అక్రమాలు జరగకుండా చూడండి

6 Feb, 2020 05:57 IST|Sakshi

మనం తీసుకొచ్చిన ఇసుక విధానం దేశంలోనే రోల్‌మోడల్‌గా నిలిచింది

ఈ విషయంలో ఒక్క చిన్న తప్పు కూడా జరగడానికి వీల్లేదు

కలెక్టర్లకు సీఎం జగన్‌ ఆదేశాలు

సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన ఇసుక విధానంలో ఎలాంటి అక్రమాలు జరగకుండా చూడాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. నూతన ఇసుక పాలసీ దేశంలోనే రోల్‌మోడల్‌గా నిలిచిందన్నారు. ఇసుక పాలసీ అమలుపై ఆయన బుధవారం జిల్లాల కలెక్టర్లకు తన కార్యదర్శి ద్వారా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

ఒకవైపు పర్యావరణాన్ని పరిరక్షించే చర్యలు తీసుకుంటూనే.. అవినీతికి తావులేని, అక్రమ తవ్వకాలకు ఆస్కారం లేని పారదర్శక ఇసుక విధానాన్ని అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. అయినప్పటికీ  ‘ఎ డర్టీ ఫిష్‌ స్పాయిల్‌ ద హోల్‌ పాండ్‌’ అనే రీతిలో ఇసుక అక్రమాలకు సంబంధించి ఒక్క కేసు నమోదైనా అది ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తుందన్నారు. అలా జరగకుండా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలన్నారు.

అవినీతి రహిత, పారదర్శక ఇసుక పాలసీని అమలుచేయాలని, ఎక్కడా అక్రమాలు జరగకుండా పటిష్ట వ్యవస్థ ఉండాలన్నారు. ఈ విషయంలో అలసత్వం వహిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఇందుకోసం కలెక్టర్లందరూ అన్ని వైపుల నుంచి సమగ్ర సమాచారం తెప్పించుకొని, అక్రమాలకు తావులేకుండా చూడాలన్నారు. రానున్న స్పందన సమావేశం నాటికి దీనిపై పక్కా సమాచారంతో సన్నద్ధంగా ఉండాలని ఆదేశించారు. 
 

మరిన్ని వార్తలు