సేమ్ టు షేమ్!

18 Apr, 2014 02:16 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, విజయనగరం: టీడీపీ పరిస్థితి దయనీయంగా తయారైంది.  చంద్రబాబు తీరు కారణంగా పార్టీలో అయోమయం నెలకొంది. నేతల మధ్య అంతర్గత పోరుతో ఎన్నికల రేసులో సైకిల్  వెనుకబడింది. ప్రతికూల పరిస్థితులతో  కేడర్ గందరగోళంలో ఉన్నా రు. పార్టీ అధినేత జిల్లాలో పర్యటించినా టిక్కెట్ల పంచాయతీ కొలిక్కి రాలేదు. నామినేషన్ల ప్రక్రియ తుది దశకొచ్చినా స్పష్టత ఇవ్వలేదు.  
 
 చీపురుపల్లిలో నాలుగు స్తంభాలాట..
 చీపురుపల్లి టిక్కెట్ కేటాయింపుపై జరుగుతున్న హైడ్రామాతో కార్యకర్తలు, నాయకులు ఎవరి వెంట నడవాలో తేల్చుకోలేని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ప్రధాన ఆశావహుల జాబితాలో నిన్నటివరకు ముగ్గురే ఉన్నారనుకుంటే తాజాగా తెరపైకి నాలుగో వ్యక్తి వచ్చారు. కొ న్ని రోజులుగా  కె.త్రిమూర్తులరాజు, గద్దే బాబూరావు, కిమిడి మృణాళిని టిక్కెట్ కోసం కుమ్ములాడుకుంటే పరిషత్ ఎన్నికలకు ముందు పార్టీలో చేరిన మీసాల వరహాలనాయుడు కూడా అందులో చేరారు.

 తన పేరు కూ డా పరిశీలించాలని గట్టిగా ఒత్తిడి చేస్తున్నారు. దీంతో ఇక్కడ నాలుగు స్తంభాలాట సాగుతోంది. ఎవరికి వారు లాబీయింగ్ చేసుకుంటున్నారు. ఒకరు తన సా మాజిక వర్గం ద్వారా, మరొకరు నారాయణ విద్యా సంస్థ అధినేత ద్వారా, మిగిలిన  ఇద్దరు సీఎం రమేష్, కంభంపాటి రామ్మోహనరావు ద్వారా ప్రయత్నిస్తున్నారు. చేతి చమురు కూడా భారీగా వది లించుకుంటున్నారు. వీరిలో త్రిమూర్తులరాజు ఒక్కరే గత ఎన్నికల దగ్గరి నుంచి పార్టీ కోసం పనిచేస్తూ వస్తున్నారు.

 అయితే, ఆయనకు టిక్కెట్ రాకుండా ఓ వర్గం గట్టిగా పనిచేస్తోంది. చంద్రబాబు కూడా ఎవరెక్కువ ఖర్చు పెట్టగలరని బేరీజు వేసుకుని టిక్కెట్ ఖరారు చేసే యోచనలో ఉన్నారు. కానీ, ఒక రోజు మాత్రమే నామినేషన్ గడువు ఉండటం, చివరి వరకు అభ్యర్థి ప్రకటించకపోవడంతో కేడర్ అయోమయంలో పడింది. నలుగురు నాయకులు వేర్వేరుగా శిబిరాలు నడపడంతో ఎవరివైపు ఉండాలో తేల్చుకోలేక కార్యకర్తలు సతమతమవుతున్నారు. విసిగి వేసారి, గ్రూపుల మధ్య మధ్య ఇమడలేక కొంతమంది క్లీన్‌గా ఉన్న వైఎస్సార్‌సీపీలోకి జారుకుంటున్నారు. చీపురుపల్లి టీడీపీ అభ్యర్థి ప్రకటన వెలువడగానే ఆ పార్టీ నుంచి భారీ ఎత్తున జంపింగ్‌లు జరగనున్నాయి.

