ఏపీ దిశ చట్టానికి చిరంజీవి అభినందనలు

12 Dec, 2019 10:05 IST|Sakshi

సాక్షి, అమరావతి: మహిళల భద్రత కోసం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తీసుకువస్తున్న చరిత్రాత్మక ఏపీ దిశా చట్టాన్ని కేంద్ర మాజీ మంత్రి, సినీ నటుడు చిరంజీవి అభినందించారు. ‘ఆంధ్రప్రదేశ్ దిశా చట్టం- 2019 తీసుకురావాలన్న ప్రభుత్వ నిర్ణయం అభినందనీయం. మహిళా సోదరీమణులకు, లైంగిక వేధింపులకు గురవుతున్న చిన్నారులకు ఈ చట్టం భరోసా, భద్రత ఇస్తుందన్న ఆశ నాలో ఉంది. దిశ సంఘటన మన అందర్నీ కలిచివేసింది. ఆ ఎమోషన్స్ తక్షణ న్యాయాన్ని డిమాండ్ చేశాయి. తక్షణ న్యాయం కంటే సత్వర న్యాయం మరింత సత్ఫలితాల్ని ఇస్తాయన్న నమ్మకం అందరిలో ఉంది. అందుకే అలాంటి సత్వర న్యాయం కోసం ఆంధ్రప్రదేశ్‌లో తొలి అడుగులు పడడం హర్షణీయం.

సీఆర్పీసీ(CRPC) ని సవరించడం ద్వారా 4 నెలలు అంతకంటే ఎక్కువపట్టే విచారణా సమయాన్ని 21 రోజులకు కుదించడం, ప్రత్యేక కోర్టులు, ఇతర మౌలిక సదుపాయాల్ని కల్పించడం.. అదేవిధంగా సోషల్ మీడియా ద్వారా మహిళల గౌరవాన్ని కించపరచడం లాంటివి చేస్తే తీవ్రమైన శిక్షలు విధించడం, చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడితే జీవిత ఖైదు విధించడం.. తదితర అంశాలు నేరాలోచన ఉన్న వాళ్లలో భయం కల్పిస్తాయి. ఇలాంటి చట్టాన్ని తేవడాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈ చర్యలతో మహిళాలోకం నిర్భయంగా, స్వేచ్ఛగా ఉండగలుగుతుందన్న నమ్మకం నాకు  ఉంది’ అని చిరంజీవి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
 చదవండి: అత్యాచారం చేస్తే ఉరే

మరిన్ని వార్తలు