కరోనా నేర్పిన కొత్త జీవితం.. 

22 Jun, 2020 08:50 IST|Sakshi
విజయనగరంలో వాహనాలపై వ్యక్తిగత ప్రయాణం

కలిసి తినలేం.. లిఫ్టు ఇవ్వలేం 

కరోనాతో ప్రజల అలవాట్లలో పెను మార్పులు

విందు.. వినోదాలకు జనం దూరం  

వ్యక్తిగత రవాణాకే మొగ్గు చూపుతున్న జిల్లా ప్రజలు 

విజయనగరం: కరోనా మహమ్మారి ప్రజల ఆరోగ్యంపైనే కాదు... జీవితాల్లోనూ ఎన్నో మార్పులకు కారణమైంది. ప్రస్తుతం ప్రజల జీవనం కరోనాకు ముందు.. తర్వాత అన్నంతగా మారిపోయాయి. లాక్‌డౌన్‌ కారణంగా రెండు నెలలపాటు ఇంటికే పరిమితమైన జనం గత కొద్ది రోజులుగా సాధారణ జీవితానికి అలవాటు పడుతున్నారు. మనసులో మెదిలే భయాందోళన నడుమ.. మున్ముందుకు అడుగులు వేస్తున్నారు. అందుకు తగ్గట్టుగా జీవనయానంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కరోనా భయంతో కొన్ని విషయాల జోలికి వెళ్లేందుకు ప్రజలు ఇష్టపడడం లేదు.  ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇస్తూ.. కొత్త తరహా జీవితానికి నాంది పలుకుతున్నారు. జాగ్రత్తలు పాటిస్తున్నారు. 

పునర్వినియోగం కానివే మేలు..  
నిన్నమొన్నటి వరకు పునరి్వనియోగించే వస్తువులకు ప్రాధాన్యం ఇవ్వాలని భావించారు. కరోనాతో పరిస్థితి ఒక్కసారిగా తలకిందులైంది. పునరి్వనియోగం జరగని వస్తువులకు ప్రాధాన్యం పెరుగుతోంది. ఒక్కసారి వాడిపారేసే వస్తువులైతే మరొకరు తాకే అవకాశం ఉండదని భావిస్తున్నారు.  దీనివల్ల ఒక్కసారి వాడిపారేసే పెన్నులు, సంచులు, తినబండారాల  ప్లేట్లు, కాగితాలు, గ్లాసులు.. తదితర వస్తువుల వినియోగానికి  ప్రాధాన్యం ఇస్తున్నారు. కాలుష్య కారక వస్తువులకు  దూరంగా ఉంటున్నారు. వ స్తువులను తాకేందుకు భయపడుతున్నారు. 

సాయం అడిగినా.. వాహనం ఆగదే
ఎండాకాలం ముగిసి వర్షాకాలం ప్రారంభమైంది.. లాక్‌డౌన్‌ సడలింపులు అనంతరం కాలం నుంచి ఇప్పటి వరకు ఎవరైనా నడిచి వెళ్తుంటే వాహనదారులు ఆగి మరీ లిఫ్టు ఇచ్చి తీసుకెళ్లేవారు. ఇప్పుడు కరోనా భూతం కారణంగా లిఫ్టు అడిగినా ఆపేందుకు వాహనదారులు జంకుతున్నారు. తెలిసిన వ్యక్తులకు దూరంగా ఉంటున్న సమయంలో తెలియని వ్యక్తులకు లిఫ్ట్‌ ఇవ్వడమా.. అన్న సందేహం వ్యక్తం చేస్తున్నారు. 

తగ్గిన పార్టీల జోరు... 
ఆధునిక ప్రపంచంలో కష్టం వచ్చినా... ఆనందం వచ్చినా  పారీ్టల జోరు పెరిగిందనే చెప్పాలి. ఏ చిన్న విజయం సాధించినా ‘దావత్‌ ఎప్పుడు మామా’ అని అడగడటం మనకు అలవాటు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కొన్నిరోజుల పాటు దావత్‌లు బంద్‌ కావాల్సిందే. జిల్లాలో గత కొన్ని రోజులుగా పెద్దసంఖ్యలో వెలుగు చూస్తున్న కరోనా కేసులు దావత్‌ల ద్వారా విస్తరిస్తున్నవే. సరదాగా గడిపేందుకో లేదా పుట్టినరోజనో ఒకచోట చేరి పార్టీ చేసుకున్న సందర్భాల్లో కరోనా పంజా విసురుతోంది. అందుకు దావత్‌లకు ప్రజలంతా దూరంగా ఉంటున్నారు.

వ్యక్తిగత రవాణాకే మొగ్గు 
ప్రస్తుతం జిల్లాల బస్సులకే ప్రభుత్వం అనుమతించింది. అయినప్పటికీ ప్రజల నుంచి స్పందన తక్కువేనని చెప్పాలి. బస్సుల వద్ద శానిటైజర్లు వంటివి ఉంచామని అధికారులు చెబుతున్నా.. ప్రజా రవాణాకు మొగ్గు చూపేందుకు ప్రయాణికులు ఆసక్తి చూపడం లేదు. నగరంలోనూ వ్యక్తిగత వాహనాల వినియోగం పెరిగింది. బైక్‌లు, కార్లునే ప్రయాణానికి వినియోగిస్తున్నారు.  బైక్‌లపై ఒక్కొ క్కరే ప్రయాణిస్తున్నారు. 

తీసుకెళ్లండి.. తినండి.. 
లాక్‌డౌన్‌కు ముందు జిల్లా వ్యాప్తంగా ఉన్న హోటళ్లు, రెస్టారెంట్లు రద్దీగా కనిపించేవి. ప్రస్తుతం వాటిని తెరిచేందుకు ప్రభుత్వం అనుమతించినా భోజన ప్రియులు మాత్రం వచ్చేందుకు జంకుతున్నారు. పది మందిలో కలిసి తింటే కరోనా వైరస్‌ వ్యాప్తిస్తుందన్న భయంతో కేవలం పార్సిల్‌ సర్వీసులకే మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఒకచోట చేరి సరదాగా కబుర్లు చెప్పుకొంటూ కూర్చుని తినాలంటే ఆందోళన పడాల్సిన పరిస్థితి. పార్సిల్‌ తీసుకెళ్లడం ద్వారా ఇంట్లోనే ఉండి తినే వీలుంటుంది.


నగరంలోని ఓ హోటల్‌లో  టేబుల్‌కు ఒక్కరు చొప్పునే వడ్డింపు    

జాగ్రత్తలతోనే ఆరోగ్యకర జీవనం  
ప్రస్తుత ప్రపంచంలో ప్రతి ఒక్కరు వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోడం తప్పనిసరిగా మారింది. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో భౌతిక దూరం పాటించడం,  చేతులు శుభ్రం చేసుకోవడం నిత్యకృత్యం చేసుకోవాల్సిందే. ప్రపంచా న్ని గడగడలాడిస్తున్న వైరస్‌ బారిన పడకుండా ఉండాలంటే జాగ్రత్తలు తప్పనిసరి. సామూహిక కార్యక్రమాలకు దూరంగా ఉండడం ఉత్తమం.  
– ఎస్‌.ఎస్‌.వర్మ, కమిషనర్, విజయనగరం మున్సిపల్‌ కార్పొరేషన్‌    

మరిన్ని వార్తలు