ఇది రైతు రాజ్యం

27 May, 2020 03:15 IST|Sakshi
ఈ ఏటి ఫలితం : చిత్తూరు జిల్లా ఏర్పేడులో కోతకు సిద్ధంగా ఉన్న వరి పంట (మంగళవారం నాటి దృశ్యం)

వ్యవసాయం, అనుబంధ రంగాలపై మేధోమథన సదస్సులో సీఎం వైఎస్‌ జగన్‌

ఏడాదిలోనే ‘వైఎస్‌ఆర్‌ రైతు భరోసా’తో లబ్ధిపొందిన రైతు కుటుంబాలు 49.43 లక్షలు

ప్రభుత్వ సాయం 10,209 కోట్ల రూపాయలు

అన్నదాతల కళ్లల్లో ఆనందమే ఈ ప్రభుత్వ లక్ష్యం

వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ఎందాకైనా వెళ్తాం

అందులో భాగమే రైతు భరోసా కేంద్రాలు, జనతా బజార్లు

విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు గ్రామాల్లోనే పంపిణీ

జనతా బజార్ల ద్వారా గ్రామాల్లోనే 30% పంటలు సర్కారే కొంటుంది

ధర విషయంలో మార్కెట్‌లో పోటీ పెంచి రైతులకు మేలు చేస్తాం

ఖరీఫ్‌లో పగటిపూటే 82 శాతం ఫీడర్లలో సాగుకు ఉచిత విద్యుత్‌ 

జూలైలో వైఎస్సార్‌ సున్నా వడ్డీ కింద రైతులకు రూ.2,000 కోట్లు

ఖరీఫ్‌ నుంచి రైతులకు ఉచితంగా బోర్లు తవ్వించే కార్యక్రమం

‘మన పాలన– మీ సూచన’లో రైతులు, లబ్ధిదారులు, వ్యవసాయ

శాస్త్రవేత్తల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించిన సీఎం జగన్‌

రైతుల కష్టాలను నా పాదయాత్రలో స్వయంగా చూసి మేనిఫెస్టోను రూపొందించాం. ప్రకృతి వైపరీత్యాల సమయంలో అన్నదాతలను ఎలా ఆదుకోవాలో ఆలోచించాం. పంటల సాగు వ్యయాన్ని తగ్గించగలిగితే రైతులు లాభపడతారు. గిట్టుబాటు ధర లభించినప్పుడే సాగు లాభసాటిగా ఉంటుంది. ప్రధానంగా ఈ మూడు అంశాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. వ్యవసాయాన్ని లాభసాటిగా చేసేందుకు ప్రభుత్వం ఎందాకైనా వెళ్తుంది. ఇందులో భాగంగా రైతుల కోసం విప్లవాత్మక కార్యక్రమాలను చేపట్టాం.

అన్నదాతలపై పెట్టుబడి భారాన్ని తగ్గించడానికే వైఎస్సార్‌ రైతు భరోసా కార్యక్రమాన్ని చేపట్టాం. ఏడాదిలోనే 49.43 లక్షల మంది రైతులకు రూ.10,209.32 కోట్లను వారి బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేశాం. జూలైలో రైతులకు వైఎస్సార్‌ సున్నా వడ్డీ కింద రూ.2,000 కోట్లు ఇస్తాం. గత ఏడాది కన్నా మిన్నగా ఈ సంవత్సరం రైతులకు మంచి జరిగేలా ముందుకు వెళ్తాం

శీతల గిడ్డంగులు, గోదాములు, ప్యాకింగ్‌ యూనిట్లు గ్రామాల్లోకి రాబోతున్నాయి. ఏడాది కాలంలో ఈ పనులు చేయబోతున్నాం. వచ్చే సంవత్సరం చివరికల్లా ప్రతి గ్రామంలో జనతా బజార్‌ ఏర్పాటు చేస్తున్నాం. రైతులు  పంటలతోపాటు ఆక్వా ఉత్పత్తులు కూడా ఇందులో అమ్ముతారు. గుడ్లు, చేపల నుంచి అన్నీ అమ్ముతారు. వీటి ద్వారా ప్రభుత్వమే 30 శాతం ఉత్పత్తులను కొనుగోలు చేయడం వల్ల మార్కెట్లో పోటీ పెరుగుతుంది. రైతులకు మంచి ధర లభిస్తుంది.

