అంబేడ్కర్‌ విగ్రహ నిర్మాణానికి నేడు సీఎం శంకుస్థాపన

8 Jul, 2020 04:06 IST|Sakshi
ఏర్పాట్లపై కలెక్టర్‌తో చర్చిస్తున్న మంత్రులు పెద్దిరెడ్డి, విశ్వరూప్, వెలంపల్లి, ఎమ్మెల్యే మేరుగ

20 ఎకరాల్లో మెమోరియల్‌ పార్కు అభివృద్ధి.. ఏడాదిలోనే నిర్మాణం పూర్తి

చంద్రబాబు చెప్పి ఎలా మోసం చేశారో చూశాం... జగన్‌ చిత్తశుద్ధి ఇది

మంత్రులు విశ్వరూప్, వెలంపల్లి, పెద్దిరెడ్డి, ఎమ్మెల్యేలు మేరుగ, కైలే 

సాక్షి, అమరావతి/గాంధీనగర్‌ (విజయవాడ సెంట్రల్‌): ఎస్సీ సామాజికవర్గ ఎమ్మెల్యేలు, ఎంపీలందరి విజ్ఞప్తి మేరకు విజయవాడ నడిబొడ్డున ఉన్న స్వరాజ్‌ మైదానం (పీడబ్ల్యూడీ గ్రౌండ్స్‌)లో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ 125 అడుగుల నిలువెత్తు విగ్రహం ఏర్పాటుకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సానుకూల నిర్ణయం తీసుకున్నారని సాంఘిక సంక్షేమశాఖ మంత్రి పినిపె విశ్వరూప్‌ తెలిపారు. మంత్రులు వెలంపల్లి, పెద్దిరెడ్డి, ఎమ్మెల్యేలు మేరుగ నాగార్జున, కైలే అనిల్‌కుమార్‌తో కలసి మంగళవారం ఆయన స్వరాజ్‌మైదానం వద్ద విలేకరులతో మాట్లాడారు. 

► స్వరాజ్‌ మైదానంలో 125 అడుగుల అంబేడ్కర్‌ విగ్రహం ఏర్పాటుతో పాటు 20 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న మైదానాన్ని బాగా అభివృద్ధి చేసి.. అందులో మెమోరియల్‌ పార్కును నిర్మిస్తాం. వైఎస్సార్‌ జయంతి సందర్భంగా బుధవారం సాయంత్రం 4 గంటలకు సీఎం జగన్‌ చేతుల మీదుగా ఈ విగ్రహ నిర్మాణానికి శంకుస్థాపన జరుగుతుంది.
► స్వరాజ్‌ మైదానం పేరును ‘డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ స్వరాజ్‌ మైదాన్‌’గా మార్చుతున్నాం. 
► విగ్రహ నిర్మాణాన్ని ఏడాది కాలంలో పూర్తి చేయాలని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి గడువు విధించారు. 
ఏర్పాట్లపై కలెక్టర్‌తో చర్చిస్తున్న మంత్రులు పెద్దిరెడ్డి, విశ్వరూప్, వెలంపల్లి, ఎమ్మెల్యే మేరుగ 

గ్రాఫిక్స్‌కే పరిమితం చేసి చంద్రబాబు మోసం..
► స్మృతివనం పేరిట అంబేడ్కర్‌ విగ్రహమంటూ చంద్రబాబు వాగ్దానం చేసి, దానిని ఎంతవరకు అమలు చేశారో అందరికీ తెలుసు. ఎక్కడో జనసంచారం లేనిచోట దానికి శంకుస్థాపన చేసి, దాన్ని కూడా గ్రాఫిక్‌లకే పరిమితం చేశారు. 
► అంబేడ్కర్‌ లాంటి మహానాయకుడి విగ్రహం జనసంచారం తక్కువగా ఉండేచోట కాకుండా విజయవాడ నగర నడిబొడ్డున ఉంటేనే ఘనంగా నివాళులు అర్పించినట్టు అవుతుందని దళిత సంఘాలు, మేధావులు సూచించిన మీదట సీఎం జగన్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు. 
► ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం దళిత లోకమే కాదు.. ప్రజలందరూ గర్వించదగినదని మేరుగ నాగార్జున అన్నారు. అంబేడ్కర్‌ లాంటి మహానుభావుడికి చంద్రబాబు అవమానం చేస్తే.. జగన్‌ రాష్ట్రమే గర్వపడే నిర్ణయం తీసుకున్నారన్నారు.

మరిన్ని వార్తలు