ఔట్‌సోర్సింగ్‌ కార్పొరేషన్‌ను ప్రారంభించిన సీఎం జగన్‌

12 Nov, 2019 13:08 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం ఏపీ ఔట్‌సోర్సింగ్‌ కార్పొరేషన్‌ను ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్‌ కార్పొరేషన్‌ ఫర్‌ ఔట్‌సోర్స్‌డ్‌ ఎంప్లాయిస్‌ (ఏపీ ఆప్‌కాస్‌) వెబ్‌సైట్‌ను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. జనవరి 1 నుంచి ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగాలకు ప్లేస్‌మెంట్‌ ఆర్డర్‌ ఇవ్వనున్నట్టు తెలిపారు. ప్రతి ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగానికి కోడ్‌ నెంబర్‌ ఉంటుందని, ప్రతి కాంట్రాక్టును ఒక ఎంటీటీగా తీసుకోవాలని సీఎం సూచించారు. మధ్యవర్తులు లేకుండా ఉద్యోగులకు మేలు జరిగేందుకు ఔట్‌సోర్సింగ్‌ కార్పొరేషన్‌ను ప్రారంభించినట్టు తెలిపారు. ఈ కార్పొరేషన్‌ పరిధిలోనే ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాలు భర్తీ చేస్తామని సీఎం వెల్లడించారు.

లంచాలు తీసుకొని ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి ఉండకూదని చెప్పారు. లంచాలు, మోసాలకు తావులేకుండా ఉద్యోగాలు ఇవ్వాలని స్పష్టం చేశారు. ఇక ఎన్నికల హామీలో భాగంగా ప్రభుత్వ ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన వారికి 50శాతం కల్పిస్టున్నట్టు సీఎం తెలిపారు. జిల్లాస్థాయిలో యాభైశాతం ఉద్యోగాలు మహిళలకే ఇవ్వాలని స్పష్టం చేశారు. సకాలంలో జీతాలు వచ్చేలా చూసేందుకు ఔట్‌ సోర్సింగ్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు చేసినట్టు ముఖ్యమంత్రి వెల్లడించారు. డిసెంబర్‌ 15 కల్లా ఉద్యోగాల జాబితా సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లా స్థాయిలో ఇంచార్జి మంత్రి అప్రూవల్‌ అథారిటీగా ఉంటారని, జిల్లా కమిటీకి ఆయా కలెక్టర్లు నేతృత్వం వహిస్తారని తెలిపారు.

మరిన్ని వార్తలు