పంట నష్టపోతే రైతులకు వెంటనే ఇన్‌పుట్‌ సబ్సిడీ, ఇన్సూరెన్సు పరిహారాన్ని ఇవ్వాలి. అప్పుడే వాటికి ఒక విలువ ఉంటుంది. అందుకే ప్రభుత్వమే స్వయంగా ఇన్సూరెన్సు ప్రక్రియను నడపాలని నిర్ణయం తీసుకున్నాం

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గత ఏడాది పాలనను గమనిస్తే ఇది రైతు రాజ్యమని ఎవరికైనా అర్ధమవుతుందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. రైతులు, రైతు కూలీల చిరునవ్వే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. రైతులు బాగుంటే రాష్ట్రం బాగుంటుందని తాను గట్టిగా విశ్వసించే వ్యక్తినని సీఎం జగన్‌ పేర్కొన్నారు. ‘మన పాలన– మీ సూచన’ కార్యక్రమంలో భాగంగా మంగళవారం రెండో రోజు వ్యవసాయం, అనుబంధ రంగాలపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి క్యాంపు కార్యాలయంలో జరిగిన మేధోమథన సదస్సులో మాట్లాడారు. రైతులు, రైతు సంఘాల నేతలు, శాస్త్రవేత్తల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించారు. ముఖ్యమంత్రి ప్రసంగం వివరాలు ఆయన మాటల్లోనే...
సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన మంగళవారం జరిగిన ‘మన పాలన– మీ సూచన’ మేధోమథన సదస్సులో మాట్లాడుతున్న ఆచార్య ఎన్జీరంగా వర్సిటీ మాజీ వైస్‌ చాన్స్‌లర్‌ రాఘవరెడ్డి 

చెప్పిన దానికంటే మిన్నగా...
మనం అధికారంలోకి వచ్చే నాటికి ఉన్న పరిస్థితి చూశాక రైతులకు అంతకుముందు చెప్పిన విధంగా ఏటా రూ.12,500 చొప్పున నాలుగేళ్లు కాకుండా ఐదేళ్లు రూ.13,500 చొప్పున రైతు భరోసా ద్వారా ఇవ్వాలని నిర్ణయించాం. ఆ మేరకు అమలు చేశాం. ఈ పథకం ద్వారా రైతులకు మే నెలలో రూ.7,500, అక్టోబర్‌లో రూ.4 వేలు, ఆ తర్వాత పంట చేతికొచ్చే సమయంలో సంక్రాంతి సందర్భంగా మరో రూ.2 వేలు ఇవ్వాలని నిర్ణయించాం. దేవుడి దయతో ఈ కార్యక్రమాన్ని  గొప్పగా అమలు చేశాం. గత ఏడాది జూన్‌లో అధికారం చేపట్టాం కాబట్టి మే నెలలో ఇవ్వలేకపోయామనే ఉద్దేశంతో రబీలో రైతులకు సాయం చేశాం.

రైతు భరోసాతో ఇప్పటివరకు ఎంతిచ్చామంటే..
2019–20లో అంటే గత ఏడాది రైతు భరోసా ద్వారా 46.69 లక్షల మంది రైతు కుటుంబాలకు రూ.6,534 కోట్లు వారి ఖాతాల్లో వేశాం. ఈ ఏడాది మే నెలలో అంటే 2020–21కి సంబంధించి ఇప్పటికే దాదాపు రూ.3,675 కోట్లు  రైతుల ఖాతాల్లోకి రూ.7500 చొప్పున బదిలీ చేశాం. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే రూ.10,209.32 కోట్లు రైతులకు అందచేశాం. అది కూడా పాత అప్పుల కింద బ్యాంకులు జమ చేసుకోకుండా అన్‌ ఇన్‌కంబర్డ్‌ ఖాతాలో వేశాం.

