రైల్వేలో చార్జీల దోపిడీ

7 Feb, 2017 01:42 IST|Sakshi
  • ఆన్‌లైన్‌ టిక్కెట్‌ రద్దులో భారీగా బాదుడు
  • వెయిటింగ్‌ లిస్ట్‌ టికెట్‌ రద్దు చేసినా రూ.60 వడ్డింపు
  • సాక్షి, అమరావతి: దేశంలో అత్యధిక మందికి అనుకూలమైన, చౌకైన రవాణా వ్యవస్థ రైల్వే మాత్రమే. కానీ రైల్వేలో మాత్రం సర్వీసు చార్జీ, రిజర్వేషన్‌ చార్జీలంటూ ప్రయాణికులపై పెనుభారం మోపుతున్నారు. సాధారణంగా రిజర్వేషన్‌ సమయంలోనే ప్రయాణికుడి నుంచి అదనంగా రూ.20 వసూలు చేస్తారు. ఆ టికెట్‌ కన్ఫర్మ్‌ కాకపోయినా రైల్వే శాఖ ప్రయాణికులపై అదనపు భారం వేస్తోంది. ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకున్న టికెట్లు, ఐఆర్‌సీటీసీ అనుబంధ ప్రైవేటు కౌంటర్లలో కొన్న టికెట్లు కన్ఫర్మ్‌ కాకపోతే.. వాటిని ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌ ద్వారా మాత్రమే రద్దు చేసుకోవాల్సి ఉంటుంది. వెయిటింగ్‌ లిస్టు చూపుతున్న టికెట్‌ ఆటోమేటిక్‌గా రద్దవుతుందని రైల్వే అధికారులు పేర్కొంటున్నారు. రద్దయిన టికెట్‌ మొత్తం సొమ్ము వాపసు చేయకుండా రూ.60 నుంచి రూ.80 వరకు కట్‌ చేసి ఇస్తున్నారు. ఐఆర్‌సీటీసీ ద్వారా బుక్‌ చేసే టికెట్లపై సర్వీస్‌ చార్జీ ఎత్తేస్తామని ఇటీవలే కేంద్ర బడ్జెట్‌లో పేర్కొ న్నారు. అది ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి వస్తుందని రైల్వే వర్గాలు చెబుతున్నాయి.

    టీడీఆర్‌ ఫైల్‌ చేస్తే ఖాతాలోకి టికెట్‌ సొమ్ము..
    ఆన్‌లైన్‌ టికెట్‌ ఆర్‌ఏసీలో ఉన్నప్పుడు.. రద్దు చేసుకోవాలనుకుంటే ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో ‘టికెట్‌ డిపాజిట్‌ రిసీట్‌’ ఫైల్‌ చేయాల్సి ఉంటుంది. రైలు ప్రారంభానికి 4 గంటల ముందు చార్ట్‌ ప్రిపేర్‌ అవుతోంది. ఆ లోపు టీడీ ఆర్‌ పూర్తిచేస్తే మన బ్యాంకు ఖాతాకు టికెట్‌ సొమ్ము వచ్చేస్తుంది. ‘వెయిటింగ్‌ లిస్టులోని టికెట్‌ కన్ఫర్మ్‌ అయితే రిజిస్టర్డ్‌ మొబైల్‌కు ఎస్‌ఎంఎస్‌ వస్తుంది. కన్ఫర్మ్‌ అయిన టికెట్‌ను చార్ట్‌ప్రిపేర్‌ అయ్యాక రద్దు చేసుకోవాలనుకుంటే.. పైసా కూడా వెనక్కి రాదు’’ అని దక్షిణ మధ్య రైల్వే అధికారి ఒకరు వివరించారు.

మరిన్ని వార్తలు