కలాం నా దగ్గరే విజన్‌ నేర్చుకున్నారు..

9 Nov, 2019 10:44 IST|Sakshi

మీడియా సమావేశంలో చంద్రబాబు

అగ్రిగోల్డ్‌ బాధితులకు పరిహారం ఇద్దామనుకుంటే ‘కోడ్‌’ అడ్డొచ్చింది

ఏపీని నంబర్‌–1 చేసే అదృష్టం నాకు లేదు.. అంటూ వ్యాఖ్య

చంద్రగిరి(చిత్తూరు జిల్లా): నేను సీఎంగా ఉన్నప్పుడు విజన్‌–2020తో ముందుకెళ్లాను.. నా విజన్‌ గురించి తెలుసుకున్న దివంగత రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం.. ఆ విజన్‌కు సంబంధించిన పలు పత్రాలను తీసుకెళ్లి దేశ ఆర్థిక విజన్‌పై ఓ పుస్తకాన్ని విడుదల చేశారు’ అని ప్రతిపక్ష నేత చంద్రబాబు చెప్పారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి సమీపంలోని మామండూరు వద్ద మూడు రోజుల జిల్లాస్థాయి టీడీపీ విస్తృతస్థాయి సమావేశాలు నిర్వహించారు. అనంతరం శుక్రవారం రాత్రి మీడియాతో మాట్లాడారు. అగ్రిగోల్డ్‌ బాధితులకు తెలుగుదేశం ప్రభుత్వం పరిహారం చెల్లించేందుకు సిద్ధమైందని, ఎన్నికల కోడ్‌ వల్ల అది ఆగిపోయిందన్నారు. అయితే ఇప్పుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఆ నగదును బాధితులకు చెల్లించిందని చెప్పారు. తాను సీఎంగా ఉన్న సమయంలో రాష్ట్రం రెండంకెల అభివృద్ధిని సాధించిందని చెప్పారు. రాష్ట్రాన్ని నంబర్‌–1గా తీర్చిదిద్దాలని ఎంతో ప్రయత్నించానని, అయితే ఆ అదృష్టం తనకు లేదన్నారు.

మంత్రులు, ఎమ్మెల్యేల సంగతి తేలుస్తా..
‘మంత్రులు, ఎమ్మెల్యేలు అతి చేస్తే మీ సంగతేంటో చూస్తా’.. అంటూ చంద్రబాబు హెచ్చరించారు. ‘మీరు రోడ్లపైకి వచ్చే రోజు వస్తుంది.. అప్పుడు మీ సంగతి తేలుస్తా’ అంటూ బెదిరించారు.
 

మరిన్ని వార్తలు