‘మనబడి నాడు-నేడు’ ప్రారంభించిన సీఎం జగన్‌

14 Nov, 2019 11:35 IST|Sakshi

సాక్షి, ఒంగోలు: బాలల దినోత్సవం సందర్భంగా ‘మనబడి నాడు-నేడు’ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు. గురువారం స్థానిక పీవీఆర్‌ బాలుర పాఠశాలలో ఈ కార్యక్రమానికి సీఎం జగన్‌ శ్రీకారం చుట్టారు. అంతకుముందు భారత తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ జయంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి సీఎం వైఎస్‌ జగన్‌ నివాళులర్పించారు. అనంతరం బాలల దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి నాడు – నేడు కార్యక్రమాన్ని జ్యోతిప్రజ్వలన చేసి అధికారికంగా ప్రారంభించారు. అంతకుముందు పాఠశాలలో ఏర్పాటు చేసిన డాక్టర్‌ వైఎస్సార్‌ కంటి వెలుగు, వైఎస్సార్‌ కిశోర వికాసంకు సంబంధించి ప్రత్యేకంగా స్టాల్స్‌ను సీఎం పరిశీలించారు.  

‘మనబడి నాడు-నేడు’లో భాగంగా వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కోసం రూ.12 వేల కోట్లను కేటాయించనుంది. తొలి దశలో 15,715 పాఠశాలల్లో 9 రకాల సౌకర్యాలతో అభివృద్ది చేయనున్నారు. అయితే రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా సర్కారీ స్కూళ్లకు ఇంత భారీ బడ్జెట్‌ కేటాయించిన తొలి సీఎంగా వైఎస్‌ జగన్‌ చరిత్రలో నిలిచిపోనున్నారు. (చదవండి: 1 నుంచి 6 వరకు ఇంగ్లిష్‌ మీడియం)

మరిన్ని వార్తలు