 కురుపాంలో గందరగోళం
 కురుపాం పార్టీలో గందరగోళం చోటు చేసుకుంది. నియోజకవర్గ ఇన్‌చార్జిగా కొనసాగుతున్న నిమ్మక జయరాజ్‌తో పాటు కాంగ్రెస్ నుంచి ఇటీవల పార్టీలో చేరిన సిట్టింగ్ ఎమ్మెల్యే వి.టి.జనార్దన్ థాట్రాజ్  టిక్కెట్ కో సం ప్రధానంగా ఆశిస్తున్నారు. అధినేత టిక్కెట్ ఖరారు చేయకపోయినా మరొక రోజే గడువు ఉండడంతో  తమకే దక్కుతుందన్న ఉద్దేశంతో ఇద్దరూ టీడీపీ తరఫున నామినేషన్లు దాఖలు చేశారు. వారిద్దరే కాకుండా జనార్దన్ థాట్రాజ్ తల్లి, నర్సింహథాట్రాజ్ కూడా టీడీపీ తరపున నామినేషన్ వేశారు. మొత్తానికి ఆ పార్టీ తరఫున ముగ్గురు నామినేషన్ వేసినట్టయింది. మొత్తానికి అటు జయరాజ్, ఇటు థాట్రాజ్ రెండు వర్గాలుగా విడిపోవడంతో ఎవరి పక్క ఉండాలో తేల్చుకోలేక తీవ్రంగా నలిగిపోతున్నారు. అభ్యర్థి ప్రకటన వెలువడగానే ఓ వర్గం భగ్గుమనే అవకాశం ఉంది.

 చంద్రబాబు సభకు గైర్హాజరైన పడాల, కరణం
 గజపతినగరం నియోజకవర్గంలో మూడు గ్రూపులుగా ఉన్న టీడీపీలో చివరికి కొండపల్లి అప్పలనాయుడు గ్రూపే మిగిలింది. మిగతా రెండు గ్రూపులు పార్టీకి దూరంగా ఉండిపోయాయి. దీంతో టిక్కెట్ దక్కించుకున్న కేఏనాయుడుకి సంతోషం కరిగిపోయింది. అసమ్మతి కారణంగా ఓటమి తప్పదని పరిశీలకు భావిస్తున్నారు. ఎన్నికల్లో ఆయనతో కలిసి పనిచేసేది లేదని మాజీ మంత్రి పడాల అరుణ, మరో నేత కరణం శివరామకృష్ణ స్పష్టం చేశారు. సాక్షాత్తు ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు నియోజకవర్గ కేంద్రానికొచ్చి, ఎన్నికల ప్రచార సభ నిర్వహించినా ఆ ఇద్దరు నేతలు హాజరు కాలేదు. ఏం చేసుకున్నా పరావాలేదని చంద్రబాబు సభకు గైర్హాజరయ్యారు. వారి వద్దకు ఒకరిద్దరు నేతల్ని రాయబారానికి పంపినా పట్టించుకోలేదు.  

 బుజ్జగింపులకు తలొగ్గని డీవీజీ శంకరావు..
 టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, విజయనగరం పార్లమెంట్ అభ్యర్థి పూసపాటి అశోక్ గజపతిరాజు బుజ్జగించినా, పార్టీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి జగదీష్ ప్రాథేయపడినా మాజీ ఎంపీ డీవీజీ శంకరరావు కరగలేదు. పునరాలోచనే లేదని, రాజీనామాకు కట్టుబడే ఉన్నానని ఫోన్‌లో రాయబారం నెరిపిన ఆ ఇద్దరు నేతలతో నిర్మొహమాటంగా చెప్పేశారు. చంద్రబాబుతో మాట్లాడిస్తామని, స్పష్టమైన హామీ ఏదో ఇప్పిస్తామని ప్రలోభ పెట్టినా డీవీజీ రాజీ పడలేదు.

ఇంకా మాట్లాడాల్సిన అవసరం లేదని కరాఖండీగా చెప్పేశారు. ఇదిలా ఉండగా, పార్టీ చేసిన అన్యాయాన్ని జీర్ణించుకోలేక డీవీజీ అనుచరులంగా ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగాలని ఒత్తిడి చేస్తున్నారు.  చంద్రబాబు రాక ముందు జిల్లాలో పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో, ఆయన వచ్చి వెళ్లిన తరువాత కూడా అలాగే ఉన్నాయి.  సమస్యలు పరిష్కరించలేకపోవడం ఒక విధంగా బాబుకు అవమానకరమే.

మరిన్ని వార్తలు