కేంద్రానికి బయపడే సీబీఐపై జీవో
చంద్రబాబుపై విజయసాయి రెడ్డి ధ్వజం
సాక్షి, అమరావతి : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడులా విర్రవీగిన నియంతలంతా చరిత్ర కాలగర్భంలో కలిసిపోయారని వైఎస్సార్ సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మండిపడ్డారు. శుక్రవారం ఆయన ట్విటర్ వేదికగా చంద్రబాబును విమర్శించారు. ‘చంద్రబాబు.. మీరో రాజు, మీదో రాజ్యం అనుకుంటున్నారా? వ్యవస్థల్ని భ్రఘ్ట పట్టించిన మిమ్మల్ని.. సవాలు చేసే వారందరినీ అడ్డుతొలగించుకోవాలని చూస్తున్నారు. మీలాగే విర్రవీగిన వారంతా కాలగర్భంలో కలిసిపోయ్యారు. వైఎస్సార్ సీఎంగా ఉన్న సమయంలో ప్రతి ఆరోపణపై సీబీఐ దర్యాప్తు కోరేవారు. వైఎస్సార్కు ఉన్న ధైర్యం చంద్రబాబుకు ఉందా?’ అని ట్విటర్లో ప్రశ్నించారు.
ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని హత్య చేయడానికి ఎయిర్పోర్టు వేదికగా స్కెచ్ వేసింది మీరేనని ఒప్పుకున్నారని ఆయన అన్నారు. అందుకే కేంద్రం ఎక్కడ సీబీఐ దర్యాప్తుకు ఆదేశిస్తోందనన్న భయంతో సీబీఐకి తలుపులు మూసేస్తూ జీవో ఇచ్చారని ఆరోపించారు. టీడీపీపై కేంద్రం కక్ష సాధించకుండా ఇది ముందస్తు జాగ్రత్త చర్య అంటూ ఓ వర్గానికి చెందిన మీడియా ప్రచారం చేస్తోందని ఆయన మండిపడ్డారు. ఓవైపు తిత్లీ తుపాను పునరావాస పనుల కోసం విరాళాలు అడుగుతూనే మరోవైపు కోట్లు ఖర్చు పెట్టి ప్రకాశం బ్యారేజీలో ఎఫ్1 స్పీడ్ బోటు పోటీలను నిర్వహించి ప్రజాధనం వృధా చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు.