ఏపీ సీఎం చంద్రబాబు వెల్లడి

16 Dec, 2018 02:22 IST|Sakshi

సాక్షి, అమరావతి: మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రుల ప్రమాణ స్వీకారానికి హాజరుకానున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ఈ నెల 17న మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రుల ప్రమాణ స్వీకారానికి తాను హాజరుకానున్నానని శనివారం టీడీపీ నేతలతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో బాబు వివరించారు. బీజేపీయేతర పార్టీలను ఏకతాటిపైకి తీసుకు రావాలని, ఆ పార్టీలన్నింటినీ ఏకం చేయాలన్న ఆకాంక్ష తనకుందని పేర్కొన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోదీ పట్ల తీవ్రస్థాయిలో వ్యతిరేకత ఉందని, దేశాన్ని కాపాడేందుకు, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టేందుకు లౌకికవాద శక్తులన్నీ ఏకం కావాల్సిన అవసరం ఉందని వెల్లడించారు. అందుకు మూడు రాష్ట్రాల సీఎంల ప్రమాణ స్వీకార కార్యక్రమాలు వేదిక కావాలనే భావన తనకుందన్నారు. నిరంకుశ పాలన, పెత్తందారీ పాలన, అహంభావ పోకడలు అంతరించాలని అన్ని వర్గాలు కోరుకుంటున్నాయని చెప్పారు. తెలంగాణ ఎన్నికల ఫలితాలు ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికలపై ఎటువంటి ప్రభావాన్ని చూపలేవని చంద్రబాబు స్పష్టం చేశారు.   

మరిన్ని వార్తలు