వైఎస్‌ జగన్‌ పాలన@గ్రామ స్వరాజ్యం

1 Oct, 2019 13:38 IST|Sakshi

గ్రామాలు దేశానికి పట్టుకొమ్మలు. దేశం బాగుండాలంటే పల్లెలు పచ్చగా ఉండాలనేది మన అందరికి తెలుసు. అయితే ఏడు దశాబ్దాలుగా మన పాలకుల్లో కొందరు మాత్రమే ఆ దిశగా అడుగులు వేశారు. వారిలో ముఖ్యమంత్రిగా తొలిసారిగా బాధ్యతలు స్వీకరించిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కీలక ముందడుగు వేశారు. దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తూ ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి.. కీలకమైన ప్రభుత్వ శాఖలందరి ఉద్యోగులతో అనుసంధానం చేస్తూ కొత్త పరిపాలన విధానానికి శ్రీకారం చుట్టారు.  ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయాలు ఓ సువర్ణ అధ్యాయం అని పలువురు ప్రశంసిస్తున్నారు. జాతిపిత మాహాత్మా గాంధీ 150వ జయంతి సందర్భంగా అక్టోబర్ రెండు నుంచి గ్రామాలు, వార్డుల్లో మినీ సెక్రటేరియట్ ఏర్పాటు చేయబోతున్నారు. ఈ కార్యాలయంలో దాదాపు 34 విభాగాలకు సంబంధించిన ప్రభుత్వ కార్యకలాపాలు నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి ఫలాలు కేవలం 72 గంటల్లోనే సామాన్య ప్రజలకు అందడమే లక్ష్యంగా పేదల కన్నీరును తుడిచి ముఖంపై చిరునవ్వులు పూయించడమే పరమావధిగా పని చేసేందుకు ప్రణాళికలు తయారయ్యాయి. దాదాపు 500 సేవలు గ్రామ సచివాలయాల్లో పూర్తిగా అందుబాటులోకి వస్తాయి. అంతేకాకుండా కొత్త సంవత్సరం 2020 జనవరి ఒకటి నుంచి రేషన్ కార్డులు, పెన్షన్లు, ఆరోగ్య శ్రీ వంటి పలు సంక్షేమ పథకాలు గ్రామ సచివాలయం పరిధిలోకి తీసుకు వస్తున్నారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాల లబ్దిదారుల వివరాలను రాజకీయాలు, కులాలు, మతాలు, పార్టీలకు అతీతంగా ఎంపిక చేసి నోటీసు బోర్డులో వివరాలుండేలా జాగ్రత్తలుండబోతున్నాయి.

గిన్నిస్‌ రికార్డు వంటిది
గ్రామస్థాయి సచివాలయం నుంచి రాజధాని సెక్రటేరియట్ వరకు ప్రజలు ఎలాంటి సమస్యపైనైనా సరే ఫిర్యాదులు చేసేందుకు సీఎం పేషీలో 1902 నెంబరుతో ఇప్పటికే కాల్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఇకపై ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు గ్రామ సచివాలయం వాలంటీర్లు, సెక్రటేరియట్ ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వానికి రెండుకళ్లలా పని చేసేందుకు వైఎస్ జగన్‌ సర్కారు ముందుకు సాగుతోంది. ఇక గ్రామ సచివాలయ ఏర్పాటుతో రాష్ట్రంలో కొలువుల జాతర కొనసాగింది. దేశ చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో ఉద్యోగ మేళా నిర్వహించి రాష్ట్ర వ్యాప్తంగా లక్షా 35 వేల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన ఘనత సీఎం వైఎస్ జగన్‌కే దక్కింది. రాష్ట్రంలో మొత్తంగా 20లక్షలకు పైగా అభ్యర్థులకు 8 రోజులు పరీక్షలు నిర్వహించి ఇంత భారీ స్థాయిలో శాశ్వత ఉద్యోగాలు ఇవ్వడం గిన్నిస్ రికార్డులాంటిది. ఇప్పటికే ఈ నియామక ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసి నిరుద్యోగ యువతకు సర్కారు కొలువుల పత్రాలను కూడా అందజేశారు. గాంధీజీ 150వ గాంధీ జయంతి దినోత్సవం నుంచి గ్రామ సచివాలయాల్లో కొత్తగా నియమించబడిన ఉద్యోగులు బాధ్యతలను నిర్వహించనున్నారు. ఇక అదేవిధంగా... దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ తొలిసారిగా ప్రారంభమైంది. ప్రతి యాభై కుటుంబాలకు ఓ గ్రామ వాలంటీర్, మున్సిపాలిటీల్లో ప్రతి వార్డుకో వాలంటీర్ నియమించడంతో ప్రభుత్వ పథకాలను ప్రజలకు సమర్థవంతంగా అమలు పరిచేందుకు గ్రామ సచివాలయాలను సీఎం జగన్‌ సర్వ సన్నద్ధం చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన నవరత్నాలతో పాటు మేనిఫేస్టోలో చెప్పిన అంశాలను పటిష్టంగా ఈ గ్రామ సచివాలయాల ఉద్యోగులు భాద్యతలు నిర్వర్తించడం అలాగే గ్రామ సచివాలయాల పనితీరును రాజధానిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచే పరిశీలించనున్నారు. 

