మండుటెండలో పరీక్ష

23 Sep, 2018 10:06 IST|Sakshi
నగరవనం పార్కును ప్రారంభిస్తున్న సీఎం చంద్రబాబునాయుడు, ఎండలో నిరీక్షిస్తున్న విద్యార్థినులు

మూడు గంటలపాటు  సీఎం కోసం నిరీక్షణ

ఆలస్యంగా చేరుకున్న చంద్రబాబు

మిట్టమధ్యాహ్నం విద్యార్థులతో ర్యాలీ

కానరాని జన స్పందన

సాక్షి, తిరుపతి: నగరంలో శనివారం సీఎం చంద్రబాబు పర్యటన విద్యార్థులకు పరీక్ష పెట్టింది. ఎండ తీవ్రతకు వారంతా అల్లాడిపోయారు. మూడు గంటలపాటు మండుటెండలో నిరీక్షించా ల్సి వచ్చింది.  అలిపిరి మార్గంలోని కపిలతీర్థం వద్ద  నగరవనం పార్క్‌ను సీఎం ప్రారంభించారు.  తర్వాత పచ్చదనం– పరిశుభ్రతపై మహతి ఆడిటోరియం నుంచి నెహ్రూ మున్సిపల్‌ గ్రౌండ్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమం ముందుగా నిర్ణయించింది కాదు. రెండు రోజుల క్రితం ఆదరాబాదరాగా ఖరారు చేశారు. దీంతో  జనాన్ని తరలించటం సాధ్యం కాదని అధికారయంత్రాంగం విద్యార్థులపై దృష్టి పెట్టింది.

వారితో ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించారు.  ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులను ఉద యం 9 గంటలకే మహతి ఆడిటోరియం వద్దకు తరలించారు. 10.50కి సీఎం ర్యాలీని ప్రారంభిస్తారని అధికారులు ప్రకటించారు.  ఆయన మహతికి వచ్చేసరికి మధ్యాహ్నం 12.05 గంటలైంది.  నెహ్రూ మున్సిపల్‌ గ్రౌండ్‌కు చేరుకోడానికిమరో అర్ధగంట పట్టింది. దీంతో గంటల తరబడి ఎండలో ఆడిటోరియం వద్ద వేచి ఉన్న విద్యార్థులు మళ్లీ ర్యాలీలో పాల్గొన్నారు.  వారంతా ఎండకు ఆపసోపాలు పడ్డారు. ప్రజల భాగస్వామ్యం లేకుండా విద్యార్థులతో పాటు  పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు ఈ ప్రదర్శనలో పాల్గొనడం విమర్శలకు దారితీసింది. ముఖ్యమంత్రి రహదారిలో ర్యాలీగా వెళ్తున్నా ఎక్కడా జన స్పందన లేకపోయేసరికి పార్టీ నేతలు చిన్నబుచ్చుకున్నారు. ఎమ్మెల్యే సుగుణమ్మ ఇంటి వద్ద కనీసం స్వాగతం ఫ్లెక్సీలైనా లేకపోయేసరికి చంద్రబాబు నిరుత్సాహానికి గురైనట్లు తెలిసింది.

చప్పగా సాగిన ప్రసంగం...అడిగి మరీ చప్పట్లు కొట్టించుకున్న వైనం
తిరుపతిలోని మున్సిపల్‌ గ్రౌండ్‌లో జరిగిన  బహిరంగ సభకు మహిళలను, విద్యార్థులను తరలించారు. సీఎం చంద్రబాబు ప్రసంగం సభికులను ఆకట్టుకోలేదు. తిరుపతిని నంబ ర్‌ వన్‌ చేస్తానని పదేపదే చెప్పటం తప్పితే... కొత్తగా ప్రస్తావించిందేమీ లేదు. డిజిటల్‌ డోర్‌ నంబర్లు, ఫ్లైవోవర్, వాకింగ్‌ ట్రాక్‌ గురించి చెప్పుకొచ్చారు. ఆయన ప్రసంగి స్తున్న సమయంలోనే జనం లేచి వెళ్లిపోవటం కనిపించింది.

మరిన్ని వార్తలు