ఆరోగ్య ధీమా

3 Jan, 2020 04:00 IST|Sakshi

వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పరిధిలోకి 1.42 కోట్ల కుటుంబాలు

రాష్ట్రంలో 95.85 శాతం కుటుంబాలకు లబ్ధి

క్యాన్సర్‌ సహా 2,059 వ్యాధులకు వైద్యం బిల్లు రూ.1,000 దాటితే పథకం వర్తింపు

ఫిబ్రవరి నుంచి క్యాన్సర్‌కు పూర్తి వైద్యం

పశ్చిమ గోదావరి జిల్లాలో పైలట్‌ ప్రాజెక్టుగా నేటి నుంచి అమలు

మిగతా జిల్లాల్లో 1,259 రోగాలకు వైద్య సేవలు 

ఏప్రిల్‌ నుంచి ప్రతి నెలా ఒక్కో జిల్లాలో 2,059 వ్యాధులకు చికిత్స విస్తరణ

నేడు ఏలూరులో ఆరోగ్య శ్రీ కార్డుల పంపిణీకి సీఎం జగన్‌ శ్రీకారం

175 నియోజకవర్గాల్లో తొలి రోజు 1.5 లక్షల కార్డుల పంపిణీకి సర్వం సిద్ధం

అందరికీ కొత్త కార్డులు పంపిణీ అయ్యే వరకు పాత కార్డులకూ వర్తింపు

మంత్రులు, ఎమ్మెల్యేలు, రాజకీయ నేతల జోక్యం ఎక్కడా లేకుండా తొలిసారిగా అర్హతే ప్రామాణికంగా కుల, మత, రాజకీయాలకు అతీతంగా వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ లబ్ధిదారులను ఎంపిక చేశారు. వైఎస్సార్‌ ఆరోగ్య శ్రీ పథకం కింద అన్ని రకాల క్యాన్సర్లకూ, డెంగీ, మలేరియా, చికున్‌గున్యాతో పాటు సీజనల్‌ వ్యాధులకు కూడా చికిత్స అందిస్తారు. ఈ పథకం కింద శస్త్ర చికిత్స చేయించుకున్న వారు కోలుకునే వరకు రోజుకు రూ.225 చొప్పున, లేదా నెలకు రూ.5 వేలు ‘వైఎస్సార్‌ ఆరోగ్య ఆసరా’ పేరుతో ఆర్థిక సాయం చేస్తున్నారు. గత నెల 2వ తేదీన సీఎం వైఎస్‌ జగన్‌ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం తెలిసిందే.

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పేద, మధ్య తరగతి కుటుంబాలు ఇక డబ్బుల్లేక వైద్యం చేయించుకోలేని దుస్థితి ఉండదు. రాష్ట్రంలోని 95.85 శాతం కుటుంబాలకు వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పేరుతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆరోగ్య భరోసా కల్పించారు. రాష్ట్రంలో 1,42,54,134 కుటుంబాలకు వైఎస్సార్‌ ఆరోగ్య శ్రీ వర్తింపచేసే కొత్త కార్డుల పంపిణీ కార్యక్రమానికి శుక్రవారం ఆయన   పశ్చిమగోదావరి జిల్లాలో శ్రీకారం చుట్టనున్నారు. చికిత్స వ్యయం రూ.1,000 దాటితే ఈ పథకం వర్తింప చేస్తూ నేడు ఏలూరులో నాంది పలకనున్నారు. కొత్తగా 1,000 వ్యాధులను ఆరోగ్యశ్రీ పరిధిలో చేర్చి, మొత్తం 2,059 వ్యాధులకు వైద్యం అందించే పైలట్‌ ప్రాజెక్టును తొలుత ఈ జిల్లాలో అమలు చేయనున్నారు. మిగతా జిల్లాల్లో కూడా శుక్రవారం నుంచి 1,259 వ్యాధులకు ఆరోగ్యశ్రీని వర్తింప చేయనున్నారు.

