ఓటమి టీడీపీకి కొత్తేమీ కాదు: చంద్రబాబు

10 Jul, 2019 11:42 IST|Sakshi
రాజు కుటుంబానికి రూ.5 లక్షలు చెక్కును అందజేస్తున్న చంద్రబాబు

బాధిత కుటుంబాలకు పరామర్శ

రూ. 5 లక్షలు ఆర్థిక సాయం అందజేత

త్వరలో ధర్మవరం నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ ప్రకటన

సాక్షి, ధర్మవరం: ఓటమి అనేది టీడీపీకి కొత్తేమి కాదని ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం బుక్కరాయసముద్రంలో ఏర్పాటు చేసిన రోడ్డు షోలో ఆయన మాట్లాడారు. గతంలో కూడా టీడీపీ ఓటమి పాలై మళ్లీ అధికారంలోకి వచ్చిందని గుర్తు చేశారు. ఈ విషయంగా పార్టీ కార్యకర్తలు ఎవరూ అధైర్య పడకూడదని అన్నారు. కార్యకర్తలకు ఎప్పుడూ అండగా ఉంటామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆరుగురు టీడీపీ కార్యకర్తలు మృతిచెందారని, మృతుల కుటుంబసభ్యులను పరామర్శించేందుకు భరోసా యాత్ర చేపట్టినట్లు వివరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ శమంతకమణి, మాజీ ఎమ్మెల్యే యామినీబాల, బండారు శ్రావణి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు రామలింగారెడ్డి పాల్గొన్నారు.

అనంతరం తాడిపత్రి మండలం వీరాపురం గ్రామంలో చింతా భాస్కరరెడ్డి కుటుంబాన్ని పరామర్శించి, రూ.5 లక్షల ఆర్థిక సాయాన్ని అందజేశారు. కార్యకర్తలకు అండగా ఉంటాం ధర్మవరం నియోజకవర్గం బత్తలపల్లి మండలం పత్యాపురం గ్రామంలో అంగన్‌వాడీ భవన నిర్మాణ వివాదంలో మృతిచెందిన టీడీపీ కార్యకర్త రాజు కుటుంబాన్ని మంగళవారం టీడీపీ అధినేత చంద్రబాబు పరామర్శించారు. మృతుడి భార్య వరలక్ష్మికి రూ. 5లక్షల చెక్కును అందించారు. పిల్లలు వినయ్, ఆనంద్, అవంతిను ఎన్టీఆర్‌ ట్రస్టు ద్వారా చదివిస్తామన్నారు. ఇదే ఘర్షణలో గాయపడ్డ మరో ఆరుగురికి రూ.50వేలు చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు.

అనంతరం బహిరంగ సభలో మాట్లాడుతూ.. హత్యారాజకీయాలకు తాము భయపడమన్నారు. కార్యకర్తలకు అండగా ఉంటామన్నారు. ధర్మవరం మాజీ ఎమ్మెల్యే పార్టీ మారడం దురదృష్టకరమన్నారు. త్వరలో ధర్మవరంలో టీడీపీ ఇన్‌చార్జ్‌ను ప్రకటిస్తామన్నారు.

మరిన్ని వార్తలు