ఆన్‌లైన్‌ మోసం

31 Mar, 2017 03:10 IST|Sakshi

బొబ్బిలి రూరల్‌ : బ్యాంకు హెడ్‌ ఆఫీస్‌ నుంచి మాట్లాడుతున్నాం.... మీ ఏటీఎం కార్డు 16 అంకెల నంబర్, పిన్‌ నంబర్‌ తెలియజేయండంటూ ఓ వ్యక్తి నుంచి వివరాలు తీసుకుని ఏటీఎం నుంచి మూడు లావాదేవీలతో రూ.49,997లు డ్రా చేసిన వైనమిది. బాధితుడు శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలో ఎం.బూర్జవలస పంచాయతీ గున్నతోటవలసకు చెందిన  పప్పల శ్రీనివాసరావు గ్రోత్‌ సెంటర్‌లో కార్మికుడిగా పని చేçస్తున్నాడు. అతని ఖాతాలో కొంత మొత్తం ఉండగా, ఈ నెల 28న శ్రీనివాసరావుకు 8877425622 నంబర్‌ నుంచి ఫోన్‌ వచ్చింది.

 ‘మేం స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా హెడ్‌ ఆఫీస్‌ నుంచి మాట్లాడుతున్నాం.. మీ ఏటీఎం బ్లాక్‌ అయ్యింది... మీ ఏటీఎం కార్డుపై ఉన్న 16 అంకెలు తెలియజేసి, పిన్‌ నంబర్‌ తెలియజేయండి‘ అని ఫోన్‌ చేశారు. దీన్ని  నమ్మిన శ్రీనివాసరావు తానుబయట ఉన్నాను. నా ఏటీఎం కార్డు ఇంట్లో ఉంది. వివరాలు తెలియజేస్తాను పావు గంట పోయాక చేయండి అని ఫోన్‌ పెట్టేయగా పావు గంట పోయాక తిరిగి ఆ వ్యక్తి అదే నంబర్‌తో ఫోన్‌ చేయగా వివరాలు తెలియజేయగా పది నిమిషాలలో వరుసగా ఒకసారి రూ.19,999, మరోసారి రూ.9,999, తిరిగి రూ.19,999లు మొత్తంగా రూ.49,997లు డ్రా చేశాడు.

 ఎప్పుడు డ్రా చేసినా తన సెల్‌కు మెసేజ్‌ వచ్చేదని, కానీ తనకు మెసేజ్‌ రాలేదని బాధితుడు శ్రీనివాసరావు వాపోయాడు. గురువారం డబ్బులు డ్రా చేయడానికి ప్రయత్నిస్తే ఖాతాలో డబ్బులు లేవని తెలియజేయడంతో గ్రోత్‌ సెంటర్‌ ఎస్‌బీఐ బ్రాంచ్‌కి వచ్చి వివరాలు తీసుకుంటే మోసపోయిన సంగతి తెలిసినట్లు శ్రీనివాసరావు తెలిపారు. బ్రాంచ్‌ మేనేజర్‌ సుధీర్‌ను కలిసి విషయం తెలియజేస్తే తామేమీ చేయలేమని, దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. చేసేదేంలేక శ్రీనివాసరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మరిన్ని వార్తలు