‘చంద్రమండలానికి కూడా అభ్యంతరం అంటారు’

23 Feb, 2020 13:12 IST|Sakshi

సాక్షి, ప్రకాశం: ‘సీఎం కప్’ పేరుతో క్రీడా పోటీలు జరపడం ఆనందదాయకమని రాష్ట్ర ఇంధన, అటవీ, శాస్త్ర, పర్యావరణ, సాంకేతిక శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. క్రీడల వల్ల మానసిక ఉల్లాసంతోపాటు ఉద్యోగాల్లో కోటా కూడా ఉంటుందన్నారు. ఆదివారం ఉదయం ఆయన ఒంగోలులోని స్థానిక మినీ స్టేడియంలో క్రీడా పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మార్చి 7, 8వ తేదీల్లో జిల్లాలో జరిగే బీచ్‌ ఫెస్టివల్‌ క్రీడల పోటీలో అందరూ ఉత్సాహంగా పాల్గొనాలన్నారు.(‘సీఎం కప్ పేరుతో ‍ క్రీడలు నిర్వహిస్తాం’)

ఈ కార్యక్రమానికి హాజరైన పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి పేరు మీద క్రీడలు జరపడం ఇదే తొలిసారని సంతోషం వ్యక్తం చేశారు. విద్యార్థి శక్తి ఏంటో తనకు బాగా తెలుసన్నారు. సీఎం జగన్‌ ఫిట్‌నెస్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని పేర్కొన్నారు. ఆటలు పిల్లల హక్కని.. ఆడించకపోతే స్కూళ్ల మీద విద్యాశాఖ మంత్రికి ఫిర్యాదు చేయండని సూచించారు. ఇక మూడు రాజధానుల అంశాన్ని ప్రస్తావిస్తూ.. సీఎం జగన్‌ మూడు ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు. దీనిపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ రాజధాని విషయంలో టీడీపీ అనవసర ఆరోపణలు చేస్తుందని విమర్శించారు. ‘మొన్న కేంద్రం ఒప్పుకోదన్నారు.. నేడు నేవీకి అభ్యంతరం అన్నారు.. రేపు అమెరికాకు, చంద్రమండలానికి అభ్యంతరం అంటారు. చంద్రబాబు అభ్యంతరాలు మాకు అక్కర్లేదు, రాష్ట్ర ప్రయోజనాలే మాకు ముఖ్యమ’ని అవంతి శ్రీనివాస్‌ స్పష్టం చేశారు.(కార్పొరేట్‌ శక్తులకు బీజేపీ ఊడిగం)

మరిన్ని వార్తలు