రైతులు, డ్వాక్రా మహిళలకు రుణాలివ్వండి

26 Oct, 2014 02:45 IST|Sakshi
రైతులు, డ్వాక్రా మహిళలకు రుణాలివ్వండి

ఒంగోలు టౌన్:జిల్లాలోని అర్హత కలిగిన స్వయం సహాయక సంఘాలకు, రైతులకు ఇతోధికంగా రుణాలు అందించి లక్ష్యసాధనలో బ్యాంకర్లు తమవంతు సహకారం అందించాలని కలెక్టర్ జీఎస్‌ఆర్‌కేఆర్ విజయకుమార్ ఆదేశించారు. శనివారం స్థానిక సీపీవో కాన్ఫరెన్స్ హాలులో నిర్వహించిన జిల్లా స్థాయి బ్యాంకర్ల సంప్రదింపుల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ, స్వయం సహాయక సంఘాలకు అందించే బ్యాంకు లింకేజీలకు అధిక ప్రాధాన్యం ఇస్తుందన్నారు. నెలాఖరులోగా బ్రాంచ్ మేనేజర్లు, అధికారులకు ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించాలని ఆదేశించారు.  మండల స్థాయిలో నిర్వహించే జేఎంఎల్‌బీసీలో, గ్రామ సభల్లో బ్రాంచ్ మేనేజర్లు విధిగా హాజరు కావాలని  కలెక్టర్ ఆదేశించారు. బ్రాంచ్ మేనేజర్లు హాజరు కాకుంటే ఎందుచేత హాజరు కాలేదో రాతపూర్వకంగా తెలియజేయాలన్నారు.
 
 28 నుంచి గ్రామాల ఎంపిక
 వివిధ కార్పొరేషన్లలో యూనిట్ల మంజూరు, గ్రౌండింగ్, లబ్ధిదారులకు సంబంధించి ఈనెల 28, 29 తేదీల్లో మండల పరిషత్ అభివృద్ధి అధికారులతో మండల కమిటీల ద్వారా గ్రామాల ఎంపిక ప్రక్రియ నిర్వహించాలని  కలెక్టర్ ఆదేశించారు. 30, 31 తేదీల్లో నిర్దేశించిన ప్రాంతాల్లో అవగాహన సదస్సులు నిర్వహించాలని సూచించారు. నవంబర్ 12 నుంచి 28వ తేదీ వరకు గ్రామసభల ద్వారా లబ్ధిదారుల ఎంపిక చేపట్టాలన్నారు. డిసెంబర్ 3నుంచి 5వ తేదీ వరకు ఎంపికైన అభ్యర్థులకు అవగాహన సదస్సులు నిర్వహించాలని ఆదేశించారు. 9 నుంచి 21వ తేదీ వరకు డాక్యుమెంటేషన్, బ్యాంకు ఖాతాల తెరిచే ప్రక్రియ నిర్వహించాలన్నారు. 23 నాటికి స్క్రూట్నీ నిర్వహించి తుది జాబితా జిల్లా కేంద్రానికి పంపించాలని ఆదేశించారు. 23 నుంచి 31వ తేదీలోపు కార్పొరేషన్ అధికారులు మంజూరు ఉత్తర్వులు జారీ చేయాలన్నారు. ఎంపికైన అభ్యర్థులకు వచ్చే ఏడాది జనవరి 5 నుంచి సంబంధిత రంగాలపై శిక్షణ ఇవ్వాలన్నారు. 19 నుంచి 31వ తేదీలోపు మంజూరైన యూనిట్లు గ్రౌండింగ్ అయ్యేలా చూడాలని కలెక్టర్ ఆదేశించారు. లబ్ధిదారులకు రిసోర్స్ పర్సన్స్, సాంకేతిక పరిజ్ఞానం కలిగిన వారితో శిక్షణ ఇప్పించాలన్నారు. గతంలో మంజూరై గ్రౌండింగ్ అయిన యూనిట్లకు సంబంధించి యుటిలైజేషన్ సర్టిఫికెట్లు బ్యాంకర్లు సంబంధిత అధికారులకు పంపాలన్నారు. బ్యాంకుల ద్వారా పౌరులకు అందాల్సిన సేవలు, మౌలిక వసతులు సక్రమంగా కల్పించాలని ఆదేశించారు.
 
 క్రెడిట్ ప్లాన్ ఆవిష్కరణ:
 2015-2016 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన నాబార్డు పొటెన్షియల్ లింక్‌డ్ క్రెడిట్ ప్లాన్‌ను కలెక్టర్ విజయకుమార్ ఆవిష్కరించారు. 2014-2015 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఫైనాన్స్ కార్పొరేషన్, స్టెప్, పశుసంవర్ధకశాఖ, మెప్మాలకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికలను సంబంధిత అధికారులు వివరించారు. డీఆర్‌డీఏ, ఐకేపీ తరఫున సెప్టెంబర్‌లో రూ.332 కోట్లు స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీ లక్ష్యం కాగా, రూ.183 కోట్లు చేరుకున్నట్లు పీడీ పద్మజ వివరించారు. సమావేశంలో సిండికేట్ బ్యాంకు డీజీఎం పీబీఎల్ నరసింహారావు, నాబార్డు ఏజీఎం జ్యోతిశ్రీనివాస్, ఆర్‌బీఐ ప్రతినిధి మురళీధర్, ఎల్‌డీఎం నరసింహారావు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రాజు, బీసీ కార్పొరేషన్ ఈడీ నాగేశ్వరరావు, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఈడీ సప్తగిరి, స్టెప్ సీఈవో బీ రవి, పశుసంవర్ధకశాఖ జేడీ రజనీకుమారి తదితరులు పాల్గొన్నారు.
 
 31లోపు హౌస్ హోల్డ్  సర్వే పూర్తిచేయాలి
 ప్రధానమంత్రి జన్‌ధన్ యోజనకు సంబంధించి జిల్లాలో హౌస్ హోల్డ్ సర్వే ఈనెల 31నాటికి పూర్తి చేయాలని డీఆర్‌డీఏ పీడీ పద్మజను కలెక్టర్ ఆదేశించారు. సర్వే చేసిన వివరాలను కంప్యూటరీకరించాలన్నారు. సర్వేకు సంబంధించిన ఫారాలు అన్ని బ్యాంకులకు పంపేలా చర్యలు తీసుకోవాలన్నారు. సర్వే చేసిన వివరాలను అకనాలెడ్జ్‌మెంట్‌తో సంబంధిత బ్రాంచ్ మేనేజర్‌కు అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి ఒక్కరికీ బ్యాంకు ఖాతా ఉండేలా బ్యాంకర్లు సహకరించాలని సూచించారు.
 

మరిన్ని వార్తలు