నా డిజైన్ ఓకే కాలేదు: రాజమౌళి

13 Dec, 2017 17:31 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఏపీ రాజధాని అమరావతిలో నిర్మించనున్న శాసనసభ భవన నిర్మాణానికి రాజమౌళి ఇచ్చిన డిజైన్‌ను ప్రభుత్వం ఆమోదించ లేదు. బుధవారం జరిగిన సీఆర్‌డీఏ సమావేశంలో అసెంబ్లీ భవనాలకు సంబంధించిన రెండు డిజైన్లపై చర్చ జరిగింది. తెలుగుదనం, చరిత్ర ఉట్టిపడేలా రాజమౌళి సూచనలు ఇవ్వగా, పూర్తిగా ఆధునిక డిజైన్లవైపు చంద్రబాబు మొగ్గుచూపారు. టవర్‌ ఆకారపు నమూనాకే మెజార్టీ సభ్యులు ఆమోదం తెలిపారు. గురువారం సాయంత్రం డిజైన్లను అధికారికంగా ప్రభుత్వం ప్రకటించనుంది.

రామసేతు నిర్మాణంలో ఉడత పోషించిన పాత్ర తాను రాజధాని నిర్మాణంలో పోషిస్తున్నట్టు ఈ సందర్భంగా మీడియాతో రాజమౌళి చెప్పారు. అసెంబ్లీ నిర్మాణం కోసం ఇచ్చే డిజైన్ కోసం పని చెయ్యమని సీఎం చెప్పారని తెలిపారు. ‘ఒక డిజైన్ ఓకే అయ్యింది. అందరికి నచ్చింది. నన్ను కొన్ని మార్పులు చేయమని సీఎం అడిగారు. నేను తెలుగు తనం ఉట్టి పడేలా కొన్ని డిజైన్లు ఇచ్చాను. నేను వర్క్ చేసిన డిజైన్ ఓకే కాలేదు. నేను సూచించిన మార్పులను మీడియా సిటీకి వాడుకుంటామని చెప్పార’ని రాజమౌళి వెల్లడించారు.

 రాజమౌళికి సీఎం చంద్రబాబు ఝలక్‌

మరిన్ని వార్తలు