ఎనిమిది నెలల చిన్నారి వైద్యానికి సీఎం రిలీఫ్‌ ఫండ్‌

19 Jul, 2019 13:06 IST|Sakshi
పేగు సమస్యతో బాధ పడుతున్న చిన్నారి

విశాఖపట్నం, గాజువాక :   పేగు సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఎనిమిదేళ్ల చిన్నారి వైద్య ఖర్చులకు సహాయ నిధిని సీఎం విడుదల చేశారు. చిన్నారి వైద్యానికయ్యే ఖర్చు మొత్తం రాష్ట్ర ప్రభుత్వం భరించే విధంగా ఉత్తర్వులను జారీ చేశారని వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నాయకుడు తిప్పల దేవన్‌రెడ్డి తెలిపారు. గాజువాకకు చెందిన డి.రవిచంద్ర ప్రశాంత్‌కు పర్ణిక అనే ఎనిమిది నెలల పాప ఉంది. పుట్టుకతోనే ఆమెకు పురీషం, పేగు సమస్య ఉత్పన్నమైంది. వైద్యులు ఇప్పటికే ఒకసారి శస్త్ర చికిత్స చేసినప్పటికీ నయం కాలేదు. దీంతో రెండో ఆపరేషన్‌ చేయాలని నిర్ణయించారు. దీనికి రూ.3 లక్షల వరకు ఖర్చవుతుందని వైద్యులు తెలిపారు. పేద కుటుంబానికి చెందిన రవిచంద్ర అంత మొత్తాన్ని భరించలేని పరిస్థితుల్లో గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డిని కలిసి తన సమస్యను చెప్పుకున్నాడు. ఇప్పటికే పాప వైద్యం కోసం అప్పులు చేసినట్టు వివరించాడు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే విషయాన్ని ముఖ్య మంత్రి జగన్‌మోహన్‌రెడ్డి దృషికి తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి పాప వైద్యానికయ్యే ఖర్చులను ప్రభుత్వం భరించే విధంగా ఉత్తర్వులను జారీ చేసినట్టు దేవన్‌రెడ్డి తెలిపారు.

మరిన్ని వార్తలు