ఆర్నెల్లు ముందుగానే ‘వైఎస్సార్‌ నేతన్న నేస్తం’

20 Jun, 2020 05:01 IST|Sakshi

నేడు కంప్యూటర్‌ బటన్‌ నొక్కి ఖాతాలకు నగదు జమ చేయనున్న సీఎం జగన్‌

మగ్గం ఉన్న చేనేత కుటుంబాలకు రూ.24 వేల చొప్పున వరుసగా రెండో ఏడాది సాయం

81,024 చేనేత కుటుంబాలకు రూ.194.46 కోట్ల లబ్ధి

సాక్షి, అమరావతి: కరోనా సంక్షోభం కారణంగా ప్రభుత్వానికి ఆదాయం పూర్తిగా తగ్గిపోయినా ఇచ్చిన మాట నెరవేర్చడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నవరత్నాలను అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా సొంత మగ్గం కలిగి దారిద్ర రేఖకు దిగువనున్న ప్రతి చేనేత కుటుంబానికి ‘వైఎస్సార్‌ నేతన్న నేస్తం’ ద్వారా రూ.24 వేల చొప్పున ఆర్థిక సాయాన్ని వరుసగా రెండో ఏడాది అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. సీఎం వైఎస్‌ జగన్‌ శనివారం తన క్యాంపు కార్యాలయం నుంచి కంప్యూటర్‌ బటన్‌ నొక్కడం ద్వారా ఆర్నెల్ల ముందుగానే లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు నేరుగా నగదు బదిలీ చేయనున్నారు.  

ఆప్కో బకాయిలూ విడుదల... 
► ప్రభుత్వం ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందుల కన్నా చేనేత కుటుంబాల కష్టమే పెద్దదనే ఉద్దేశంతో ఆర్నెల్ల ముందుగానే వైఎస్సార్‌ నేతన్న నేస్తం ద్వారా నగదు జమ చేయాలని ముఖ్యమంత్రి జగన్‌ నిర్ణయించారు. గత ఏడాది డిసెంబర్‌లో తొలిసారిగా మగ్గం ఉన్న చేనేత కుటుంబాలకు రూ.24 వేల చొప్పున ఆర్థిక సాయం అందించారు.  
► రాష్ట్రంలో 81,024 చేనేత కుటుంబాలకు రూ.24 వేల చొప్పున రూ.194.46 కోట్లను వారి బ్యాంకు ఖాతాలకు జమ చేయనున్నారు. గత ప్రభుత్వాలు చేనేత కుటుంబాలకు ఇలా ఆర్థిక సాయం అందించిన దాఖలాలు లేవు.  
► గత ప్రభుత్వం ఆప్కోకు బకాయిపడ్డ రూ.103 కోట్లతో పాటు కరోనా నియంత్రణ మాస్కుల తయారీకి రూ.109 కోట్లను కూడా విడుదల చేసి చేనేత కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం కొండంత అండగా నిలిచింది.  

మరిన్ని వార్తలు