పాత ముఠాయే పంథా మార్చింది!

27 Mar, 2014 02:40 IST|Sakshi

* పీజీ మెడికల్ ఎంట్రెన్స్ ప్రశ్నపత్రం
* లీకేజీలో ‘హైటెక్ గ్యాంగ్’ ప్రమేయం
* నిర్ధారించిన రాష్ట్ర నేర పరిశోధన విభాగం
* 18 మంది నిందితుల గుర్తింపు.. అదుపులో 9 మంది
* న్యాయవాదితో వచ్చి లొంగిపోయిన ఓ ర్యాంకర్
* కేసు మూడురోజుల్లో కొలిక్కిరావాలన్న గవర్నర్
* ‘సిట్’ ఏర్పాటు చేసిన సీఐడీ అధికారులు

 
సాక్షి, హైదరాబాద్/ విజయవాడ/ గుంటూరు: గతంలో నిర్వహించిన కొన్ని పరీక్షల్లో హైటెక్ పద్ధతిలో మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడిన ముఠాలోని పాత్రధారులే ప్రస్తుతం సూత్రధారులుగా మారి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పీజీ వైద్య ప్రవేశ పరీక్ష ప్రశ్నపత్రం లీకేజీకి పాల్పడినట్లు సీఐడీ అధికారులు నిర్ధారించారు. ఈ ముఠాతో పాటు వీరితో కుమ్మక్కై ప్రశ్నపత్రాలు కొనుగోలు చేసిన విద్యార్థులు, దళారుల కోసం గాలింపు ముమ్మరం చేశారు. మొత్తం 18 మందిని నిందితులుగా గుర్తించిన సీఐడీ పోలీసులు వీరిలో 9 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు దర్యాప్తును మూడురోజుల్లో పూర్తి చేయాల్సిందిగా గవర్నర్ నరసింహన్ ఆదేశించడంతో సీఐడీలో ఇందుకోసం బుధవారం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటైంది.
 
నిఘా పెరగడంతో పంథా మార్చారు..: రాష్ట్రంలో ఈ ఏడాది వీఆర్‌ఓ/వీఏఓ పరీక్ష, 2009లో ఎంసెట్‌తో పాటు.. 2012లో చండీగఢ్ పీజీ మెడిసిన్ ఎంట్రెన్స్ (పీజీఐ-ఎంఈఆర్)ల సందర్భంగా కొన్ని ముఠాలు సెల్‌ఫోన్లు, బ్లూటూత్‌ల ద్వారా హైటెక్ పద్ధతిలో మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడిన విషయం విదితమే. ఈ స్కాముల్లో పాత్రధారులుగా ఉన్న కొందరు నిందితులే ప్రస్తుతం పీజీ మెడికల్ ఎంట్రన్స్‌లో ప్రశ్నపత్రాలు లీక్ చేసినట్లు సీఐడీ నిర్ధారించింది. పాత స్కాముల్లో సూత్రధారిగా ఉన్న కర్నూలు వాసి గురివిరెడ్డి... తాజా స్కామ్‌లో 12వ ర్యాంక్ సాధించిన వ్యక్తి స్నేహితుడు కావడం గమనార్హం. ఈ పరీక్షలో 1 నుంచి 150 వరకు ర్యాంకులు సాధించిన వారిని అనుమానితుల జాబితాలో చేర్చిన సీఐడీ గుంటూరు కేంద్రంగా వీరితో పాటు వారి తల్లిదండ్రుల్నీ ప్రశ్నిస్తోంది. ప్రాథమికంగా సేకరించిన వివరాల ప్రకారం ఈ స్కామ్‌కు పాల్పడిన ముఠాను, ర్యాంకర్లనూ కలిపి మొత్తం 18 మందిని ఈ కేసులో నిందితులుగా గుర్తించారు.
 
