‘వైఎస్సార్ యాప్’‌ను ప్రారంభించిన సీఎం జ‌గ‌న్‌

26 Jun, 2020 15:27 IST|Sakshi

సాక్షి, అమరావతి : దేశంలో ఏ రాష్ట్రంలోనూ చేయని విధంగా ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు మేలు చేసేందుకు ప్రభుత్వం ప్రారంభించిన రైతు భరోసా కేంద్రాలను మరింత బలోపేతం చేసేందుకు రాష్ట్రం ప్ర‌భుత్వం చ‌ర్యలు చేపట్టింది. రైతుభరోసా కేంద్రాల ద్వారా రైతులకు అందుతున్న సేవలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు వ్యవ‌సాయశాఖ రూపొందించిన వైఎస్సార్ యాప్‌ను ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి క్యాంప్ కార్య‌ల‌యంలో శుక్రవారం ప్రారంభించారు. ఈ యాప్‌ను రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా కేంద్రాల సిబ్బంది డౌన్‌లోడ్ చేసుకోవడం ద్వారా ప్రభుత్వ పరంగా వ్యవసాయం, అనుబంధ రంగాల్లో అమలు చేస్తున్న కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాలు, రైతు భరోసా కేంద్రాల్లోని పరికరాలు, వాటి వినియోగం తెలుసుకోవ‌చ్చు.  

అలాగే స‌ద‌రు పరికరాల్లో ఏదైనా సమస్యలు ఏర్పడినప్పుడు తక్షణం స్పందించేందుకు వీలుగా సమాచారం అందుబాటులో ఉంటుంది. ప్రజల కోసం కొత్తగా రూపొందిస్తున్న పథకాలపై వివిధ వర్గాల నుంచి ఫీడ్‌బ్యాక్‌ను కూడా స‌రైన స‌మ‌యంలో ప్రభుత్వానికి అందించేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఈ యాప్‌లో రైతుభరోసా కేంద్రాల ద్వారా రైతులు వేసే పంటలను ఈ-క్రాప్ కింద నమోదు చేయడం, పొలంబడి కార్యక్రమాలు, సిసి ఎక్స్‌పెరిమెంట్స్, క్షేత్రస్థాయి ప్రదర్శనలు, విత్తన ఉత్పత్తి క్షేత్రాలను సందర్శించడం, భూసార పరీక్షల కోసం నమూనాల సేకరణతోపాటు పంటల బీమా పథకం, సేంద్రీయ ఉత్పత్తుల కోసం రైతులను  సిద్దం చేయడం, రైతులకు ఇన్‌పుట్స్ పంపిణీ వంటి అన్ని కార్యక్రమాలను ఆర్‌బీకే సిబ్బంది ఎప్పటికప్పుడు నమోదు చేస్తారు. దీనిని ఉన్నతస్థాయిలోని అధికారులు, ప్రభుత్వం పర్యవేక్షిస్తుంది. (రైతు భరోసా కేంద్రంలోనే ఇ– క్రాపింగ్‌: సీఎం జగన్‌)

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రైతు భరోసా కేంద్రాల్లో (ఆర్‌బీకే) డిజిటల్ రిజిస్టర్‌ను నిర్వహించడం, ఆర్‌బీకే ఆస్తులను పరిరక్షించడం, ఎక్కడైనా పరికరాల్లో సమస్యలు ఏర్పడినప్పుడు వాటిని సకాలంలో రిపోర్ట్ చేయడం, డాష్‌బోర్డ్‌లో ఆర్‌బీకే కార్యక్రమాలను పర్యవేక్షించడం, విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ల కార్యకలాపాలను పర్యవేక్షించడం, వివిధ పథకాలకు సంబంధించి సర్వే చేయడం, ప్రజల నుంచి ఫీడ్‌బ్యాక్‌నులను తీసుకోవడం కూడా ఈ యాప్ ద్వారా సాధ్యపడుతుంది. ఆర్‌బికె పెర్ఫార్మ్‌న్స్ డాష్‌బోర్డ్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆర్‌బీకే పనితీరును పరిశీలించడం, సరిపోల్చడం, మెరుగైన పనితీరు కోసం ఎప్పటికప్పుడు సిబ్బందికి దిశానిర్ధేశం చేసేందుకు వీలుగా దీనిని రూపొందించారు. (ధనికులకు బాబు.. పేదలకు జగన్‌)

రైతులకు సంబంధించి క్షేత్రస్థాయిలో వారి అవసరాలను తీర్చడం, వారికి మెరుగైన సేవలను అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కూడా సమాచారం పొందేలా ఈ యాప్‌ రూపకల్పన చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో వ్యవసాయశాఖ మంత్రి కుర‌సాల‌ కన్నబాబు, వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి, వ్యవసాయశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనం మాలకొండయ్య, అగ్రికల్చర్ కమిషనర్ అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.(ఆర్బీకేల నుంచే పండ్లు, కూరగాయల విత్తనాలు, మొక్కలు)

మరిన్ని వార్తలు