వరదొస్తే అమరావతికి ముప్పే

13 Jan, 2020 02:48 IST|Sakshi
ఇటీవల వరదలకు మునిగిపోయిన రాజధానిలోని ఓ ప్రాంతం (ఫైల్‌)

అమరావతి గురించి హెచ్చరించిన చెన్నై ఐఐటీ

రాజధానిలో 71 శాతం భూములపై కృష్ణా వరద ప్రభావం

కృష్ణా, కొండవీటి వాగుకు ఒకేసారి వరదొస్తే మీటరు ఎత్తున ముంపు 

వరద ముప్పు నివారణకు 3 నుంచి 4 మీటర్ల ఎత్తున మట్టి నింపాలి

అమరావతిలో నల్లరేగడి నేలలు నిర్మాణాలకు అనువైనవి కావు

రాజధాని భూముల్లో 2.5 – 5 మీటర్ల లోతునే భూగర్భజలాలు

అందువల్ల భవనాలు, రోడ్ల నిర్మాణానికి పైల్‌ ఫౌండేషన్‌ తప్పనిసరి

పైల్‌ ఫౌండేషన్‌తో నిర్మాణ వ్యయం రెట్టింపు

రాష్ట్ర రాజధాని నిర్మాణానికి టీడీపీ సర్కార్‌ ఎంపిక చేసిన ప్రాంతంపై ఐఐటీ–చెన్నై ఇటీవల అధ్యయనం చేసింది. దాని ప్రకారం.. 
ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణా నది గరిష్ట వరద నీటి మట్టం 21.50 మీటర్లు.. కృష్ణా నదికి దక్షిణాన రాజధాని ప్రాంతం ఉంది. కృష్ణా నదిలో వరద ప్రవాహం ఆరు, ఏడు లక్షల క్యూసెక్కులు దాటితే రాజధాని గ్రామాల్లోకి వరద నీరు చేరి 71 శాతం ప్రాంతాన్ని ముంచెత్తుతుంది.

కొండవీటివాగు రాజధాని గుండా ప్రవహించి ఉండవల్లి అవుట్‌ఫాల్‌ స్లూయిజ్‌కు ఎగువన కృష్ణా నదిలో కలుస్తుంది. కొండవీటి వాగు గరిష్ట వరద మట్టం 17.50 మీటర్లు. స్థానికంగా వర్షాలు కురిస్తే కొండవీటివాగుకు వరద ఉప్పొంగుతుంది. కృష్ణా నది, కొండవీటి వాగులకు వరద వస్తే రాజధాని గ్రామాల్లో 71 % ప్రాంతంలో 0.5 నుంచి 1 మీటరు ఎత్తున నీళ్లు చేరి.. ముంచెత్తుతాయి.

సాక్షి, అమరావతి: రాజధాని నిర్మాణానికి అమరావతి ప్రాంతం ఏమాత్రం అనుకూలం కాదు.. వరద ముప్పు పొంచి ఉంది.. ఇదేదో రాజకీయ విమర్శ కానే కాదు.. దేశంలోనే ప్రతిష్టాత్మక విద్యా సంస్థ ఐఐటీ(ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ)–చెన్నై పరిశోధన చేసి తేల్చిచెప్పిన నగ్నసత్యం. అమరావతి నిర్మాణం చేపట్టిన 29 గ్రామాల్లో కనీసం 71 శాతం.. అంటే 21 గ్రామాలపై కృష్ణా నది వరదలు తీవ్ర ప్రభావం చూపుతాయని హెచ్చరించింది. ఆ ప్రాంతంలో భూములన్నీ నల్లరేగడి కావడంతో 2.5 నుంచి 5 మీటర్ల లోతులోనే భూగర్భజలాల లభ్యత ఉందని.. అందువల్ల రాజధాని గ్రామాల్లో భవన, రహదారుల నిర్మాణం కోసం రెట్టింపు వ్యయం తప్పదని స్పష్టం చేసింది. 

వరద ముంపు నుంచి రక్షణ కోసం రాజధాని భూముల్ని 3–4 మీటర్ల ఎత్తున మట్టితో నింపి అభివృద్ధి చేయాలని సీఆర్‌డీఏ(రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ) రూపొందించిన మాస్టర్‌ప్లాన్‌ను చెన్నై ఐఐటీ ఈ సందర్భంగా ఎత్తిచూపింది. వరద ముంపు నేపథ్యంలోనే మాస్టర్‌ప్లాన్‌లో ఈ సూచనలు చేశారని పరోక్షంగా ప్రస్తావించింది. 

భారీ భవంతులకు ఈ భూములు అనుకూలం కావు
‘రాజధానికి ఎంపిక చేసినవి నల్లరేగడి భూములు. కృష్ణా నది సమీపంలోనే ప్రవహిస్తుండటం వల్ల అమరావతి ప్రాంతంలోని గ్రామాల్లో భూగర్భజలాలు తక్కువ లోతులోనే లభ్యమవుతాయి. అందువల్ల ఈ భూములు భారీ భవన నిర్మాణాలకు అనుకూలం కావు. ప్రభుత్వ భవనాల సముదాయం, స్పోర్ట్స్‌ కాంప్లెక్స్, ఫైనాన్స్‌ సిటీ, టూరిజం సిటీల పనులు చేపట్టనున్న ప్రాంతాలపై వరదల ప్రభావం కూడా ఎక్కువ ఉంటుంది. ఈ భూముల్లో భవనాలను నిర్మించడానికి ర్యాప్ట్‌ ఫౌండేషన్‌(పునాదులు తవ్వి.. రెండు వైపులా ఇనుప రేకులు దించి.. కాంక్రీట్‌ వేయడం) పనికి రాదు’ అని చెన్నై ఐఐటీ స్పష్టంచేసింది. 

చాలా లోతు నుంచి పునాది వేయాలి
1. రాజధాని భూముల్లో 40 మీటర్ల లోతుకు తవ్వితేగాని రాతిపొర తగలదు. ఆ ప్రాంతంలో భవనాలు నిర్మించాలంటే.. పైల్‌ ఫౌండేషన్‌(రిగ్‌ల ద్వారా  చాలా లోతుకు పైల్‌లు దించి.. అక్కడి నుంచి కాంక్రీట్‌ వేయడం) అవసరం.
2.    పైల్‌ ఫౌండేషన్‌ విధానంలో పునాదుల నిర్మాణానికి భారీ వ్యయం అవుతుంది. ఇది భవన నిర్మాణ వ్యయాన్ని రెట్టింపు చేస్తుంది. 

రోడ్ల నిర్మాణమూ సవాలే..
భూగర్భజలాలు ఉబికి వచ్చే నల్లరేగడి నేలల్లో రహదారుల నిర్మాణం సవాలుతో కూడిందని ఐఐటీ–చెన్నై వెల్లడించింది.. రహదారుల నిర్మాణానికి కూడా పైల్‌ ఫౌండేషన్‌ విధానంలోనే పునాదులు వేయాలని.. అందువల్ల వ్యయం రెట్టింపు అవుతుందని స్పష్టం చేసింది. రాజధాని ప్రాంతాన్ని వరదల ముప్పు నుంచి తప్పించాలంటే కనీసం 3–4 మీటర్ల ఎత్తున మట్టిని నింపి.. అభివృద్ధి చేయాలని, ఇందుకు భారీ వ్యయం చేయాల్సి ఉంటుందని పేర్కొంది. ముంపు ప్రాంతంలోని.. నిర్మాణాలకు అనుకూలంగా లేని భూముల్లో రాజధాని నిర్మించడం క్షేమకరం కాదని తేల్చిచెప్పింది. నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్, నిపుణుల కమిటీ, బోస్టన్‌ కన్సల్టెన్సీ గ్రూప్‌(బీసీజీ)లు కూడా ఇదే రీతిలో నివేదికలు ఇవ్వడం గమనార్హం.  
జాతీయ మహిళా కమిషన్‌ను తప్పుదారి పట్టించే యత్నం 
రైతుల పేరుతో మహిళల్ని ముందుంచి అరాచకాలు సృష్టిస్తున్నారు 
టీడీపీ నేతలపై వాసిరెడ్డి పద్మ ధ్వజం 

సాక్షి, అమరావతి/జగ్గయ్యపేట/పెనుగంచిప్రోలు: జాతీయ మహిళా కమిషన్‌ సభ్యులను తప్పుదోవ పట్టించేందుకు టీడీపీ నేతలు ప్రయత్నించారని రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ ఆరోపించారు. రైతుల పేరుతో మహిళల్ని ముందుంచి అరాచకాలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ఆదివారం కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలోని ఎస్‌జీఎస్‌ కళాశాల గోల్డెన్‌ జూబ్లీ వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ రాజధాని ప్రాంతంలోని పరిస్ధితులను పరిశీలించేందుకు వచ్చిన మహిళా కమిషన్‌కు ఇక్కడ ఏదో జరిగిపోతోందనే రీతిలో వివరించేందుకు టీడీపీ మహిళా నేతలు ప్రయత్నించారని మండిపడ్డారు. కమిషన్‌ సభ్యులకు అడుగడుగునా ఆటంకాలు సృష్టించారని పేర్కొన్నారు. మహిళలను రాజకీయ క్రీడా చదరంగంలో పావులుగా వాడుకోవడం తెలుగుదేశం పార్టీకి తగదన్నారు. టీడీపీ మహిళానేతలు మహిళలకు మెసేజ్‌లు పెట్టి.. కమిషన్‌ సభ్యులు ఎక్కడికి వెళ్తే అక్కడికి రప్పించి అరాచకాలు సృష్టించే ప్రయత్నాలు చేశారన్నారు.

పెయిడ్‌ ఆర్టిస్టులు పోలీసులను రెచ్చగొట్టడంతో పాటు బూతులు తిడుతున్నారని మండిపడ్డారు. 2017లో తుందుర్రులో మహిళలపై జరిగిన లాఠీచార్జి, పుష్కరాల్లో తొక్కిసలాటతోపాటు పొరుగు రాష్ట్రంలో ట్రాన్స్‌ఫార్మర్‌ పట్టుకొని రైతు చనిపోతే దాన్ని కూడా ఇక్కడే జరిగినట్లు ఫేక్‌ వీడియోలు సృష్టించి టీడీపీ శ్రేణులు సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. టీడీపీ కుటిల యత్నాలను జాతీయ మహిళా కమిషన్‌కు వివరించామన్నారు. రైతులతో చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నా మహిళలను అడ్డుపెట్టుకొని చంద్రబాబు రాజకీయాలు చేయటం దురదృష్టకరమన్నారు.  ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ కార్యకర్తల వేతనాలు పెంచారని గుర్తు చేశారు. సంక్రాంతి కానుకగా అమ్మఒడి కార్యక్రమాన్ని అమలు చేసిన విషయాన్ని ఆమె ప్రస్తావించారు. ప్రజలు వీటన్నింటినీ గమనిస్తూనే ఉన్నారని పేర్కొన్నారు. 

ప్రజల మొగ్గు మూడు రాజధానులకే 
శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం  
సాక్షి, విశాఖపట్నం:  రాష్ట్ర సమగ్రాభివృద్ధికే మూడు రాజధానులను కమిటీలు ప్రతిపాదించాయని, ప్రజలూ దీనికే మొగ్గు చూపిస్తున్నారని రాష్ట్ర శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం అన్నారు. ప్రజాభిప్రాయాన్ని అందరూ గౌరవించాలన్నారు. ఆదివారం విశాఖలోని సర్క్యూట్‌ హౌస్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. రాజధాని పేరుతో ఒకేచోట అభివృద్ధి కేంద్రీకరణ జరిగితే మిగతా ప్రాంతాలవారిలో అసంతృప్తి పెరుగుతుందన్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు శ్రీకాకుళం జిల్లాలో ఏ ఒక్క కేంద్ర సంస్థనైనా ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు. ఉత్తరాంధ్ర నుంచి వలసలు ఆగాలంటే పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణ ఒక్కటే మార్గమన్నారు. మూడు రాజధానుల ప్రతిపాదన రాకపోయుంటే ఉత్కళ కళింగ ఉద్యమం మళ్లీ ఊపందుకునేదన్నారు.  

రాజధానిపై బాబు అనవసర రాద్ధాంతం
ప్రభుత్వ విప్‌ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి
కారంపూడి (మాచర్ల): రాజధాని విషయంలో చంద్రబాబు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఎన్ని గిమ్మిక్కులు చేసినా రాజధాని విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గే అవకాశమే లేదని స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా కారంపూడి మండలంలోని కాచవరంలో ఆదివారం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన మాట్లాడారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ప్రజల సంక్షేమం విషయంలో సీఎం వైఎస్‌ జగన్‌ రాజీ పడకుండా ప్రతి ఒక్కరికీ మేలు చేసే సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారని, రాష్ట్రంలో అన్ని ప్రాంతాలూ అభివృద్ధి చెందాలనే సదాశయంతో ఉన్న ప్రభుత్వానికి వస్తున్న జనాదరణ ముందు ఎవరు ఏమి చేసినా అవి చెల్లవని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి పాల్గొన్నారు. 

రాజధాని అంటే 29 గ్రామాలు కాదు
బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వంగల శశిభూషణ్‌రెడ్డి
కడప కోటిరెడ్డి సర్కిల్‌: రాజధాని అంటే 29 గ్రామాలతో ముడిపడిన విషయంగా పరిగణించడం సమంజసం కాదని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వంగల శశిభూషణ్‌రెడ్డి అన్నారు. ఆదివారం కడపలో ఆయన మీడియాతో మాట్లాడారు. గత తెలుగుదేశం ప్రభుత్వం శివరామకృష్ణ కమిటీ నివేదికను బుట్టదాఖలు చేసిందని, లక్ష కోట్లతో రాజధానిని నిర్మించడం రాష్ట్ర ఆర్థిక వనరులపై భారమేనని శివరామకృష్ణన్‌ కమిటీ స్పష్టం చేసిందని చెప్పారు. ఈ విషయాన్ని దాచిపెట్టి అమరావతి ప్రజలను చంద్రబాబు మభ్యపెట్టారని ధ్వజమెత్తారు. 

రాజధానికి రూ.లక్ష కోట్లు ఖర్చవుతుందని మీరు గతంలో చెప్పలేదా?
టీడీపీ, బీజేపీలకు మంత్రి వెలంపల్లి ప్రశ్న
సాక్షి, విశాఖపట్నం/పెందుర్తి: రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌ రాజధాని నిర్మాణానికి రూ.లక్ష కోట్లు ఖర్చవుతుందని గతంలో బీజేపీ, టీడీపీ చెప్పలేదా? అని రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌ ప్రశ్నించారు. విశాఖలోని సర్క్యూట్‌ హౌస్‌లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. పరిపాలన వికేంద్రీకరణ అంశాన్ని చంద్రబాబు, పవన్‌ కల్యాణ్, కన్నా లక్ష్మీనారాయణ రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు రానున్న రోజుల్లో మూడు ఎమ్మెల్యే సీట్లకే పరిమితమవుతారన్నారు. పవన్‌కు ఒక విజన్‌ లేదని, ప్యాకేజీ ఇస్తే చాలన్నారు. పరిపాలన వికేంద్రీకరణపై బీజేపీలోనే భిన్నాభిప్రాయాలున్న విషయాన్ని కన్నా గమనించాలన్నారు.  

వికేంద్రీకరణతోనే రాష్ట్రాభివృద్ధి
ఏపీ ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి
ఉరవకొండ: అధికార, పాలన వికేంద్రీకరణతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని, ఇదే విషయాన్ని శివరామకృష్ణన్, జీఎన్‌ రావు కమిటీలతో పాటు బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూప్‌ ఇచ్చిన నివేదిక కూడా చెబుతోందని ఏపీ ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన అనంతపురం జిల్లా ఉరవకొండ మండలంలోని పెన్నహోబిళం శ్రీలక్ష్మీనృసింహ స్వామిని దర్శించుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ, విశాఖ కేంద్రంగా కార్యనిర్వాహక రాజధాని ప్రతిపాదనను స్వాగతిస్తున్నామన్నారు. రాయలసీమ ప్రాంతంలో హైకోర్టు ఏర్పాటు చేస్తే అభివృద్ధి జరుగుతుందన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు.

అమరావతిలో చంద్రబాబు ‘రియల్‌’ దందా
కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌ ధ్వజం
కర్నూలు(రాజ్‌విహార్‌): అమరావతి నిర్మాణంలో మాజీ సీఎం చంద్రబాబు ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కు పాల్పడి.. వేల ఎకరాలతో ‘రియల్‌’ దందాకు శ్రీకారం చుట్టారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కర్నూలు ఎమ్మెల్యే ఎంఏ హఫీజ్‌ఖాన్‌ విమర్శించారు. ఆదివారం ఆయన కర్నూలులో విలేకరులతో మాట్లాడారు. శ్రీబాగ్‌ ఒప్పందం ప్రకారం కర్నూలుకు రావాల్సిన రాజధానిని ఎలాంటి ప్రజాభిప్రాయ సేకరణ జరపకుండా అమరావతి ప్రాంతంలో ప్రకటించారన్నారు. దీనివల్ల ఆయనతోపాటు మిగతా టీడీపీ నేతలు లబ్ధిపొందారు తప్ప రాష్ట్ర ప్రజలకు జరిగిన మేలు ఏదీ లేదన్నారు. పాలనా వికేంద్రీకరణతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని, ఇందుకు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి కార్యాచరణ చేపట్టారని తెలిపారు. 

మరిన్ని వార్తలు