ఏప్రిల్‌ నుంచి ప్రతి నెలా ఒక్కో జిల్లాలో 2,059 రోగాలకు ఈ పథకాన్ని విస్తరిస్తూ వెళతారు. అప్పటి నుంచే ఆయా జిల్లాల్లో.. చికిత్స వ్యయం రూ.1,000 దాటితే ఆరోగ్యశ్రీ వర్తించడం ప్రారంభమవుతుంది. అన్ని రకాల క్యాన్సర్లకూ ఈ పథకం వర్తించనుంది. ఆసుపత్రులతో టై అప్, ఇతర కార్యక్రమాలు పూర్తి చేసి ఈ నెలాఖరు కల్లా క్యాన్సర్‌ చికిత్సను రోగులకు అందుబాటులోకి తీసుకురానున్నారు. కాగా, వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ కొత్త కార్డుల పంపిణీ పూర్తయ్యే వరకు పాత కార్డులు కూడా పని చేస్తాయి. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో తొలి రోజు అంటే శుక్రవారం 1.5 లక్షల కొత్త కార్డుల పంపిణీకి ఏర్పాట్లు చేశారు. కాగా, గతంలో ఈ పథకం కింద చిన్నారులకు ఒక చెవికి మాత్రమే కాక్లియర్‌ ఇంప్లాంట్‌ ఆపరేషన్‌ చేసేవారు. ఇప్పుడు దాన్ని రెండు చెవులకూ వర్తింప చేస్తున్నారు.  
 
వార్షిక ఆదాయం రూ.5 లక్షల లోపు ఉంటే వర్తింపు
దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రారంభించారు. తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఆ పథకాన్ని కొనసాగించడం తప్ప మరో మార్గం లేకుండా పోయింది. అయితే ఈ పథకానికి ప్రాధాన్యతను తగ్గించేశాయి. 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం.. ఈ పథకాన్ని పూర్తిగా నీరుకార్చింది. పేద, మధ్య తరగతి ప్రజలు వైద్యం అందక పడుతున్న ఇక్కట్లను అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్రలో కళ్లారా చూశారు. యూనివర్సల్‌ ఆరోగ్య బీమా తీసుకువస్తానని, చికిత్స వ్యయం రూ.1,000 దాటితే ఆరోగ్యశ్రీని వర్తింప చేస్తామని ప్రకటించారు.

ఆదాయ పరిమితిని ఏకంగా రూ.5 లక్షలకు పెంచడంతో మధ్య తరగతి వర్గాల వారికి ఈ పథకం ఒక వరం అనడంలో ఎలాంటి సందేహం లేదు. వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా నిర్వహించారు. నవంబర్‌ నెలలో వైఎస్సార్‌ నవశకం పేరుతో గ్రామ, వార్డు వలంటీర్లు ఇంటింటి సర్వే నిర్వహించారు. వార్షిక ఆదాయం రూ.5 లక్షల లోపు ఉన్న వారందరినీ అర్హులుగా గుర్తించారు. సామాజిక తనిఖీల నిమిత్తం గ్రామ, వార్డు సచివాలయాల్లో లబ్ధిదారుల జాబితాలను ప్రదర్శించారు. అభ్యంతరాలు స్వీకరించారు. అనంతరం గ్రామ, వార్డు సభలు నిర్వహించి తుది జాబితా తయారు చేశారు.

నాడు వైఎస్‌ కూడా ఇక్కడి నుంచే..
సాక్షి ప్రతినిధి, ఏలూరు: దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఆరోగ్యశ్రీ పథకాన్ని 2007 ఏప్రిల్‌ 1న ఏలూరు వేదికగా  ప్రారంభించారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో నిర్వీర్యమైన ఈ పథకానికి జవసత్వాలు నింపి, వినూత్న మార్పులతో నేడు ఆయన కుమారుడు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇదే ఏలూరు వేదికపై నుంచే ప్రారంభిస్తుండటం విశేషం. ఉదయం 11 గంటలకు ఏలూరు మండలం వంగాయగూడెంలో డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం.. 11.25 గంటలకు ఏలూరు ఇండోర్‌ స్టేడియంలో వైఎస్సార్‌ ఆరోగ్య శ్రీ పైలట్‌ ప్రాజెక్టును ప్రారంభిస్తారు.

ఈ పథకం కింద 2,059 వ్యాధులకు చికిత్స అందించడమే కాకుండా దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడుతున్న వారికి పింఛన్లకు శ్రీకారం చుట్టడం పేద, మధ్యతరగతి వర్గాల పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్న ఔదార్యాన్ని చాటుతోంది. డయాలసిస్‌ పేషంట్లకు ఇస్తున్న విధంగానే తలసేమియా, సికిల్‌సెల్‌ ఎనీమియా, హిమోఫిలియా రోగులకు రూ.10 వేల చొప్పున పెన్షన్‌ ఇవ్వనున్నారు. ప్రమాదాల కారణంగా లేదా పక్షవాతం, తీవ్రమైన కండరాల క్షీణత వల్ల మంచానికే పరిమితమైన వారికి, బోదకాలు, దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధిగ్రస్తులకు (స్టేజ్‌ 3,4,5) నెలకు రూ.5 వేల పెన్షన్, కుష్టువ్యాధితో బాధపడుతున్నవారికి రూ.3 వేల పెన్షన్‌ ఇవ్వనున్నారు.   
 
