నిబద్ధతతో సేవలందించండి

24 May, 2020 03:23 IST|Sakshi
శనివారం ముఖ్యమంత్రి క్యాంప్‌ కార్యాలయంలో ఏపీ కేడర్‌కు చెందిన 2019 బ్యాచ్‌ ఐఏఎస్‌లతో సీఎం వైఎస్‌ జగన్‌. చిత్రంలో సీఎస్‌ నీలం సాహ్ని

రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురండి 

పథకాల అమలు, ప్రజా సమస్యల పరిష్కారంలో ఐఏఎస్‌లదే కీలకపాత్ర: యువ ఐఏఎస్‌లతో సీఎం వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి : నిబద్ధతగల అధికారులుగా ప్రజలకు మంచి సేవలందించి రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ 2019 ఏపీ కేడర్‌కు చెందిన ప్రొబేషనరీ ఐఏఎస్‌లకు సూచించారు. ప్రభుత్వ పథకాల అమలులోనూ, ప్రజా సమస్యల పరిష్కారంలో ఐఏఎస్‌లదే కీలకపాత్ర అయినందున చిత్తశుద్ధితో పనిచేయాలని ఆయన వారిని కోరారు. మహిళా సాధికారతకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూడా ఓ మహిళేనని, మహిళల రక్షణ కోసం దేశంలో మరెక్కడా లేని విధంగా దిశా చట్టాన్ని చేయడంతో పాటు ప్రత్యేక పోలీసు స్టేషన్లు ఏర్పాటుచేశామని యువ ఐఏఎస్‌ అధికారులకు ఆయన వివరించారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌ను శనివారం ఈ ప్రొబేషనరీ ఐఏఎస్‌లు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వీరిని ముఖ్యమంత్రి అభినందించారు. అనంతరం యువ ఐఏఎస్‌లు మాట్లాడారు. వారేమన్నారంటే..

► వలంటీర్ల వ్యవస్థ, మహిళా సాధికారత కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలపై ముఖ్యమంత్రితో చర్చించాం.
► గ్రామ వలంటీర్లు, అధికార వికేంద్రీకరణ వంటి కొత్త వ్యవస్థలో పనిచేయడం ఆనందంగా ఉంది.
► ముస్సోరిలో తమకిచ్చిన శిక్షణలో గ్రామ సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థతో పాటు అధికార వికేంద్రీకరణపై పలుమార్లు చర్చ జరిగింది. గాంధీ చెప్పిన గ్రామ స్వరాజ్యం గ్రామ సచివాలయాల ద్వారా సాధ్యమవుతుంది. మహిళాభివృద్ధి మీద ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. 
► నిన్నటివరకు పరిపాలనకు సంబంధించి అనేక అంశాలు నేర్చుకున్నాం. ఇప్పుడు ప్రాక్టికల్‌గా తెలుసుకోబోతున్నాం. 
కాగా, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను కలిసిన యువ ఐఏఎస్‌లలో ఎం. నవీన్, నిధి మీనా, చహత్‌ బాజ్‌పాయ్, వికాస్‌ మర్మత్, వి.అభిషేక్, జి. సూర్యసాయి ప్రవీణ్‌చంద్, సి. విష్ణుచరణ్, కట్టా సింహాచలం, అపరాజిత సింగ్‌ సిన్సివర్, భావన వశిష్ట్‌ ఉన్నారు. 

మరిన్ని వార్తలు