రుణమాఫీ పేరుతో టీడీపీ ఏం చేసింది?
రైతులకు రూ,87,612 కోట్ల మేర రుణమాఫీ చేస్తానన్న గత ప్రభుత్వం ఐదేళ్లలో కనీసం రూ.15 వేల కోట్లు కూడా ఇవ్వలేదు. మా ప్రభుత్వం ఏడాది కూడా పూర్తి కాకముందే దేవుడి దయతో రూ.10,209.32 కోట్లు రైతులకు అందచేసింది.

ఇన్సూరెన్స్‌ బాధ్యత కూడా తీసుకున్నాం 
శనగ రైతులకు 2012–13 సంవత్సరానికి సంబంధించి పంటల బీమా కింద రూ.112 కోట్లు ఇచ్చాం. బీమా కంపెనీలు డబ్బులు తీసుకుంటాయి కానీ పరిహారం సక్రమంగా ఇవ్వవు. అందుకే ప్రభుత్వమే స్వయంగా బీమా నిర్వహిస్తూ రైతుల నుంచి నామమాత్రంగా కేవలం ఒక్క రూపాయి మాత్రమే తీసుకుని, మిగతాది ప్రభుత్వమే చెల్లించి ఇన్సూరెన్స్‌ ప్రక్రియ కూడా నిర్వహించాలని నిర్ణయించింది.

ఖరీఫ్‌లో పగలే 9 గంటల విద్యుత్తు
గత ప్రభుత్వం విద్యుత్‌ సంస్థలకు ‘రూ.8,645 కోట్లు బకాయి పెట్టింది. ఆ మొత్తాన్ని మేం కడుతున్నాం. ఏటా ప్రభుత్వంపై దాదాపు రూ.8,800 కోట్ల భారం పడుతున్నా రైతులకు ఉచిత విద్యుత్‌ ఇస్తున్నాం. ఇక 9 గంటల విద్యుత్‌ పగటి పూటే ఇవ్వాలంటే ఫీడర్లపై రూ.1,700 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంటుందని విద్యుత్‌ శాఖ అధికారులు చెబితే అధికారంలోకి రాగానే ఇచ్చాం. దీంతో దాదాపు 82 శాతం ఫీడర్ల ద్వారా పగలే 9 గంటల విద్యుత్‌ను ఈ ఖరీఫ్‌లో ఇవ్వగలుగుతాం. రబీ నాటికి మిగిలిన 18 శాతం ఫీడర్ల కింద కూడా ఉచిత విద్యుత్‌ సరఫరా చేస్తాం. 

మార్కెట్‌ యార్డుల్లో సామాజిక న్యాయం
రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించేందుకు మార్కెట్‌ యార్డులను 191 నుంచి 216కు పెంచాం. మార్కెట్‌ యార్డుల పదవుల్లో సామాజిక న్యాయం జరిగేలా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 50 శాతం రిజర్వేషన్లు ఇవ్వడంతో పాటు మహిళలకు 50 శాతం కేటాయిస్తూ చట్టం చేశాం.

చనిపోయిన రైతుల కుటుంబాలకు పరిహారం..
ప్రమాదవశాత్తూ ఎవరైనా రైతు చనిపోతే ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు సాయం అందిస్తున్నాం. రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో 417 మంది రైతులు చనిపోతే పట్టించుకోలేదు. ఆ కుటుంబాలకు మేం అధికారంలోకి వచ్చాక రూ.5 లక్షలు చొప్పున ఇచ్చాం. ఈ తర్వాత చనిపోయిన మరో 229 మంది రైతులకు రూ.7 లక్షలు చొప్పున పరిహారం ఇవ్వాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశాం.

పశువులకూ బీమా..
‘బీమాను కేవలం రైతులకు, పంటలకే మాత్రమే కాకుండా ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలకు కూడా వర్తింపచేస్తున్నాం. ఆవులకు రూ.15 వేల నుంచి రూ.30 వేల వరకు, గొర్రెలకు రూ.6 వేల చొప్పున పరిహారం ఇస్తున్నాం. రైతుల పొలాల వద్దే పంటను కొనుగోలు చేస్తూ దళారీల వ్యవస్థను ప్రభుత్వం నియంత్రిస్తోంది.

