అయినా మనిషి మారలేదు

4 Apr, 2019 11:58 IST|Sakshi

చంద్రబాబు తీరుతో విసిగి వేసారిన ప్రభుత్వ ఉద్యోగులు

ఉద్యోగులకు రెండు డీఏల పెండింగ్‌

నాలుగున్నరేళ్లుగా పట్టించుకోని వైనం 

ఎన్నికల ముందు ఐఆర్‌ జీఓ

పనిచేయని హెల్త్‌కార్డులు

27 శాతం ఐఆర్, సకాలంలో పీఆర్సీ ఇస్తామని వైఎస్‌ జగన్‌ హామీ

‘మారిన మనిషిని నేను.. నన్ను నమ్మండి.. మీ జోలికి రాను’ అని 2014 ఎన్నికల సమయంలో ప్రభుత్వ ఉద్యోగులతో ముఖ్యమంత్రి చంద్రబాబు అన్న మాటలివి.. బాబు చెప్పిన మాటలు నమ్మిన ఉద్యోగులు ఆయనను ముఖ్యమంత్రి కుర్చీలో కుర్చోబెట్టారు. ఎన్నికల్లో విజయం సాధించిన ఆయన ఉద్యోగుల సమస్యలను పట్టించుకోలేదు. సమస్యలు పక్కనబెట్టి క్షణం తీరిక లేకుండా టెలీకాన్ఫరెన్స్‌లు, వీడియో కాన్ఫరెన్స్‌లు, సమీక్షలు అంటూ వారిని పరుగులు తీయించాడు. నాలుగున్నర సంవత్సరాలు ఉద్యోగులకు నిద్రలేకుండా చేసిన చంద్రబాబు వారి జీవితాలతో ఆడుకున్నాడు. బాబు తీరుతో విసిగిపోయిన ప్రభుత్వ ఉద్యోగులు నిన్ను నమ్మం బాబూ అంటూ తేల్చిచెబుతున్నారు. 

నెల్లూరు(పొగతోట): 2019 ఎన్నికలు సమీపించడంతో మళ్లీ ఇప్పుడు సీఎం చంద్రబాబుకు ప్రభుత్వ ఉద్యోగులపై అభిమానం పెరిగిపోయింది. 20 శాతం ఐఆర్‌ ఇస్తూ కొద్దిరోజుల క్రితం జీఓ జారీ చేశారు. పీఆర్సీ కమిటీ వేయడంలోనూ జాప్యం చేశాడు. తెలంగాణ ప్రభుత్వం 43 శాతం ఫిట్‌మెంట్‌ ప్రకటించడంతో చేసేదేమీ లేక చంద్రబాబు గత ప్రభుత్వం ఇచ్చిన 29 శాతం కలుపుకుని 43 శాతం ఫిట్‌మెంట్‌ ప్రకటించాడు. చంద్రబాబు ప్రకటించింది 14 శాతం మాత్రమే. చంద్రబాబుకు భజన సంఘాలు ఉన్నాయి.

ఉద్యోగుల సమస్యల పట్ల నిర్లక్ష్యంగా ఉంటున్న ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన ఆ సంఘాలు భజన బృందాలుగా మారిపోయాయి. ఉద్యోగులకు హెల్త్‌కార్డులకు సంబంధించి గెజిటెడ్‌ ఉద్యోగుల నుంచి నెలకు రూ.120, నాన్‌ గెజిటెడ్‌ ఉద్యోగుల నుంచి రూ.90 వసూలు చేస్తున్నారు. హెల్త్‌కార్డుల ద్వారా ఉద్యోగులకు వైద్యసేవలు అందడం లేదు. హెల్త్‌కార్డుల ద్వారా మెరుగైన వైద్యసేవలు అందక ఉద్యోగులు, పెన్షనర్లు, కార్మికులు నానా అవస్థలు పడుతున్నారు. ఈ విషయంపై ఉద్యోగ సంఘాలు ఆందోళన చేసినా ఫలితం లేదు.

ఉద్యోగుల ఆశలపై నీళ్లు
జిల్లాలో 28 వేల మందికిపైగా ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. సుమారు 25 వేల మంది కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు ఉన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఉద్యోగులతో అధికంగా పనులు చేయించుకోవడమే కానీ వారికి ఉపయోగపడింది చాలా తక్కువ. ప్రభుత్వ ఉద్యోగులకు రెండు డీఏలు ప్రకటించి పెండింగ్‌లో ఉన్నాయి. మూడో డీఏ కూడా రాబోతుంది. ప్రభుత్వ ఉద్యోగులకు ఐఆర్‌ ప్రకటించి జీఓ విడుదల చేస్తే నగదు వెంటనే తీసుకునే అవకాశం ఉంటుంది. ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన ఐఆర్‌ జీఓ ఉద్యోగుల కంటితుడుపు చర్యగా ఉంది. చంద్రబాబు చరిత్రలో లేని విధంగా ఎన్నికల ముందు ఐఆర్‌ జీఓ విడుదల చేశాడని విమర్శలు వినిపిస్తున్నాయి.

ఐఆర్‌ ప్రకటించి జూన్‌లో నగదు తీసుకునేలా జీఓ విడుదల చేయడం పట్ల ఉద్యోగులు అసంతృప్తితో ఉన్నారు. వైద్య ఆరోగ్యశాఖ ఇతర శాఖల్లో పనిచేస్తున్న వేలాది మంది ఉద్యోగుల ఆశలపై నీళ్లు చల్లుతూ జీఓ నంబర్‌ 27ను తీసుకువచ్చారు. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్‌ చేస్తానని 2014 ఎన్నికల్లో హామీ ఇచ్చాడు. ఇంతవరకు అమలు చేయలేదు. 2019లో కూడా ఇదే హామీ ఇచ్చాడు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు రాయితీలు కోల్పోతున్నారు. చంద్రబాబు తీరుతో ప్రభుత్వ ఉద్యోగులు విసిగి వేసారిపోయారు.

నిన్ను నమ్మం బాబూ అంటూ తేల్చిచెబుతున్నారు. సీఎంకు ఉద్యోగుల పట్ల చిత్తశుద్ధి ఉంటే 2018 జూలై నుంచి అరియర్స్‌ ఇవ్వాలని ఉద్యోగులు డిమాండ్‌ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం డీఏ ప్రకటించిన వెంటనే రాష్ట్ర ఉద్యోగులకు డీఏ ఇవ్వాలని ఉద్యోగులు కోరుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన విధంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు గ్రాట్యుటీ రూ.20 లక్షలకు పెంచాలని కోరుతున్నారు. ఉద్యోగులకు తక్కువ ధరలకు నివాస స్థలాలు కేటాయించాలని ఇలాంటివి చేసే ప్రభుత్వం రావాలని ఉద్యోగులు కోరుతున్నారు.

ఐఆర్‌ 27 శాతం ప్రకటించిన వైఎస్‌ జగన్‌

వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే ప్రభుత్వ ఉద్యోగులకు 27 శాతం ఐఆర్, సకాలంలో పీఆర్సీ, 43 శాతం కన్నా మిన్నగా ఫిట్‌మెంట్‌ ఇస్తామని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీతో ప్రభుత్వ ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు