అబద్ధానికి ప్రతిరూపం చంద్రబాబు

18 Jun, 2018 08:19 IST|Sakshi
మాట్లాడుతున్న ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌రెడ్డి  

రాంమాధవ్‌ ఇంటికి బుగ్గన పోయినట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధం

40 ఇయర్స్‌ ఇండస్ట్రీ అంటూ సీఎం బురిడీ కొట్టిస్తున్నారు

ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌రెడ్డి 

సాక్షి, ఆళ్లగడ్డ :  ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అబద్దానికి ప్రతిరూపమని, ఆయన నోటి వెంట ఒక్క నిజం కూడా బయటకు రాదని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌రెడ్డి విమర్శించారు. స్థానిక  పార్టీ కార్యాలయంలో ఆదివారం ఎర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లడుతూ.. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే పీఏసీ చైర్మన్‌ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఢిల్లీలో బీజేపీ నేత రాంమాధవ్‌ ఇంటికి పోయినట్లు చిన్న ఆధారంతో నిరూపించినా దేనికైనా సిద్ధమని ముఖ్యమంత్రికి సవాల్‌ విసిరారు. రాజకీయాల్లో వ్యక్తిగత మిత్రులు ఎంతో మంది ఉంటారని, వారు ఎదురుపడినప్పుడు కలసి మాట్లాడుకుని యోగక్షేమాలు తెలుసుకోవడం సహజమన్నారు.

అలాంటిది ఇతర పార్టీ వాళ్లతో మాట్లాడితే రాజకీయ సంబంధం అంటగట్టడం సీఎంకే చెల్లిందన్నారు. ఆయనలో అభద్రతా భావం రోజురోజుకు పెరిగి ఎదుటివారిపై బుదరజల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని, దేశంలో అందరికంటే తానే సీనియర్‌ అని చెప్పుకునే సీఎం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసమన్నారు. నాలుగేళ్లుగా నిద్రపోయి ఇప్పుడు ప్రత్యేక హోదా రావాలంటే రాష్ట్ర ప్రజలు తమ వెంటరావాలని చెప్పడం హాస్యాస్పదమన్నారు. సమావేశంలో ముస్లిం మైనార్టీ నాయకుడు నయాబ్‌ రసూల్‌ తదితరులు పాల్గొన్నారు.   

మరిన్ని వార్తలు