ఆర్బీకేలో రైతులకు అన్నీ..
► రాష్ట్రంలో ఈనెల 30వతేదీన ప్రారంభమయ్యే 10,641 రైతు భరోసా కేంద్రాలు  గ్రామాల్లో రైతులకు పూర్తి అండగా నిలుస్తాయి. వీటిద్వారా విత్తనాలు, పురుగు మందులు, ఎరువులు నాణ్యమైనవి విక్రయిస్తాం. వీటిని ప్రభుత్వం సర్టిఫై చేస్తుంది. గ్యారంటీ కూడా ఇస్తుంది. రైతులకు విజ్ఞాన, శిక్షణ కేంద్రాలుగా ఆర్బీకేలు పని చేస్తాయి. ఆర్‌బీకేలో వ్యవసాయ సహాయకుడు ప్రతిరోజు పంటలను సమీక్షించి పంపే డేటాను మార్కెటింగ్‌ శాఖ పర్యవేక్షిస్తుంది.
► ఆర్‌బీకేల కోసం జిల్లా స్థాయిలో ప్రత్యేకంగా జేసీని నియమించాం. రైతుకు గిట్టుబాటు ధర రాని పక్షంలో వెంటనే జోక్యం చేసుకుని రూ.3 వేల కోట్ల ధరల స్థిరీకరణ నిధిని సద్వినియోగం చేసుకునే కార్యక్రమం ఆర్బీకే నుంచి ప్రారంభం అవుతుంది.  
వీడియో ప్రదర్శన..
► సదస్సుకు ముందు ప్రజా సంకల్పయాత్ర సందర్భంగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీలతో పాటు వ్యవసాయ రంగం సమస్యలు, పరిష్కారం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలు, కౌలు రైతులకు చేస్తున్న మేలుపై కార్యక్రమంలో వీడియో ప్రదర్శించారు. సదస్సులో మంత్రులు కన్నబాబు, బొత్స, మోపిదేవి, తానేటి వనిత, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నితోపాటు వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు, రైతులు, బ్యాంకు అధికారులు, నిపుణులు పాల్గొన్నారు.

రైతులకు ఇంకా ఇంకా..
ఆక్వా రైతులకు మేలు చేసేందుకు అధికారంలోకి రాగానే యూనిట్‌ విద్యుత్‌ రూ.1.50కే సరఫరా చేశాం. దాదాపు 1.2 లక్షల సర్వీసులకు సరఫరా చేస్తూ రూ.700 కోట్ల సబ్సిడీ భారాన్ని భరిస్తున్నాం.
► పెట్టుబడి ఖర్చు తగ్గించడంతో పాటు రైతులకు పంటల బీమా, ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇస్తున్నాం. రూ.2 వేల కోట్లతో ప్రకృతి వైపరీత్యాల నిధి ఏర్పాటు చేశాం. కేంద్రం మరో రూ.2 వేల కోట్లు ఇస్తుంది. గత ఏడాది సెప్టెంబర్‌ నుంచి జనవరి వరకు నాలుగు నెలల్లోనే 67,874 మంది రైతులకు పంట నçష్టం కింద వెంటనే రూ.55 కోట్లు ఇచ్చేశాం.
► కడపలో శనగ రైతులు ఇబ్బంది పడుతుంటే క్వింటాలు రూ.1,500 చొప్పున 30 క్వింటాళ్లు కొనుగోలు చేసి ఒక్కో రైతుకు రూ.45 వేలు అందించాం.
► ఉల్లి ధరలు పెరిగినప్పుడు దాదాపు 80,522 క్వింటాళ్ల ఉల్లిని సేకరించి రైతు బజార్లలో సబ్సిడీ ధరకు విక్రయించాం.
► ఈసారి పంటలు బాగా పండినా కోవిడ్‌ కారణంగా విక్రయించలేని పరిస్థితి. దీంతో రూ.1,100 కోట్లు వెచ్చించి ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతులను ఆదుకుంది.
► వ్యవసాయ ట్రాక్టర్లకు రోడ్డు పన్ను, టోల్‌ రద్దు చేశాం. కరోనా సమయంలో అరటి రైతులను ఆదుకునేందుకు పంట కొనుగోలు చేసి రాష్ట్రమంతా పంపిణీ చేశాం.

