ఎస్పీ ఆఫీసుకు క్యూ కట్టిన చింతమనేని బాధితులు

5 Sep, 2019 13:46 IST|Sakshi

సాక్షి, పశ్చిమ గోదావరి : టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్ అక్రమాలపై ఫిర్యాదు చేసేందుకు ఆయన బాధితులు జిల్లా ఎస్పీ కార్యాలయానికి క్యూ కడుతున్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో చింతమనేని తమపై దాడులకు పాల్పడ్డారని బాధితులు జిల్లా ఎస్పీ నవదీప్‌సింగ్‌కు వివరించారు. గతంలో తమ ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసిన అధికారులు చర్యలు తీసుకోలేదని బాధితులు ఎస్పీకి తెలిపారు. ఆ కేసులపై విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని కోరారు. 

బాధితులపై ఫిర్యాదులపై నవదీప్‌సింగ్‌ మాట్లాడుతూ.. చింతమనేని అక్రమాలపై ఫిర్యాదు చేసినప్పటికీ న్యాయం జరగలేదని బాధితులు వినతిపత్రం అందజేసినట్టు తెలిపారు. వారి ఫిర్యాదులపై చట్టప్రకారం రీ ఎంక్వయిరీ చేపడతామని అన్నారు. విచారణను వేగవంతం చేస్తామని వెల్లడించారు. బాధితులకు తప్పకుండా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. చింతమనేనిపై 20 ఏళ్ల నుంచి 50 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. వాటిలో ఎక్కువగా పోలీసులపై దాడులు, ఎస్సీ, ఎస్టీ కేసులే ఉన్నాయని వివరించారు. తనపై తప్పుడు కేసులు పెట్టారంటూ చింతమనేని చేస్తున్న దుష్ప్రచారాన్ని ఖండించారు. ఇదివరకే 50 కేసులు నమోదు అయిన వ్యక్తిపై ఎవరైనా తప్పుడు కేసులు పెడతారా అని ఎస్పీ ప్రశ్నించారు. 

మరిన్ని వార్తలు