తూర్పుగోదావరి, రంగంపేట (అనపర్తి): సామాజిక మాద్యమాల ద్వారా తన పాటతో మంచి గుర్తింపు పొందిన రంగంపేట మండలం వడిశలేరుకు చెందిన గాయని పసల బేబికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రముఖ సంగీత దర్శకుడు కోటి పిలుపు మేరకు హైదరాబాద్ వెళ్లిన బేబీకి అనుకోకుండా మెగాస్టార్ చిరంజీవి నుంచి ఆహ్వానం లభించింది. కోటి సారథ్యంలోని బోల్ బేబి బోల్ కార్యక్రమంలో పాడే పాటలను ప్రాక్టీసు చేస్తున్న సమయంలో శుక్రవారం బేబీకి ప్రముఖ హీరో, మెగాస్టార్ చిరంజీవి స్వయంగా ఫోన్ చేసి మాట్లాడారు. శనివారం ఉదయం తమ ఇంటికి రావాలని ఆహ్వానించడంతో ఆమె ఆనందంతో ఉబ్బితబ్బిబయింది. ఈ సందర్భంగా ఆమె ‘సాక్షి’తో ఫోన్లో మాట్లాడుతూ శనివారం ఉదయం చిరంజీవి ఇంటికి వెళ్లనున్నట్టు తెలిపింది.
హైదరాబాద్లోని మిర్రర్ కార్పొరేట్ కంపెనీ యాజమాన్యం శుక్రవారం ఉదయం తనను తమ కంపెనీకి తీసుకువెళ్లి సత్కరించారని బేబీ చెప్పింది. ఆ సంస్థ యాజమానులు విజయలక్ష్మి దంపతులు తన పాటలు విని అభినందించారని బేబీ తెలిపింది. సినీ పరిశ్రమలో తనకు పరిచయమున్న ప్రముఖ సినీ హీరోలైన బాలకృష్ణ, రామ్చరణ్లకు విజయలక్ష్మి ఫోన్చేసి తన గురించి వివరించి పాటలు పాడే అవకాశం కల్పించాలని కోరారని, దానిపై వారు స్పందిస్తూ తప్పకుండా అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారని బేబీ తెలిపింది.