వర్షిత కేసు: చిత్తూరు కోర్టు సంచలన తీర్పు

24 Feb, 2020 19:02 IST|Sakshi

సాక్షి, చిత్తూరు: సంచలనం సృష్టించిన వర్షిత హత్యాచారం కేసులో చిత్తూరు కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. చిన్నారి వర్షితపై కిరాతకంగా అత్యాచారం చేసి హత్య చేసిన రఫీని దోషిగా తేలుస్తూ ఉరి శిక్ష విధించింది.  గతేడాది నవంబర్ 7న చిత్తూరు జిల్లా కురబలకోట మండలం చేనేత నగర్‌లో తన తల్లిదండ్రులతో కలిసి పెళ్లికి వచ్చిన చిన్నారిని మదనపల్లి మండలానికి చెందిన లారీ క్లీనర్ మహమ్మద్ రఫీ అత్యాచారం చేసి ఆపై హత మార్చాడు. చిన్నారికి చాక్లెట్ తీసిస్తానని చెప్పి తీసుకెళ్లి దారుణానికి పాల్పడ్డాడు.

సీసీ ఫుటేజ్ ఆధారంగా  పోలీసులు నిందుతుడిని లారీ క్లీనర్ రఫీగా గుర్తించారు. అయితే హత్యానంతరం రఫీ ఛత్తీస్‌గఢ్‌కు పారిపోయి పోలీసులు గుర్తుపట్టకుండా గుండు గీయించుకున్నాడు. తల్లిదండ్రుల ఫిర్యాదులో భాగంగా పోలీసులు పకడ్బందీగా నిఘా పెట్టి రఫిని పట్టుకున్నారు. రఫిని అదుపులోకి తీసుకొన్న పోలీసులు అతనిపై హత్య, పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు.  ఇతడు గతంలోనూ పలువురు చిన్నారులపై అత్యాచారానికి పాల్పడినట్లు చార్జిషీటులో పేర్కొన్నారు. డిసెంబర్ 30వ తేదీ నుండి ఈ ఏడాది జనవరి మొదటి వారం వరకు 41 మంది సాక్షులను విచారించిన కోర్టు ఈ రోజు తుది తీర్పు వెలువరించింది.

తీర్పుపై ‍స్పందించిన హోంమంత్రి సుచరిత:
చిత్తూరు సెషన్ కోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పుపై హోంమంత్రి సుచరిత స్పందించారు. చిన్నారి పోస్టు మార్టం రిపోర్టు ఆధారంగా.. పోలీసులు సేకరించిన సాక్ష్యాలను కోర్టుకు సమర్పించడంతో హత్య జరిగిన 17 రోజుల్లోనే పోలీసులు చార్జీషీట్ దాఖలు చేశారు. డిసెంబర్ 30వ తేదీ నుండి ఈ ఏడాది జనవరి మొదటి వారం వరకు 41 మంది సాక్షులను విచారించిన కోర్టు ఎట్టకేలకు ఈ రోజు తుది తీర్పు వెల్లడించింది. బాలికపై అత్యాచారం, హత్య కేసులో అరెస్టయిన నిందితుడికి పోస్కో చట్టం కింద మరణశిక్ష విధించడం ఆంధ్రప్రదేశ్‌లో ఇదే మొదటిసారని మంత్రి పేర్కొన్నారు.  చదవండి: ఆడుకుంటూనే.. పోయింది!
లైంగికదాడి.. హత్య!

మరిన్ని వార్తలు