రెండు నెలలు పైలట్‌ ప్రాజెక్టుగా అమలు
వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకాన్ని పశ్చిమ గోదావరి జిల్లాలో రెండు నెలల పాటు పైలట్‌ ప్రాజెక్టుగా అమలు చేసి, అందులో ఉన్న లోటుపాట్లను గుర్తించి సరిచేశాక ఏప్రిల్‌ నుంచి ప్రతి నెలా ఒక్కో జిల్లా చొప్పున విస్తరిస్తూ వెళతారు. ఈ పథకాన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో సమర్థవంతంగా అమలు చేసేందుకు పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాల కల్పన దిశగా ‘నాడు–నేడు’ కింద అడుగులు వేస్తున్నారు. నిబంధనలకు అనుగుణంగా అన్ని సదుపాయాలున్న రాష్ట్రంలోని, హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలలోని కార్పొరేట్, ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో ఈ పథకం కింద వైద్యం అందుతుంది. ప్రస్తుతం జిల్లా ఆస్పత్రితో పాటు ఏరియా ఆస్పత్రులతో కలిపి 18 ఆసుపత్రుల్లో వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ అమలు అవుతుందని, మరో 33 ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో కూడా అందుబాటులో ఉంటుందని అధికారులు తెలిపారు.    
  
నాడు వైఎస్‌ కూడా ఇక్కడి నుంచే..
సాక్షి ప్రతినిధి, ఏలూరు
దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఆరోగ్యశ్రీ పథకాన్ని 2007 ఏప్రిల్‌ 1న ఏలూరు వేదికగా  ప్రారంభించారు. పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు ఇప్పుడు ఆయన కుమారుడు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇదే ఏలూరు వేదికపై నుంచి ఈ పథకంలో విప్లవాత్మక మార్పులు చేసి నేడు ప్రారంభించనున్నారు. ఉదయం 11 గంటలకు ఏలూరు మండలం వంగాయగూడెంలో డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం.. 11.25 గంటలకు ఏలూరు ఇండోర్‌ స్టేడియంలో వైఎస్సార్‌ ఆరోగ్య శ్రీ పైలట్‌ ప్రాజెక్టును ప్రారంభిస్తారు.

ఈ పథకం కింద 2,059 వ్యాధులకు చికిత్స అందించడమే కాకుండా దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడుతున్న వారికి పింఛన్లకు శ్రీకారం చుట్టనున్నారు. డయాలసిస్‌ పేషంట్లకు ఇస్తున్న విధంగానే తలసేమియా, సికిల్‌సెల్‌ ఎనీమియా, హిమోఫిలియా రోగులకు రూ.10 వేల చొప్పున పెన్షన్‌ ఇవ్వనున్నారు. ప్రమాదాల కారణంగా లేదా పక్షవాతం, తీవ్రమైన కండరాల క్షీణత వల్ల మంచానికే పరిమితమైన వారికి, బోదకాలు, దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధిగ్రస్తులకు (స్టేజ్‌ 3,4,5) నెలకు రూ.5 వేల పెన్షన్, కుష్టువ్యాధితో బాధపడుతున్నవారికి రూ.3 వేల పెన్షన్‌ ఇవ్వనున్నారు.

రెండు నెలలు పైలట్‌ ప్రాజెక్టుగా అమలు
వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకాన్ని పశ్చిమ గోదావరి జిల్లాలో రెండు నెలల పాటు పైలట్‌ ప్రాజెక్టుగా అమలు చేసి, అందులో ఉన్న లోటుపాట్లను గుర్తించి సరిచేశాక ఏప్రిల్‌ నుంచి ప్రతి నెలా ఒక్కో జిల్లా చొప్పున విస్తరిస్తూ వెళతారు. ఈ పథకాన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో సమర్థవంతంగా అమలు చేసేందుకు పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాల కల్పన దిశగా ‘నాడు–నేడు’ కింద అడుగులు వేస్తున్నారు. నిబంధనలకు అనుగుణంగా అన్ని సదుపాయాలున్న రాష్ట్రంలోని, హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలలోని కార్పొరేట్, ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో ఈ పథకం కింద వైద్యం అందుతుంది. ప్రస్తుతం జిల్లా ఆస్పత్రితో పాటు ఏరియా ఆస్పత్రులతో కలిపి 18 ఆసుపత్రుల్లో వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ అమలు అవుతుందని, మరో 33 ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో కూడా అందుబాటులో ఉంటుందని అధికారులు తెలిపారు. 

మరిన్ని వార్తలు