చైల్డ్ స్నాచింగ్; తల్లి చేతుల్లో నుంచి బిడ్డ అపహరణ

19 Dec, 2013 12:10 IST|Sakshi

రాజమండ్రి: తల్లి చేతుల్లో ఉన్న బిడ్డను దుండగులు గుంజుకుని ఎత్తుకుపోయిన సంఘటన తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి మున్సిపల్ కాలనీలో జరిగింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఉదంతం వివరాలు ఇలా ఉన్నాయి. సీతానగరం మండలం బొబ్బిలిలంకకు చెందిన నెర్లగంటి శ్రీను, అతని భార్య వెంకటలక్ష్మి తలవెంట్రుకలు కొని, అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు. వారికి రెండేళ్ల వయసున్న బాబు ఉన్నాడు.

మంగళవారం సాయంత్రం శ్రీను దంపతులు రోడ్డుపై వెళుతుండగా ఓ వ్యక్తి, ఓ మహిళ మోటార్ సైకిల్‌పై వారిని వెంబడించారు. రెండు వీధులు తిరిగాక బైక్‌పై వెనుక కూర్చున్న మహిళ వెంకటలక్ష్మి గుండెలకు హత్తుకుని ఉన్న బాబును గుంజుకుంది. అనంతరం వేగంగా అక్కడినుంచి పరారయ్యారు. శ్రీను దంపతులు అరుస్తూ వెంటబడ్డా ఫలితం లేకపోయింది.

దీనిపై బాధితులు బుధవారం త్రీ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలిసిన వైఎస్సార్  సీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి త్రీ టౌన్ పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని కిడ్నాపర్లను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని ట్రైనింగ్ డీఎస్పీ కొల్లి శ్రీనివాస్, సీఐ రమేష్‌లను కోరారు.

మరిన్ని వార్తలు