‘వైఎస్సార్‌ వాహన మిత్ర’ రెండో విడత ప్రారంభం

4 Jun, 2020 11:45 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: రెండో విడత వైఎస్సార్‌ వాహన మిత్ర కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం ప్రారంభించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి కంప్యూటర్‌ బటన్‌ నొక్కి నేరుగా రూ.262.49 కోట్లను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు. ఆటో, ట్యాక్సీ ఉన్న 2,62,493 మంది లబ్దిదారులకు రెండో విడతగా రూ.10వేలు ఆర్ధిక సాయం అందనుంది. ఆటో, ట్యాక్సీ కార్మికులను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడారు. (ఆటోవాలా.. మురిసేలా)

గత ఏడాది కంటే అదనంగా 37,756 మంది లబ్ధిదారులను రవాణా శాఖ ఎంపిక చేసింది. ప్రభుత్వ ప్రణాళిక ప్రకారం వైఎస్సార్‌ వాహన మిత్ర లబ్ధిదారులకు అక్టోబర్‌లో రూ.పది వేలు ఇవ్వాల్సి ఉంది. అయితే కరోనా కష్టాల నేపధ్యంలో నాలుగు నెలల ముందుగానే సాయం విడుదల చేయనున్నారు. ఈ పథకానికి ఎనిమిది కార్పొరేషన్ల ద్వారా రెండో ఏడాది ఆర్థిక సాయాన్ని విడుదల చేశారు. కొత్తగా ఆటోలు కొన్నవారికీ వాహన మిత్ర పథకాన్ని వర్తింపజేశారు. గతేడాది సెప్టెంబరు 23 నుంచి ఈ ఏడాది మే 16 వరకు వాహనాల కొనుగోలు, యాజమాన్య బదిలీ హక్కులు పొందిన వారిని అర్హులుగా ఎంపిక చేశారు. 

వాహన మిత్ర కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్వహిస్తున్న వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రకాశం జిల్లా నుంచి రాష్ట్ర మంత్రులు బాలినేని శ్రీనివాసులు రెడ్డి, ఆదిమూలపు సురేష్, చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం, సంతనూతలపాడు ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌బాబు, గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు, జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ రవాణా శాఖ అధికారులు పాల్గొన్నారు. చిత్తూరు నుంచి ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి, రామచంద్రారెడ్డి, ఎంపీ రెడప్ప, కలెక్టర్ భరత్ గుప్త , ఏపీఐఐసీ చైర్మన్ ఆర్ కె రోజా, ఎమ్మెల్యేలు శ్రీనివాసులు,నవాజ్ బాషా,ఎం ఎస్ బాబు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు