కారుణ్య నియామకాలకు గ్రీన్‌ సిగ్నల్‌

19 Sep, 2019 10:36 IST|Sakshi

ఆర్టీసీ కార్మిక కుటుంబాల్లో సంబరం 

జిల్లాలో సుమారు 110 మందికి ఉద్యోగావకాశం

సీఎం నిర్ణయంపై కార్మిక సంఘాల హర్షం  

ఆర్టీసీకి కార్మికులే చక్రాల్లాంటి వారు. అలాంటి కార్మికుల కుటుంబాలు ఇంటి పెద్దదిక్కును కోల్పోయి ఇబ్బందుల్లో ఉన్నా.. సంస్థే అప్పుల్లో కూరుకుపోయినా  ఏ ఒక్కరూ పట్టించుకోలేదు. కానీ అధికారంలోకొచ్చిన వెంటనే వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆర్టీసీకి పునర్జీవం పోశారు. సంస్థను ప్రభుత్వంలో విలీనం చేస్తున్నట్లు ప్రకటించి చరిత్ర సృష్టించారు. తాజాగా ఆర్టీసీలో కారుణ్య నియామకాలకు బుధవారం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చి కార్మికుల కుటుంబాల్లో వెలుగులు నింపారు. 

సాక్షి, అనంతపురం : ఆర్టీసీ కార్మికుల కుటుంబీకుల కల సాకారం కాబోతోంది. ఆర్టీసీలో కారుణ్య నియామకాలకు ప్రభుత్వం ఆమోదం తెలపడంతో జిల్లాలోని 110 కుటుంబాల్లో వెలుగులు నిండనున్నాయి.  

గత నెలలోనే 149 మందికి... 
గతనెలలోనే 31 డిసెంబర్‌ 2012 నాటికి మృత్యువాత పడిన ఆర్టీసీ కార్మికుల కుటుంబాల్లోని 149 మందికి కారుణ్య నియామకాల కింద ఉద్యోగాల కల్పిం చేందుకు నిర్ణయం తీసుకున్నారు. తాజాగా 1 జనవరి 2013 నుంచి ఇప్పటి వరకు మరణించిన కార్మికుల కుటుంబాల్లోని వారికి ఉద్యోగాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు బుధవారం ఆర్టీసీ ఎండీ సర్క్యులర్‌ విడుదల చేశారు.  

రీజియన్‌లో 110 మంది 
జిల్లాలో 2013 నుంచి ఇప్పటి వరకు దాదాపుగా 110 మంది కుటుంబాలు కారుణ్య నియామకాల కోసం ఎదురుచూస్తున్నాయి. గత ప్రభుత్వం ఆర్టీసీ కుటుంబాలను విస్మరించింది. కానీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అనతి కాలంలోనే ఆర్టీసీ కార్మికులకు అండగా నిలవడంతో కార్మిక సంఘాల నేతలు హర్షాతిరేకలు వ్యక్తం చేస్తున్నారు. 

అభినందనీయం 
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చరిత్రకెక్కారు. ఇప్పుడు కారుణ్య నియామాలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. చాలా సంతోషంగా ఉంది. వెయ్యి మంది కా ర్మికుల కుటుంబాల్లో వెలుగులు నింపారు. సీఎం సార్‌కు అభినందనలు. ఆర్టీసీ ఎండీకి కృతజ్ఞతలు.  
– పీవీ రమణారెడ్డి, ఎన్‌ఎంయూ రాష్ట్ర అధ్యక్షుడు   

మరిన్ని వార్తలు