ఢిల్లీలోని తెలుగు జర్నలిస్ట్‌లకు అండగా సీఎం జగన్‌

5 May, 2020 18:27 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కరోనా క్లిష్ట సమయంలోనూ దేశ రాజధాని ఢిల్లీలో విధులు నిర్వర్తిస్తున్న తెలుగు జర్నలిస్ట్‌లకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అండగా నిలిచారు. తెలుగు జర్నలిస్టులకు కరోనా పాజిటివ్ రావడంపై సీఎం స్పందించారు. వైరస్‌ బారిన పడిన వారికి పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ఢిల్లీలోని ఏపీ భవన్‌ అధికారులను ఆదేశించారు. కరోనా పాజిటివ్‌గా తేలినవారికి అవసరమైన సాయం అందించాలని అక్కడి అధికారులను కోరారు. సీఎం ఆదేశాలపై స్పందించిన ఏపీ భవన్‌ అధికారులు వెంటనే రంగంలోకి దిగారు. (తెలుగు జర్నలిస్టులకు తెలంగాణ ప్రభుత్వం సాయం)

అపోలో ఆస్పత్రి వైద్యులతో మాట్లాడి.. కరోనా బారినపడిన తెలుగు జర్నలిస్ట్‌లకు వైద్య చికిత్సకు ఏర్పాట్లు చేస్తున్నారు. అధికారుల విజ్ఞప్తి మేరకు కరోనా పరీక్షల దృష్ట్యా ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేస్తామని అపోలో వైద్య బృందం తెలిపింది. ఈ క్రమంలోనే ఢిల్లీలో పరిస్థితిని ఏపీభవన్‌ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. కాగా ఢిల్లీలో ఉన్న తెలుగు జర్నలిస్టులకు తెలంగాణ ప్రభుత్వం కూడా సాయం అందించిన విషయం తెలిసిందే. తెలుగు జర్నలిస్టులకు కరోనా వైరస్‌ టెస్టులు, చికిత్స కోసం మంగళవారం రూ.12 లక్షలను విడుదల చేసింది. తక్షణ సాయం కింద కరోనా పాజిటివ్‌ వచ్చిన ముగ్గురు జర్నలిస్టులకు రూ.75 వేల నగదును విడుదల చేసింది. (సదుపాయాలపై కలెక్టర్లదే బాధ్యత: సీఎం జగన్‌)
 

మరిన్ని వార్తలు