వారి సంతోషంతో నా బాధ్యత మరింత పెరిగింది: వైఎస్‌ జగన్‌

1 Feb, 2020 19:17 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన 'ఇంటి వద్దకే పెన్షన్‌' కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో శనివారం ఉదయం ఘనంగా ప్రారంభమైంది. బాపూజీ కలలుగన్న గ్రామ స్వరాజ్య స్థాపనే లక్ష్యంగా ప్రారంభించిన గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా.. పెన్షన్లను గడపవద్దకే చేర్చాలన్న సంకల్పాన్ని సాకారం చేసిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అభినందనలు తెలియజేశారు. అవినీతి, వివక్ష లేకుండా 54.6 లక్షల మందికి ఇంటివద్దే పెన్షన్ ఇస్తుంటే వారి కళ్లలో కనిపించిన సంతోషంతో తన బాధ్యత మరింత పెరిగిందన్నారు. దేవుడి దయ, ప్రజల దీవెనతోనే ఇది సాధ్యమైందని సీఎం వైఎస్‌ జగన్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు. (రాష్ట్రవ్యాప్తంగా 'ఇంటి వద్దకే పెన్షన్‌' ప్రారంభం)

‘ఎన్నికలకు ముందు వచ్చే పెన్షన్‌ రూ.1000 కాకుండా ఇప్పుడు 2,250 వచ్చింది. పెన్షన్‌ వయస్సు కూడా 65 సంవత్సరాల నుంచి 60కి తగ్గించాం. కొత్తగా 6.11 లక్షల పెన్షన్లు ఇస్తున్నాం. ఇంకా ఎవరైనా అర్హులు మిగిలిపోతే గ్రామ సచివాలయాల ద్వారా దరఖాస్తు చేసుకుంటే.. వెంటనే వాటిని పరిశీలించి మంజూరుచేస్తార’ని సీఎం వైఎస్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు.

కాగా.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని అమలు చేస్తున్న వైఎస్సార్ పెన్షన్‌ కానుకలో మరో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చింది. వలంటీర్లు స్వయంగా లబ్ధిదారుడు ఇంటికెళ్లి పింఛన్లు పంపిణీ చేసే గొప్ప కార్యక్రమం చేపట్టారు. పింఛన్లు కోసం ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఇబ్బందులు పడుతున్న ఫించన్ దారులకు డోర్ డెలివరీ విధానం ఎంతో ఆనందం కలిగిస్తోంది. తాము ఎప్పుడు ఉంటే అప్పుడే ఇంటికొచ్చి మాకు వలంటీర్లు పింఛన్లు ఇస్తుండడం సంతోషంగా ఉందని, దీని వల్ల తమకు ఎంతో మేలు జరుగుతుందని లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.  (ఏపీ: పింఛన్ల పంపిణీలో ప్రభుత్వం రికార్డు)

మరిన్ని వార్తలు