గుళ్లదూర్తి గుండెల్లో హానెమన్

27 Jul, 2014 01:24 IST|Sakshi

 కోవెలకుంట్ల:  ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగిన వ్యక్తిని ఇక్కడి ప్రజలు గుర్తించారు. ఆయన ప్రపంచానికి చేసిన సేవలను స్మరిస్తూ నలుదిశలా చాటి చెప్పేందుకు కర్నూలు జిల్లా కోవెలకుంట్ల మండలం గుళ్లదూర్తి గ్రామం వేదికైంది. హోమియోపతి సృష్టికర్త శామ్యూల్ ఫ్రెడరిక్ క్రిస్టియన్ హానెమన్‌కు గుళ్లదూర్తివాసులు అరుదైన గౌరవం కల్పించారు. గ్రామంలో ఆయన స్మృతి చిహ్నాన్ని ఏర్పాటు చేయడం మన దేశానికే గర్వకారణం. హానెమన్ విగ్రహాన్ని ఆదివారం ఆవిష్కరించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు.

 రోగుల హృదయాల్లో దేవుడు..
 1755వ సంవత్సరం ఏప్రిల్ 10న జర్మని దేశంలో జన్మించిన హానెమన్ బాల్యం నుంచి చాలా సృజనాత్మంగా ఉండేవారు. ఇరవై ఏళ్ల వయస్సులో లీప్జిగ్ పట్టణంలోని వైద్య కళాశాలలో చేరారు. డాక్టర్ పట్టా పుచ్చుకున్న తర్వాత పదేళ్లపాటు వైద్య సేవలందించారు. అయితే తాను చేస్తున్న వైద్య విధానం సరైంది కాదని కలత చెందారు. దీంతో వైద్యవృత్తిని విడిచి వ్యవసాయం, రసాయన మందుల తయారీ గురించి అధ్యయనం చేసి వాటిలో కొత్త విషయాలను అవగాహన చేసుకున్నారు.

 1796వ సంవత్సరంలో ఏ పదార్థమైతే ఆరోగ్యవంతులలో అనారోగ్యాన్ని కలిగిస్తుందో అదే పదార్థం ద్విగుణికరణ స్థితిలో ఆ రోగాన్ని నయం చేస్తుందని భావించాడు. ఇదే హోమియోపతి శాస్త్ర ప్రధాన సూత్రమని ప్రకటించారు. ఎంతో మంది ఎన్నో రకాలుగా ఈ వైద్య విధానాన్ని ఖండించినా, దానిపై దుష్ర్పచారం చేసినా చలించ క హానెమన్ ముందుకు సాగారు. ఎన్నెన్నో దీర్ఘకాలిక వ్యాధులకు మందులు కనిపెట్టి రోగుల హృదయాల్లో దేవుడిలా నిలిచారు. ప్రపంచంలో 80పైగా దేశాల్లో సుమారు 30 కోట్ల మంది ప్రజలు హోమియో వైద్యాన్ని ఆశ్రయిస్తున్నారంటే అది హానెమన్ కృషినే.

మరిన్ని వార్తలు