ప్రజల ముంగిటకు సంక్షేమ ఫలాలు

28 Aug, 2019 03:44 IST|Sakshi

పథకాల అమలు ప్రణాళికను ప్రకటించిన సీఎం వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: ఐదేళ్ల వరకు ప్రజలు అధికారం ఇచ్చారు కదా.. ఇప్పటి నుంచే ఎన్నికల హామీలు ఎందుకు అమలు చేయాలని కాకుండా తొలి నెలలోనే 80 శాతం హామీల అమలుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయాలు తీసుకుని చరిత్ర సృష్టించారు. అంతటితో ఆగకుండా ఇప్పుడు ఆ హామీల ఫలాలను లబ్ధిదారులకు చేర వేయడానికి షెడ్యూల్‌ను ప్రకటించారు. వైఎస్‌ జగన్‌ మంగళవారం స్పందన కార్యక్రమంపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో రైతులు, మత్స్యకారులు, రజకులు, నాయీ బ్రాహ్మణులు, టైలర్లు, చేనేత కార్మికులు, అగ్రిగోల్డు బాధితులు, ఆటో, ట్యాక్సీవాలాలకు ఎన్నికల హామీల ఫలాలను చేరవేసేందుకు స్పష్టమైన ప్రణాళికను ప్రకటించారు. ఈ ఫలాలన్నీ నేరుగా లబ్ధిదారులకే చేరేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. 

ఆటో, ట్యాక్సీ వాలాలకు రూ.10 వేలు నేరుగా అందాలి
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సెప్టెంబర్‌ చివరి వారంలో సొంత ఆటో, సొంత ట్యాక్సీ నడుపుకుంటున్న వారికి రూ.10 వేల  చొప్పున ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. ఇందుకు సంబంధించిన లబ్ధిదారుల ఎంపికను చేపట్టాలని ఆదేశించారు. ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధిదారులకు ఇచ్చే ఏ డబ్బు అయినా పాత అప్పులకు జమ కాకుండా అన్‌ ఇన్‌కంబర్డ్‌ బ్యాంకు ఖాతాలు ప్రారంభించాలని, బ్యాంకర్లతో ఉన్నత స్థాయిలో మాట్లాడాలని అధికారులకు సూచించారు. వలంటీర్లు లబ్ధిదారులను ఎంపిక చేయడమే కాకుండా ఈ తరహా బ్యాంకు ఖాతాలను తెరవడంపైన కూడా దృష్టి పెట్టాలన్నారు. డబ్బు జమ కాగానే ఈ మేరకు వలంటీర్లు లబ్ధిదారులకు రశీదులను అందిస్తారని చెప్పారు. బ్యాంకు ఖాతాలను తెరవడానికి కలెక్టర్లు కూడా బ్యాంకర్లతో సమావేశం కావాలని, ఎలాంటి సమస్య ఉన్నా వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలన్నారు. ప్రభుత్వ పథకం ద్వారా అందే ఏ డబ్బు అయినా లబ్ధిదారులకే నేరుగా చేరాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ కూడా స్పష్టం చేశారని, నిన్న (సోమవారం) ఢిల్లీలో సమావేశం సందర్భంగా ఈ అంశాన్ని తాను లేవనెత్తినప్పుడు ఆమె స్పష్టత ఇచ్చారని ముఖ్యమంత్రి వివరించారు. 
కౌలు రైతులకు కూడా వైఎస్సార్‌ భరోసా
నవరత్నాల్లో భాగంగా రైతు భరోసా పథకాన్ని వచ్చే ఖరీఫ్‌ నుంచి అమలు చేస్తామని ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్నప్పటికీ దానికన్నా ముందే ఈ ఏడాది అక్టోబర్‌ 15వ తేదీ నుంచే అమలు చేస్తామని వైఎస్‌ జగన్‌ తెలిపారు. ఒక్కో రైతు కుటుంబానికి ఈ పథకం కింద రూ.12,500 పెట్టుబడి సాయం అందిస్తామన్నారు. ఈ ఏడాదికి మాత్రమే అక్టోబర్‌లో ఇస్తున్నామని, వచ్చేసారి నుంచి ఖరీఫ్‌లో మాత్రమే పెట్టుబడి సాయం ఇస్తామని స్పష్టం చేశారు. వైఎస్సార్‌ రైతు భరోసాను కౌలు రైతులకూ ఇస్తామని చెప్పామని, దీనిపై భూ యజమానులు, కౌలు రైతులకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత గ్రామ వలంటీర్లపైన ఉందన్నారు. కౌలు పత్రం, కార్డు అన్నీ కూడా సచివాలయంలో అందుబాటులో ఉంటాయని, రైతులకు నష్టం లేకుండా ఎలాంటి మేలు జరుగుతుందన్న విషయంపై కూడా అవగాహన కల్పించాలని సీఎం సూచించారు. 

