సాక్షి, అమరావతి : గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులకు ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచంలో అత్యుత్తమ రాజ్యాంగాల్లో భారత రాజ్యాంగం ఒకటని.. రాజ్యాంగ పీఠిక మొదలు, ప్రాథమిక హక్కులు, అధికారాల విభజన, ప్రత్యేక రక్షణలు వంటి పలు అంశాల్లో బాబా సాహెబ్ అంబేద్కర్, బాబూ రాజేంద్ర ప్రసాద్, జవహర్లాల్ నెహ్రూ, మౌలానా ఆజాద్, భోగరాజు పట్టాభిసీతారామయ్య వంటి రాజ్యాంగ నిర్మాతలు ఎంతో దూరదృష్టితో, దార్శనికతతో వ్యవహరించారని సీఎం జగన్ అన్నారు. మన దేశంలో ప్రజాస్వామ్యాన్ని, చట్టబద్ధ పాలనను నిలబెట్టడంలో, పౌర హక్కులను పరిరక్షించటంలో, ఆర్థిక తారతమ్యాలను తగ్గించటంలో, సామాజిక న్యాయాన్ని అందించటంలో 70 ఏళ్ళుగా రాజ్యాంగం మహోన్నత పాత్ర పోషించిందని, పౌరులకు రక్షణ కవచంగా నిలిచిందని ఈ సందర్భంగా సీఎం జగన్ పేర్కొన్నారు.
ప్రపంచంలోనే అత్యుత్తమమైన రాజ్యాంగాల్లో మనరాజ్యాంగం ఒకటి. దేశపౌరుల హక్కులను పరిరక్షించడంలో, అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారత్ ను నిలపడంలో రాజ్యాంగం మహోన్నత పాత్ర పోషించింది. ఇంతటి గొప్ప రాజ్యాంగాన్ని మనకందించిన మహనీయులను స్మరించుకుంటూ దేశపౌరులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.
— YS Jagan Mohan Reddy (@ysjagan) January 26, 2020