ఓర్వలేక విషం చిమ్ముతూ..
 గ్రామ సచివాలయంలో పదకొండు నుంచి పన్నెండు మంది ఉద్యోగులు పనిచేయబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా లక్షా 35వేల ఉద్యోగులతో ఓ ప్రత్యేక వ్యవస్థను సృష్టించడంతో కొత్తగా 11,158 గ్రామ సచివాలయాలు, 3,786 వార్డు సచివాలయాలు ప్రారంభమవుతున్నాయి. సర్కారు ముందుచూపుతో సొంత గ్రామాల్లోనే ఉద్యోగాలు చేయకుండా ఎలాంటి పక్షపాతానికి తావివ్వకుండా చుట్టు పక్కల గ్రామాల్లో ఉద్యోగులకు పోస్టింగ్‌ ఇవ్వడం జరిగింది. ప్రతి గ్రామంలో ఎలాంటి వర్గ విబేధాలు, వివక్షతకు తావు లేకుండా ప్రతీ ఒక్కరికీ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సర్కారు అందిస్తోన్న సంక్షేమ పథకాలు పొందేలా గ్రామ సచివాలయ సిబ్బంది, గ్రామ వాలంటీర్లు పనులు చేసేందుకు కావాల్సిన మౌలిక వసతులు కల్పించింది. అంతేకాదు నిరుద్యోగులకు బాసటగా నిలిచేందుకు ప్రతి ఏటా ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను జనవరిలో భర్తీ చేయబోతున్నారు. అయితే ప్రతిపక్ష టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మాత్రం సీఎం జగన్‌ ప్రజాసంక్షేమ పాలనను ఓర్వలేక ప్రతీ నిమిషం విషం గక్కుతున్నారు. రాజకీయాల్లో నాకంటే ఎవరూ సీనియర్‌ లేరని చెప్పుకొనే ఆయన.. తన స్థాయిని మరిచి కొన్ని దిగజారుడు వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయనపై ప్రజల్లో మరోసారి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.  ఐదేళ్లు అధికారంలోన్నప్పుడు నిరుద్యోగ భృతి ఇవ్వకుండా, ఉద్యోగ కల్పన చేయకుండా చేతులెత్తేసి.. ఇప్పుడు గ్రామ సచివాలయ ఉద్యోగుల వ్యక్తిత్వాలను, మహిళలను కించపరుస్తూ మాట్లాడటం చంద్రబాబుకే చెల్లిందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘పల్లెటూళ్లు వేస్ట్.. పట్నాలే బెస్ట్.. వ్యవసాయం చేయడమే వృథా... విజన్ 2020లో మనం ప్రపంచంలోనే ‘ది బెస్ట్’ అంటూ ప్రగల్భాలు పలికే పచ్చపార్టీ నేతలు.. గ్రామ సంక్షేమమే పరమావధిగా పనిచేసే గ్రామవాలంటీర్లు, సచివాలయ సిబ్బందిపై ఎన్ని నిందలు వేయడానికైనా వెనుకాడరని స్పష్టమవుతోందని అభిప్రాయపడుతున్నారు. 

మరిన్ని వార్తలు