ఏది.. ఎంత కొనుగోలు?
దాదాపు 773 మెట్రిక్‌ టన్నుల ఉల్లి, 12 వేల మెట్రిక్‌ టన్నుల అరటి, 1,425 మెట్రిక్‌ టన్నుల టమాటా, దాదాపు 3,600 మెట్రిక్‌ టన్నుల బత్తాయిలు కొనుగోలు చేశాం. ఇలా గతంలో ఏనాడూ జరగలేదు. 2,36,136 టన్నుల మొక్కజొన్న కొనుగోలుకు రూ.416 కోట్లు ఖర్చు చేశాం, ఇంకా కొనుగోలు చేస్తున్నాం. 50,672 మెట్రిక్‌ టన్నుల కందుల కోసం రూ.294 కోట్లు, 1,40,548 మెట్రిక్‌ టన్నుల శనగలకు రూ.685 కోట్లు, 19.94 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలుకు రూ.3,634 కోట్లు రబీలో ఖర్చు చేశాం. వీటన్నిటికీ కేవలం వారం పది రోజుల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేశాం.

► రూ.164 కోట్లతో 64,405 టన్నుల జొన్నలు, 6,706 టన్నుల పసుపు రూ.46 కోట్లతో కొన్నాం. 5.60 లక్షల టన్నుల వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలుకు రైతులకు కనీస గిట్టుబాటు ధరలు కల్పిస్తూ గత 8 నెలల్లో రూ.2,200 కోట్లు మార్కెట్‌ ఇంటర్‌వెన్షన్‌లో పెట్టాం. దాదాపు 70 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలుకు రూ.12,677 కోట్లు ఖర్చు చేశాం’.
► ‘గత ప్రభుత్వం బకాయి పెట్టిన రూ.960 కోట్లు చెల్లించాం. విత్తన బకాయిలు దాదాపు రూ.384 కోట్లు ఇచ్చాం. ఆయిల్‌పామ్‌ రేటు తెలంగాణలో ఎక్కువ ఉంది. కానీ ఏపీలో తక్కువగా ఉండడంతో తొలిసారిగా ఈ రైతులను ఆదుకునేందుకు రూ.80 కోట్లు ఇచ్చాం.
► గత దశాబ్దంలోనే ఎన్నడూ లేని విధంగా ఈసారి ఆహార ధాన్యాల దిగుబడి వచ్చింది. 2018–19లో 150 లక్షల మెట్రిక్‌ టన్నులు దిగుబడి రాగా ఈ ప్రభుత్వం వచ్చాక 172 లక్షల మెట్రిక్‌ టన్నుల ఉత్పత్తి వచ్చింది.

వ్యవసాయం పండగైంది..
గతంలో విత్తనాల సీజన్‌లో తొక్కిసలాటలు జరిగి ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. విత్తనాలను గ్రామ స్ధాయిలోకి తేవడంలో మీరు చేసిన కృషి గొప్పది. ఇందులో గ్రామ సచివాలయాల పాత్ర కీలకం. పగటిపూట తొమ్మిది గంటలు నిరంతరాయంగా విద్యుత్తు ఇస్తుండటంతో పంటను కాపాడుకోగలుగుతున్నాం. కనీస మద్దతు ధర పెంచడంతో రైతులు అదనపు లాభం పొందుతున్నారు. పంటలు విక్రయించిన వారం రోజుల్లోగానే మా అకౌంట్లో డబ్బులు వచ్చాయి. మీరొచ్చాక వ్యవసాయం పండుగలా మారింది.
– మారుతీప్రసాద్, అనంతపురం జిల్లా

మరిన్ని వార్తలు