వెలిగొండను నేనే ప్రారంభిస్తా..

10 Jan, 2019 12:47 IST|Sakshi
రామాయపట్నం పోర్టు పైలాన్‌ను ఆవిష్కరిస్తున్న సీఎం చంద్రబాబునాయుడు, చిత్రంలో మంత్రులు పి.నారాయణ, శిద్దా రాఘవరావు, జిల్లా కలెక్టర్‌ వినయ్‌చంద్‌ తదితరులు

ఆ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిందీ నేనే..

రామాయపట్నం సభలో గొప్పలకు పోయిన సీఎం చంద్రబాబు

పోర్టు, కాగిత పరిశ్రమ పైలాన్ల ఆవిష్కరణ

ఏపీపీ ప్రతినిధులతో అవగాహన ఒప్పందం

సాక్షి ప్రతినిధి, ఒంగోలు : వెలిగొండ ప్రాజెక్టుకు తానే శంకుస్థాపన చేశానని, ప్రాజెక్టును కూడా పూర్తి చేసి తానే ప్రారంభిస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. బుధవారం జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన రామాయపట్నం పోర్టు, ఏషియన్‌ పల్ప్‌ పేపరు పరిశ్రమల స్థాపనకు గుడ్లూరు మండలం రావూరు గ్రామ పరిధిలో ఏర్పాటు చేసిన పైలాన్లను ఆవిష్కరించారు. నాలుగున్నరేళ్లుగా వెలిగొండ ప్రాజెక్టు పనులను పూర్తి చేయని చంద్రబాబు రామాయపట్నం పోర్టు శంకుస్థాపన సభలో మరోమారు వెలిగొండను తానే పూర్తి చేస్తానని ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. గత ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన మరుసటి ఏడాదే వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసి నీరిస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఆ తర్వాత జిల్లాకు వచ్చిన ప్రతిసారి ఈ ఏడాది నీరిస్తానంటూ ప్రకటించడం తప్ప పనులు పూర్తి చేసింది లేదు, నీటిని విడుదల చేసింది లేదు. ఇప్పుడు తాజాగా తేదీ చెప్పకుండా వెలిగొండను తానే ప్రారంభిస్తానని చెప్పి తప్పించుకోవడం పై అధికార పార్టీ వర్గాల్లోనే చర్చనీయాంశంగా మారింది. ఇక ఒంగోలులో యూనివర్శిటీ ఏర్పాటు చేసినట్లు సీఎం ప్రకటించారు.

జిల్లాకు ట్రిపుల్‌ ఐటీ మంజూరై మూడేళ్లు దాటుతున్నా దీనికి సంబంధించి ఒక్క భవనాన్ని కూడా నిర్మించని చంద్రబాబు జిల్లాకు ట్రిపుల్‌ ఐటీ ఇచ్చిన చెప్పారు. హార్టికల్చర్‌ కాలేజీ ఇచ్చామన్నారు. రూ.469 కోట్లతో ఎన్నెస్పీ కుడి కాలువ ఆధునీకరణ పనులు చేపట్టామన్నారు. రూ.275 కోట్లతో నీరు–చెట్టు పనులు పూర్తి చేసినట్లు చెప్పారు. గుండ్లకమ్మ రిజర్వాయర్‌ను దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలోనే 95 శాతం పనులు పూర్తి చేయగా గడిచిన నాలుగున్నరేళ్లలో చంద్రబాబు 5 శాతం పనులను కూడా పూర్తి చేయలేదు. అయినా రూ.90 కోట్లతో గుండ్లకమ్మ రిజర్వాయర్‌ను తామే పూర్తి చేసినట్లు రామాయపట్నం సభలో చంద్రబాబు ప్రకటించారు. కొరిశపాడు లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పనులను తామే పూర్తిచేశామని త్వరలోనే జాతికి అంకితం చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. జిల్లాలో ఒంగోలు జాతి పశువులను కాపాడేందుకు సంక్రాంతి  పండుగ సందర్భంగా పశు ప్రదర్శన, పశువులకు పోటీలు పెట్టేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. జిల్లాలో 7 జాతీయ రహదారులను నిర్మిస్తున్నట్లు చెప్పారు. జన్మభూమిలో వినతి పత్రాలు ఇచ్చిన అందరికీ ఇళ్లు మంజూరు చేస్తామని సీఎం ప్రకటించారు.

ఒకే రోజు రెండు భారీ ప్రాజెక్టులు
రామాయపట్నం వద్ద 3,200 ఎకరాలలో రూ.4,500 కోట్ల వ్యయంతోరామాయపట్నం పోర్టు, రావూరు, చేవూరు గ్రామాల మధ్య 2,400 ఎకరాలలో రూ.24,500 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేస్తున్నామని, ఒకే రోజు రెండు భారీ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడం సంతోషకరంగా ఉందని సీఎం చంద్రబాబు చెప్పారు. పేపర్‌ ఉత్పత్తి పరిశ్రమ ఏర్పాటుకు సంబం«ధించి రాష్ట్ర ప్రభుత్వం, ఇండోనేషియాకు చెందిన పేపర్‌ ఉత్పత్తి పరిశ్రమల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ కార్యక్రమంలో మంత్రులు శిద్దా రాఘవరావు, నారాయణ, ఎమ్మెల్యేలు పోతుల రామారావు, గొట్టిపాటి రవికుమార్, దామచర్ల జనార్దన్, ముత్తమల అశోక్‌రెడ్డి, ఆమంచి కృష్ణమోహన్, డోలా బాలవీరాంజనేయ స్వామి, కదిరి బాబూరావు, ఏలూరి సాంబశివరావు, ఎమ్మెల్సీలు కరణం బలరామకృష్ణమూర్తి, మాగుంట శ్రీనివాసులురెడ్డి, పోతుల సునీత, మాజీ ఎమ్మెల్యేలు దివి శివరాం, విజయ్‌కుమార్, కావలి మాజీ ఎమ్మెల్యే బీదా మస్తాన్‌రావు, ఏపీ పోర్ట్స్‌ చైర్మన్‌ ప్రవీణ్‌ కోయ, పేపరు పరిశ్రమ ప్రతినిధులు  విజయ, సురేష్‌ కొల్లం, జోసఫ్, జిల్లా కలెక్టరు వి.వినయ్‌చంద్, జాయింట్‌ కలెక్టరు నాగలక్ష్మీ, ట్రైనీ కలెక్టరు నిశాంతి, ఆర్డీఓ కెఎస్‌ రామారావు, స్టెప్‌ సీఈఓ రవి, పలువురు నేతలు, అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు