మాతాశిశు మరణాలు తగ్గిస్తాం

26 Nov, 2014 02:51 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:‘ఆశ కార్యకర్త నుంచి డీఎంహెచ్‌వో వరకు.. అందరూ బాధ్యతగా పనిచేయాల్సిందే, ఎవరు నిర్లక్ష్యం వహించినా చర్యలు తప్పవు. గతంలో ఈ జిల్లాలో పనిచేసిన అనుభవం ఉంది. ఆ అనుభవంతో జిల్లా వైద్యరంగాన్ని తీర్చిదిద్దుతాను. మాది పొరుగు జిల్లాయే. అందువల్ల శ్రీకాకుళం జిల్లా భౌగోళిక పరిస్థితులు, సమస్యలపై నాకు అవగాహన ఉంది. నాది కష్టపడే మనస్తత్వం. ఎక్కువగా సెలవులు పెట్టడం ఇష్టం ఉండదు. మాతా శిశు మరణాలను తగ్గించే ప్రయత్నం చేస్తాం. జిల్లా ప్రజలకు మెరుగైన వైద్య సేవలందిస్తాం’ అని వైద్య, ఆరోగ్యశాఖ జిల్లా అధికారి రెడ్డి శ్యామల స్పష్టం చేశారు. కొత్తగా బాధ్యతలు స్వీకరించిన ఆమె మంగళవారం ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. వివరాలు ఆమె మాటల్లోనే..
 
 నిరంతర సేవలు
 జిల్లాలో 24 గంటలూ పని చేసే ఆస్పత్రులు 26 ఉన్నాయి. ఎక్కడ ఏ సమస్య తలెత్తినా ఆయా ఆస్పత్రులకు రోగులను తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. 108 వాహనాలను అందుబాటులో ఉంచుతున్నారు. సిబ్బంది కొరత ఉన్నా భవిష్యత్తులో దాన్ని అధిగమించేందుకు ప్రయత్నిస్తాం. ప్రతి ఆస్పత్రిలో 10 కాన్పులకు మించి చేస్తే ప్రోత్సాహకాలు లభిస్తాయి. ప్రభుత్వం రూ.56 డైట్‌చార్జీలు చెల్లిస్తుంది. ప్రోత్సాహకం కింద రూ.1000 చెల్లిస్తుంది. 108 వాహనంలోనే రావాలి. 108లోనే వెళ్లాలి. జిల్లాలోని మెరుగైన వైద్య సేవలకు సంబంధించి ఆరోగ్యశాఖ కమిషనర్ నుంచి భారీగా నిధులు వచ్చేలా ప్రయత్నిస్తాం.
 
 నాలుగేళ్లు ఇక్కడ పని చేశా
 1987 నుంచి 1990 వరకు ఈ జిల్లాలోనే పనిచేశా. అప్పట్లో ఫోన్ సౌకర్యం లేదు, రవాణా లేదు. నెట్‌వర్క్ ఇబ్బంది చాలా ఎక్కువ. అయినా మారుమూల ప్రాంతంలో సీనియర్లతో కలిసి పనిచేశా. తరువాత అనేక విభాగాల్లో వివిధ ప్రాంతాల్లో పనిచేయాల్సి వచ్చింది. ఆ అనుభవంతో జిల్లా ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించేందుకు కృషి చేస్తా. సిబ్బంది సమష్టిగా పనిచేస్తే సాధించలేనిది ఏమీ లేదు. విశాఖ జిల్లాలో వివిధ హోదాల్లో ఏడేళ్లపాటు పనిచేశా. అక్కడున్నంత గిరిజన ప్రాంతం మరెక్కడా లేదు. అయినా గ్రామగ్రామానా పర్యటించా.విశాఖతో పోల్చుకుంటే జనాభా పరంగా, ఇబ్బందుల పరంగా ఇక్కడ తక్కువ. అయినా కష్ట పనిచేస్తా. సెలవులు అధికంగా పెట్టడం నాకు ఇష్టం ఉండదు.
 
 హైరిస్క్‌ను ముందే గుర్తిస్తాం
 గర్భిణులకు వైద్యం అందించే క్రమంలో ‘హైరిస్క్’ ఉంటే ముందే గుర్తించి వారిని రిఫరల్ ఆస్పత్రులకు పంపిస్తాం. వాస్తవానికి గర్భిణుల పరిస్థితులను ఎప్పటికప్పుడు ఆయా ప్రాంతాల ఆశ కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు పరిశీలిస్తుంటా రు. రిఫరల్‌కు పంపించినప్పుడు కూడా ఆ తరహా కేసుల్ని నిరంతరం సమీక్షిస్తుంటారు. గర్భస్థ మృతుల (మెటర్నిటీ డెత్స్) సంఖ్యను తగ్గిం చేందుకు ప్రభుత్వం అన్ని విధాల కృషి చేస్తోంది. వైద్యసిబ్బందిపై ఇప్పటికే ఉన్న అపోహలను తొలగించేందుకు ప్రయత్నిస్తాను. గతంలో పలు ఇబ్బందులున్నట్టు సిబ్బంది చెబుతున్నారు. వాటన్నింటినీ అధిగమించి మోడల్ జిల్లాగా శ్రీకాకుళాన్ని తీర్చిదిద్దుతాం. వైద్యసేవలకు సంబంధిం చి ఏ సమస్య ఎదురైనా 99639-94336 నెంబర్‌కు ఫోన్ చేయొచ్చు.
 

మరిన్ని వార్తలు