకు మరింతగా ప్రయోజనం చేకూర్చేలా నిబంధనలు మార్పు చేసి.. ఫిబ్రవరి 23, 2015న ‘ధరల సర్దుబాటు’ కింద కాంట్రాక్టర్లకు అదనపు బిల్లులు మంజూరు చేసేలా జీవో 22ను జారీ చేయించారు. కాంట్రాక్టర్లకు ప్రభుత్వ ఖజానానుదోచిపెట్టడంలో చంద్రబాబు అంతటితో ఆగకుండా.. ఈపీసీ(ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్) మౌలిక సూత్రాలను తుంగలో తొక్కుతూ పనుల పరిమాణాల ఆధారంగా అదనపు బిల్లులు చెల్లించడానికి జీవో 63ను జారీ చేయించారు. ఈ రెండు ఉత్తర్వుల వల్ల.. ప్రభుత్వ ఖజానాపై పెను భారం పడుతుందని, ప్రజాభ్యుదయానికి గొడ్డలిపెట్టని ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేశాయి. కాంట్రాక్టర్లకు దోచిపెట్టడానికే ఈ ఉత్తర్వులు జారీ చేశారని సాగు నీటి రంగ నిపుణులు సైతం స్పష్టం చేశారు. అయినా లెక్క చేయని చంద్రబాబు పనులు గిట్టుబాటు కాకుంటే– కాంట్రాక్టర్లను కొట్టినా పనులు చేయరంటూ వారి తరఫున వకల్తా పుచ్చుకుని మాట్లాడారు. సాగునీటి ప్రాజెక్టులు వేగంగా పూర్తి చేయడానికే ఈ జీవోలు జారీ చేసినట్లు సమర్థించుకున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తప్పుపట్టిన ఉత్తర్వులనే.. అధికారంలోకి రాగానే సమర్థించడం ద్వారా చంద్రబాబు తన నైజాన్ని మరోసారి బయటపెట్టుకున్నారు.
పెంచుకో.. పంచుకో
సాగునీటి ప్రాజెక్టుల పనులు చేస్తున్న కాంట్రాక్టర్లు అడిగిన మేరకు కమీషన్లు ఇవ్వకపోతే ఏపీడీఎస్ఎస్(ఆంధ్రప్రదేశ్ డీటెయిల్డ్ స్టాండర్డ్ స్పెసిఫికేషన్స్)లో 60సీ నిబంధన కింద చంద్రబాబు వేటు వేయించారు. ఆ తర్వాత జీవో 22, జీవో 63లను వర్తింపజేసి అంచనా వ్యయం పెంచేస్తూ ఉత్తర్వులు జారీ చేయించారు. ఇలా గత ఐదేళ్లలో 25 ప్రాజెక్టుల అంచనా వ్యయాన్ని రూ.39,935.34 కోట్ల నుంచి ఏకంగా రూ.96,785.72 కోట్లకు పెంచేశారు. ఆ తర్వాత కమీషన్లు ఇచ్చే కాంట్రాక్టర్లకు ఆ పనులను కట్టబెట్టి భారీఎత్తున కమీషన్లు దండుకున్నారు. గత ఐదేళ్లలో సాగునీటి ప్రాజెక్టుల కోసం రూ.65,345.45 కోట్లు ఖర్చు చేశారు. ఇందులో నీరు–చెట్టు కింద రూ.11,797.15 కోట్లు, అటవీ శాఖ ద్వారా ఖర్చు చేసిన రూ.185.07 కోట్లుపోను మిగతా రూ.53,363.23 కోట్లను సాగునీటి ప్రాజెక్టుల పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించారు.. ఇందులో జీవో 22, జీవో 63ల ఆధారంగా చెల్లించిన బిల్లులే రూ.40 వేల కోట్లకుపైగా ఉంటాయని అంచనా. కాంట్రాక్టర్లకు దోచిపెట్టిన రూ.40వేల కోట్లలో కనీసం రూ.25 వేల కోట్లు కమీషన్ల రూపంలో చంద్రబాబు వసూలు చేసుకున్నారని చెబుతున్నారు.. 2015–16, 2016–17లలో కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) తన నివేదికల్లో అంచనా వ్యయాన్ని పెంచేయడంపై రాష్ట్ర ప్రభుత్వ తీరును తూర్పారబట్టింది.
పూర్తికాని ప్రాజెక్టులు
ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం వల్ల కాంట్రాక్టర్లకు భారీ ఎత్తున ప్రయోజనం చేకూరింది. అయినా పనులు పూర్తి చేశారా అంటే అదీ లేదు. అదనంగా ఒక్క ఎకరాకూ నీళ్లందించిన దాఖలాలు లేవు. 2013–14 సామాజిక ఆర్థిక సర్వే.. కేవలం రూ.760 కోట్లు ఖర్చు చేయడం ద్వారా– గుండ్లకమ్మ, తోటపల్లి, జంఝావతి, భూపతిపాలెం, ముసురుమిల్లి వంటి 11 ప్రాజెక్టులు పూర్తి చేయవచ్చునని.. ఫలితంగా 2.60 లక్షల ఎకరాల ఆయకట్టుకు కొత్తగా సాగు నీళ్లందించవచ్చునని తేల్చిచెప్పింది. కానీ కమీషన్లు రావనే నెపంతో ఆ ప్రాజెక్టుల పనులకు నిధులు కేటాయించకుండా చంద్రబాబు సర్కారు మోకాలడ్డింది. కేవలం కమీషన్లు వచ్చే పనులకే ప్రాధాన్యత ఇచ్చింది. వీటిని పరిగణనలోకి తీసుకుంటే... జీవో 22, జీవో 63లను జారీ చేయడంలో ప్రజాభ్యుదయం కంటే.. కాంట్రాక్టర్లకు ప్రయోజనం, ప్రభుత్వ పెద్దలకు కమీషన్లే ముఖ్యమని స్పష్టమవుతోంది.
ఐదేళ్లలో భారీగా పెరిగినప్రాజెక్టుల అంచనా వ్యయం