సంతృప్తికర స్థాయిలో మత్స్యకారులకు రూ.10 వేలు
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మత్య్సకారులకు ఆర్థిక ప్రయోజనం కింద నవంబర్‌ 21వ తేదీన ప్రపంచ మత్య్స దినోత్సవం సందర్భంగా రూ.10 వేల చొప్పున ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి జగన్‌ ప్రకటించారు. పడవలు, బోట్లు ఉండి.. సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారులకు సంతృప్తికర స్థాయిలో రూ.10 వేలు ఇస్తామని చెప్పారు. ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ఈ పథకాన్ని తీసుకు వచ్చామని, వేట నిషేధ సమయం జూన్‌లో ముగిసినా, ప్రపంచ మత్స్యదినోత్సవం సందర్భంగా నవంబర్‌ 21న ఈ మొత్తం ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. డీజిల్‌ పట్టించేటప్పుడే మత్య్సకారులకు సబ్సిడీ అందేలా చర్యలు తీసుకుంటున్నామని, దీనికోసం కొన్ని బంకులను ఎంపిక చేయబోతున్నామని తెలిపారు. ఈ బంకుల జాబితాను మత్స్యకారులకు ఇస్తామని, ప్రస్తుతం లీటర్‌పై రూ.6 ఇస్తున్న సబ్సిడీని, మన ప్రభుత్వం రూ.9కి పెంచుతోందన్నారు. దీన్ని కూడా నవంబర్‌ 21 నుంచి అమల్లోకి తెస్తున్నామని చెప్పారు. 

చేనేత కుటుంబాలకు చేయూత
నవరత్నాల్లో భాగంగా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలోని చేనేత కార్మికుల కుటుంబాలకు డిసెంబర్‌ 21వ తేదీన ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి పేర్కొన్నారు. మగ్గం ఉన్న ప్రతి చేనేత కుటుంబానికి ఏడాదికి రూ.24 వేలు ఇస్తామని ఎన్నికల ప్రణాళికలో చెప్పామని, ఆ మాట నెరవేర్చడంలో భాగంగా మగ్గమున్న  ప్రతి చేనేత కుటుంబానికి డిసెంబర్‌ 21న రూ.24 వేలు చేతిలో పెడతామమని చెప్పారు. సంపూర్ణ అక్షరాస్యత సాధించడంతో పాటు పేదరికంతో ఏ పిల్లాడు బడికి వెళ్లకుండా ఉండకూడదని అమ్మఒడి కార్యక్రమాన్ని జనవరి 26న అమల్లోకి తీసుకు వస్తున్నామన్నారు. పిల్లలను బడికి పంపే తల్లులకు ఈ పథకం కింద ఏడాదికి రూ.15 వేల చొప్పున ఆర్థిక సాయం అందించేందుకు విధివిధానాలను రూపొందించాల్సిందిగా ముఖ్యమంత్రి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇచ్చిన హామీ మేరకు ఫిబ్రవరి చివరి వారంలో నాయీ బ్రాహ్మణులు, టైలర్లు, రజకులకు రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని సీఎం వెల్లడించారు. 

‘స్పందన’పై వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 

వైఎస్సార్‌ పెళ్లి కానుక పేదలకు వరం
ఫిబ్రవరి చివరి వారంలోనే వైఎస్సార్‌ పెళ్లి కానుకనూ అమల్లోకి తీసుకువస్తామని ముఖ్యమంత్రి జగన్‌ ప్రకటించారు. ఈ పథకం కింద మైనార్టీలు, ఎస్సీ, ఎస్టీల్లోని యువతుల వివాహాలకు రూ.లక్ష చొప్పున, బీసీ యువతుల వివాహాలకు రూ.50 వేల చొప్పున అందజేస్తామని చెప్పారు. ధూప, దీప నైవేద్యాలకు సంబంధించి, మసీదులకు సంబంధించి ఇమాం, మౌజంలకు, చర్చిలకు సంబంధించి పాస్టర్లకు కొన్ని హామీలు ఇచ్చామని, వీటన్నింటినీ మార్చి చివరి వారంలో అమలు చేస్తామన్నారు. మార్చి చివరి వారంలోనే ఉగాది వస్తుందని, ఆ రోజు రాష్ట్రంలోని అర్హులైన పేదలందరికీ 25 లక్షల ఇళ్ల స్థలాల పట్టాలు ఇవ్వబోతున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. ఇంత పెద్దఎత్తున ఇళ్ల స్థలాల పట్టాలు ఇవ్వడం ఇదే తొలిసారవుతుందని సీఎం వ్యాఖ్యానించారు.

అగ్రిగోల్డ్‌ బాధితులకు బాసట
అగ్రిగోల్డ్‌ బాధితులకు సంబంధించి ఇవాళే (మంగళవారం) సమీక్ష చేశానని ముఖ్యమంత్రి తెలిపారు. సెప్టెంబర్‌ నుంచి వారికి డబ్బులు ఇవ్వడం మొదలు పెట్టాల్సిందిగా ఆదేశించామని తెలిపారు. అగ్రిగోల్డ్‌ బాధితులకు రూ.1,150 కోట్లు ఇస్తామని చెప్పామని, ఆ సంస్థ ఆస్తులను ప్రభుత్వం తీసుకొని, తర్వాత వేలం ద్వారా రికవరీ చేస్తామని చెప్పారు. మిగిలిన డబ్బులన్నింటినీ ఎలాంటి ఆలస్యం లేకుండా ప్రతి నెలా చెల్లించేలా ఆర్థిక శాఖ కార్యదర్శికి ఆదేశాలు ఇచ్చామన్నారు. సీఐడీ నుంచి అగ్రిగోల్డ్‌ బాధితుల జాబితా తీసుకుని, గ్రామ వలంటీర్ల ద్వారా రశీదులు ఇవ్వాలని సీఎం సూచించారు.  

మరిన్ని వార్తలు