పోలవరం పనులపై సీఎం సమీక్ష

29 Apr, 2020 19:17 IST|Sakshi

సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు పనులపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్, స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ ఆదిత్యనాథ్‌ దాస్, పలువురు అధికారులు పాల్గొన్నారు. వీరితో పాటు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌ మురళి, పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్‌ ముత్యాల రాజు కూడా వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా ఈ సమీక్షలో పాల్గొన్నారు. కోవిడ్‌–19 నేపథ్యంలో సిమెంటు, స్టీల్‌ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడిందని అధికారులు సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. కరోనా కారణంగా నెలరోజులకుపైగా అత్యంత విలువైన సమయం వృధా అయ్యిందని అధికారులు జగన్‌కు తెలిపారు. ఏప్రిల్‌ 20 నుంచి కాస్త పరిస్థితులు మెరుగుపడ్డాయన్న అధికారులు, ఇప్పుడిప్పుడే సిమెంటు, స్టీల్‌ సరఫరా మొదలవుతోందన్నారు. వీటన్నింటి వివరాలు అడిగి తెలుసుకున్న సీఎం జగన్‌ సిమెంటు, స్టీల్‌ సరఫరాకు ఇబ్బందులు రాకుండా చూడాలని ఆదేశారు. స్పిల్‌వే జూన్‌ నెలాఖరు నాటికి పూర్తిచేయడానికి అన్ని ప్రయత్నాలు చేయాలన్నారు. 

ప్రాజెక్టు పనులకు సంబంధించి సూక్ష్మస్థాయిలో కార్యాచరణ ప్రణాళిక తయారు చేసుకోవాలని సీఎం జగన్‌ సూచించారు. ఆ ప్రణాళిక ప్రకారమే ముందుకు వెళ్లాలన్నారు. గత సంవత్సరం గోదావరి వరదల్లో ముంపునకు గురైన ప్రతి కుటుంబాన్ని శరవేగంతో తరలించాలని అధికారులను ఆదేశించారు. వారికి  పునరావాస కార్యక్రమాలు వేగంగా చేపట్టాలన్నారు. పోలవరంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతగా తీసుకున్న అవుకు టన్నెల్ 2, వలిగొండ, నెల్లూరు బ్యారేజీ, సంగం బ్యారేజీ, వంశధార–నాగావళి లింకు పనులపైనా కూడా సీఎం సమీక్ష నిర్వహించారు. నిర్దేశించుకున్న సమయంలోగా పనులు పూర్తికావాలన్నారు. 2020లోనే ఈ 6 ప్రాజెక్టులు తప్పనిసరిగా ప్రారంభం అవుతాయని అధికారులు సీఎం జగన్‌మోహన్‌ రెడ్డికి హామీ ఇచ్చారు. 

మరిన్ని వార్తలు