సీఎం జగన్‌ మహా శివరాత్రి శుభాకాంక్షలు

20 Feb, 2020 16:13 IST|Sakshi

సాక్షి, అమరావతి : మహా శివరాత్రి సందర్భంగా తెలుగు ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలోని పంచారామాలు, శక్తి పీఠాలు, శివాలయాలు, ఇంటింటా... శివరాత్రి పండుగను భక్తి శ్రద్ధలతో ప్రజలు ఘనంగా జరుపుకోవాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. పవిత్ర పర్వదినం సందర్భంగా ప్రజలందరికీ శుభం జరగాలని దేవుణ్ని ప్రార్థిస్తున్నట్లు సీఎం జగన్‌ తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. కాగా, శుక్రవారం జరుగనున్న మహా శివరాత్రి ఉత్సవాలకు తెలుగు రాష్ట్రాలలోని ప్రధాన ఆలయాలన్నీ ముస్తాబవుతున్నాయి.  ప్రముఖ శైవక్షేత్రాల్లో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.

శివరాత్రిని ఆనందంగా జరుపుకోవాలి : గవర్నర్‌ 
మహా శివరాత్రి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ బిశ్వభూషణ్ హరిచందన్ శుభాకాంక్షలు తెలిపారు. శివభక్తులు అత్యంత పవిత్రమైన దినమైన శివరాత్రిని ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. మహాశివరాత్రి సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. శివభక్తులు అత్యంత పవిత్రమైన పర్వదినంగా మహాశివరాత్రిని జరుపుకుంటారు. మహోన్నతమైన మహాశివరాత్రి రోజు లక్షలాదిమంది శైవభక్తులు భక్తి శ్రద్ధలతో సదాశివుడిని పూజిస్తారు. శివనామస్మరణ ప్రేమ, ఆప్యాయత, అనురాగం, స్నేహం, సోదరభావం లాంటి ఆలోచనలను ప్రేరేపిస్తుంది. పరమేశ్వరుడికి అత్యంతప్రీతిపాత్రమైన శివరాత్రిని ఆనందంగా జరుపుకోవాలి’ అని గవర్నర్‌ బిశ్వభూషన్‌ హరిచందన్‌ ఆకాంక్షించారు. 

మరిన్ని వార్తలు