ఇన్ఫెక్షన్లు తేల్చేందుకే ఎక్కువ పరీక్షలు

3 May, 2020 03:28 IST|Sakshi

ఏప్రిల్‌ 1 నాటికి టెస్టులు జరిగింది 916 మాత్రమే 

ఏప్రిల్‌ 16కల్లా 13,511కు చేరిన పరీక్షలు 

అదే రోజుకు పాజిటివ్‌ కేసుల సంఖ్య 534 

మే 2 నాటికి టెస్టుల సంఖ్య 1.08 లక్షలకు పెరుగుదల 

అలాగే, పాజిటివ్‌ కేసుల సంఖ్య 1525కు చేరిక 

అయినా పాజిటివ్‌ కేసుల రేటు 1.4 శాతమే 

ఏ రాష్ట్రంలో లేని విధంగా ఏపీలో భారీగా టెస్టులు 

ఇన్‌ఫెక్షన్‌ రేటు గుర్తించడంవల్లే వైరస్‌ ప్రబలకుండా జాగ్రత్తలు

సాక్షి, అమరావతి:  ‘‘టెస్టులు చేస్తేనే పాజిటివ్‌ ఎవరో నెగిటివ్‌ ఎవరో తెలుస్తుంది.. పాజిటివ్‌ వచ్చిన వాళ్లు ఎవరో తెలిస్తేనే వారికి చికిత్స చేయడమా, క్వారంటైన్‌ చెయ్యడమా అన్నది నిర్ణయిస్తారు. ఇన్‌ఫెక్షన్‌ ఎవరికుందో తెలిస్తేనే మిగతా వారికి సోకకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు’’. 

కరోనా వైరస్‌కు సంబంధించి ఇవి ప్రాథమిక సూత్రాలు. పాజిటివ్‌ బాధితుల సంఖ్య పెరుగుతోందని ఇటలీ, స్పెయిన్, అమెరికా వంటి దేశాలు వెనకడుగు వెయ్యలేదు. ఓ వైపు టెస్టుల సంఖ్య పెంచుకుంటూనే మరోవైపు వైరస్‌ బాధితులను క్వారంటైన్‌ చేశారు. ఇదే పద్ధతిని రాష్ట్ర ప్రభుత్వం కూడా తూ.చ తప్పకుండా అనుసరిస్తోంది. వైరస్‌ ఇన్‌ఫెక్షన్‌ ఉన్న వారిని ఎక్కడున్నా వెతికిపట్టి చికిత్స లేదా క్వారంటైన్‌ చెయ్యాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్న ఏపీ.. కరోనా కట్టడిలో చాలావరకు అనుకున్న లక్ష్యాలను సాధించగలిగింది. రాష్ట్రంలో కోవిడ్‌–19 ప్రవేశించే నాటికి రోజుకు 90 టెస్టులు మాత్రమే చేసే సామర్థ్యం ఉండేది. ఇప్పుడు రోజూ సగటున 7,500 టెస్టులు చేసే స్థాయికి చేరిందంటే వైరాలజీ ల్యాబొరేటరీల స్థాయిని రాష్ట్ర ప్రభుత్వం అంచెలంచెలుగా ఎలా ఉన్నతీకరించిందో అంచనా వెయ్యొచ్చు. 

రాష్ట్రంలో కరోనా పరీక్షల్లో మార్పులు ఇలా.. 
► ఏప్రిల్‌ 1 నాటికి రాష్ట్రంలో జరిగిన టెస్టులు 916 మాత్రమే 
► అదే రోజుకు పాజిటివ్‌ కేసుల సంఖ్య 83. 
► ఏప్రిల్‌ 15కి రాష్ట్రంలో టెస్టులు 11,613 కాగా పాజిటివ్‌ 502. 
► మే 2 నాటికి మొత్తం టెస్టులు 1,08,403 జరిగాయి. 
► అంటే.. 17 రోజుల్లోనే 96,790 టెస్టులు చేసిన సర్కారు. 
► టెస్టులు పెరగడంవల్లే 502గా ఉన్న పాజిటివ్‌ కేసులు 1,525కు చేరిక 
► మార్చి 1 నాటికి ఒక్క ల్యాబ్‌లోనే పరీక్షలు.. 
► తాజాగా.. రాష్ట్రంలో9 ల్యాబొరేటరీల్లో టెస్టులు 
► మరో 225 ట్రూనాట్‌ మెషీన్ల ద్వారా కూడా టెస్టులు. 
► రాష్ట్రంలో కేసులు పెరిగినా మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఇన్‌ఫెక్షన్‌ రేటు చాలా తక్కువ.  
► ప్రస్తుతం రాష్ట్రంలో 1.4 శాతంగా పాజిటివ్‌ కేసులు. అదే దేశవ్యాప్తంగా 3.82 నమోదు. 

>
మరిన్ని వార్తలు