వైఎస్ఆర్ నుంచి బాబు 'ఆ ఒక్కటి' నేర్చుకోలేదు

17 Mar, 2015 12:01 IST|Sakshi
వైఎస్ఆర్ నుంచి బాబు 'ఆ ఒక్కటి' నేర్చుకోలేదు

హైదరాబాద్: ప్రస్తుతం అధికారంలో ఉన్న వ్యక్తి... దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అనుయాయుడే అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జగ్గిరెడ్డి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మంగళవారం అసెంబ్లీలో జగ్గిరెడ్డి మాట్లాడుతూ... సీఎం చంద్రబాబు... పాదయాత్రులు చేయడం వైఎస్ఆర్ను చూసి నేర్చుకున్నారని... అలాగే సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలి సంతకాలు చేయడం కూడా వైఎస్ఆర్ను చూసి నేర్చుకున్నారని గుర్తు చేశారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే వ్యక్తి మహానేత వైఎస్ఆర్ అని జగ్గిరెడ్డి తెలిపారు.

మాట నిలబెట్టుకోవడం వైఎస్ఆర్ను చూసి చంద్రబాబు నేర్చుకుని ఉంటే బాగుండేదని ఆయన అన్నారు. పోలవరం కోసం వైఎస్ జగన్ పాదయాత్ర చేశారు. గతంలో రాష్ట్రాన్ని చంద్రబాబు తొమ్మిదేళ్లు పరిపాలించారు. ఆ కాలంలో డెల్టా ప్రాంతానికి చంద్రబాబు చేసిన కేటాయింపులు ఏమిటని ఈ సందర్బంగా జగ్గిరెడ్డి ప్రశ్నించారు. కరకట్టల కోసం రూ. 350 కోట్లు వైఎస్ఆర్ హయాంలో కేటాయించారని చెప్పారు. సర్ ఆర్థర్ కాటన్ తర్వాత... డెల్టాకు అంత ఖర్చు చేసింది వైఎస్ఆర్ మాత్రమే అని ఆయన స్పష్టం చేశారు. పట్టిసీమ ద్వారా చేయాలనుకున్నది పోలవరం ద్వారా సాధ్యమవుతుందని వెల్లడించారు.

అలాంటప్పుడు పోలవరం ప్రాజెక్టును ఎందుకు పక్కన పెడుతున్నారని జగ్గిరెడ్డి.... చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 22 శాతం అధికంగా టెండర్లు ఎందుకు ఇస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజాధనం లూటీ చేసే అధికారం ఎవరు ఇస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. డెల్టా రైతులను మోసం చేసేలా ప్రభుత్వం యత్నిస్తోందని ఆరోపించారు. రిజర్వాయర్లో నీటిని తోడేసేలా తక్కువ ఎత్తులో మోటార్లను అమరుస్తున్నారని విమర్శించారు. 13 మీటర్ల దిగువకు మోటార్లను అమర్చడం రైతులను ఇబ్బందిపెట్టడం కాదా అంటూ చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

మరిన్ని వార్తలు