సాక్షి, అమరావతి: సీఎం చంద్రబాబు నాయుడు హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 65లో ఇటీవలే అత్యంత అధునాతన సౌకర్యాలతో నిర్మించుకున్న భవనాన్ని క్యాంపు కార్యాలయంగా గుర్తిస్తూ రాష్ట్ర ప్రభుత్వ సాధారణ పరిపాలన విభాగం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే హైదరాబాద్లోని లేక్వ్యూ అతిథిగృహం, మదీనాగూడలోని ఫాం హౌస్ను క్యాంపు కార్యాలయాలుగా గుర్తించిన విషయం తెలిసిందే.
మరోవైపు రాజధాని అమరావతిలో ఉండవల్లి కరకట్ట అతిథిగృహం, విజయవాడలోని ఇరిగేషన్ కార్యాలయాన్ని క్యాంపు కార్యాలయాలుగా గుర్తించి.. నిధులు కేటాయించి అభివృద్ధి చేశారు. వారంక్రితం చిత్తూరు జిల్లా నారావారిపల్లెలోని సీఎం ఇంటిని సైతం క్యాంపు కార్యాలయంగా గుర్తించి రూ.36 లక్షల నిధులు కేటాయించడం విదితమే. హైదరాబాద్లో నిర్మించిన భవనానికి నిధులు కేటాయించడంలో ఆటంకాల్లేకుండా ఉండేందుకు క్యాంపు కార్యాలయంగా గుర్తించారని అధికార వర్గాల్లో చర్చ నడుస్తోంది.