 ప్రశ్నపత్రం ముద్రితమైన కర్ణాటకలోని మణిపాల్‌లో ఉన్న ప్రింటింగ్ ప్రెస్ నిర్వాహకుడితో పాటు మరో ముగ్గురు ఉద్యోగుల్నీ ప్రత్యేక బృందం అదుపులోకి తీసుకుంది. వీరిచ్చిన సమాచారం మేరకు దళారులుగా వ్యవహరించిన కర్ణాటకతో పాటు రాష్ట్రంలోని మూడు ప్రాంతాలకు చెందిన వ్యక్తుల్ని పట్టుకున్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు విద్యార్థులతో కలిపి 9 మందిని అదుపులోకి తీసుకున్నారు. గుంటూరుకు చెందిన ఓ వైద్యుడు ఉన్నట్టు సమాచారం. ఢిల్లీకి చెందిన ఓ ర్యాంకర్ బుధవారం తన న్యాయవాది సాయంతో వచ్చి హైదరాబాద్‌లోని సీఐడీ కార్యాలయంలో లొంగిపోయాడు. బ్యాంకు ఖాతాలు కొన్నిటిని అధికారులు స్తంభింపజేశారు. ఈ కేసు దర్యాప్తులో పురోగతిని సీఐడీ చీఫ్ టి.కృష్ణ ప్రసాద్ బుధవారం రాత్రి నివేదిక రూపంలో డీజీపీతో పాటు గవర్నర్ నరసింహన్‌కు సమర్పించారు. ఎంట్రెన్స్ పరీక్షలపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో కౌన్సెలింగ్ ముగిసే లోపు తేలాల్సి ఉండటంతో కేసు దర్యాప్తును మూడురోజుల్లోగా పూర్తి చేయాల్సిందిగా గవర్నర్ ఆదేశించారు. దీంతో ఈ కేసును డీజీపీ బి.ప్రసాదరావు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఇంటెలిజెన్స్ చీఫ్ ఎం.మహేందర్‌రెడ్డి, కృష్ణప్రసాద్‌ల నేతృత్వంలో పని చేసేలా సిట్‌ను ఏర్పాటు చేశారు. దర్యాప్తు అధికారిగా అసిస్టెంట్ ఎస్పీ హోదాలో ఉన్న ఐపీఎస్ అధికారి డాక్టర్ బి.నవీన్‌కుమార్‌ను నియమించారు. ఇలావుండగా ప్రవేశపరీక్ష రద్దు చేయవద్దని కోరుతూ రాసిన కొందరు విద్యార్థులు బుధవారం ఓ వినతిపత్రాన్ని నరసింహన్ కార్యదర్శి రమేశ్‌కు సమర్పించారు.
 
వర్సిటీలో విచారణ ముమ్మరం: విజయవాడలోని వర్సిటీలో బుధవారం ఎస్పీ స్థాయి అధికారి మకాం వేసి రికార్డులను పరిశీలించి స్వాధీనం చేసుకున్నారు. కాగా కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామ్స్ విజయ్‌కుమార్‌ను సిఐడీ అధికారులు హైదరాబాద్, ప్రశ్న పత్రాలు ప్రింటింగ్ జరిగిన కర్ణాటక రాష్ట్రానికి తీసుకెళ్లి విచారిస్తున్నట్టు సమాచారం.  
 
 అసలు స్కాము గుంటూరులో..?
 సాక్షి, గుంటూరు: గుంటూరు కేంద్రంగానే ఈ స్కాము జరిగిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నారుు. దీంతో  బుధవారం గుంటూరులోని సీఐడీ కార్యాలయంలో కొందరు వైద్యులతో పాటు విద్యార్థుల్నీ విచారించారు. ఐదుగురు వైద్యులను, గుంటూరు, నరసరావుపేట, అచ్చంపేట, చిలకలూరిపేటలకు చెందిన 11 మంది పీజీ వైద్య విద్యార్థులను ప్రశ్నించినట్టు సమాచారం. విశ్వసనీయ సమాచారం మేరకు గుంటూరు నగరానికి చెందిన ఓ వైద్యునికి లీకేజీ ముఠాతో పరిచయం ఏర్పడింది. ఎంబీబీఎస్ కనాకష్టంగా గట్టెక్కిన తన కుమార్తెను పీజీ చేయించేందుకు సదరు వైద్యుడు ఆ ముఠాతో చేతులు కలిపారు. రూ. 25 లక్షలకు బేరం కుదుర్చుకుని పరీక్ష పేపర్‌ను అందుకున్నారు. ఢఇతర విద్యార్థులకు అమ్మితే తాను మరింత డబ్బు సంపాదించవచ్చనే ఆలోచనతో ఆ వైద్యుడు గుంటూరులో పీజీ వైద్య పరీక్షలు రాస్తున్న పిల్లలు ఉన్న కొందరు వైద్యుల వద్దకు వెళ్ళి డబ్బు చెల్లిస్తే పేపర్ జిరాక్స్ ఇస్తానంటూ చెప్పారు. ఆయన్ను నమ్మిన కొందరు పేపర్ కొనుగోలు చేశారు. స్థానికంగా కొందరికి 50 లోపు ర్యాంకులు రావడంతో తమను ఆశ్రయించిన వైద్యుడే పేపర్ లీక్ చేశారని నిర్ధారించుకుని సీఐడీకి సమాచారం ఇచ్చినట్టు తెలిసింది.

>
మరిన్ని వార్తలు