సాక్షి, తాడేపల్లి : కరోనా వైరస్పై ప్రజల్లో ధైర్యాన్ని కలిగించేలా వాలంటీర్ల ద్వారా విస్తృత ప్రచారం చేయించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. కరోనాపై ప్రజలకు అవగాహనతో పాటు భరోసా కలిగించేలా ప్రచారం ఉండాలని సూచించారు. కరోనా నివారణ చర్యలపై సీఎం జగన్ సోమవారం ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం ఆళ్లనాని, సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులకు సీఎం జగన్ పలు సూచనలు చేశారు. వచ్చే 2, 3 వారాలు కరోనాపై మరింత ముమ్మరంగా ప్రచారం చేయాలని అధికారులకు సూచించారు. కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షల్లో పాజిటివ్ వస్తే తీసుకోవాల్సిన వైద్యం, జాగ్రత్తలపై ప్రతీ ఒక్కరికీ అవగాహన కల్పించాలన్నారు.
(చదవండి : రేపు సీఎం జగన్తో సినీ ప్రముఖుల భేటీ)
కోవిడ్ క్టస్టర్ల వివరాలు, ఏరియా సైజ్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. క్లస్టర్ల క్లాసిఫికేషన్ను మరోసారి పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కరోనాపై పోరులో ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు సహకారంతో ముందుకెళ్లాలని చెప్పారు. వైద్యారోగ్య శాఖలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వాలని సీఎం జగన్ ఆదేశించారు. ఇంటర్ స్టేట్ బార్డర్స్ ద్వారా రాకపోకల వివరాలను అధికారులను అడిగి తెలుసుకన్నారు. 6 రాష్ట్రాల నుంచి వస్తున్న వారిపై ప్రత్యేక దృష్టిపెడుతున్నామని ఈ సందర్భంగా అధికారులు సీఎం జగన్కు వివరించారు. అలాగే జిల్లాల వారిగా 71 సెంటర్లలో 15,614 బెడ్లు సిద్ధంగా ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. మోర్టాలిటీ రేట్, వార్డ్, విలేజ్ క్లీనిక్స్ ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. (చదవండి : సమగ్ర భూ సర్వేలో ఆలస్యం వద్దు: సీఎం జగన్)